29, జనవరి 2023, ఆదివారం

10th Class Telugu Work Book

10 వ తరగతి తెలుగు
1. దానశీలము
ముఖ్య పదాలు: 
నీరజభవుడు
 జీవధనములు
త్రివిక్రముడు
వింధ్యావళి
బ్రహ్మ
మానధనులు
విష్ణువు
                     వదాన్యోత్తముడు
క్షేత్రం
                      బలిచక్రవర్తి

 
పాఠ్యభాగ ముఖ్యాంశాలు:
దాతలలో గొప్పవాడు బలిచక్రవర్తి.
పొట్టివాడు విష్ణువు.
మూడు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించుకుంటాడని కులగురువైన                             శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి హితబోధ చేస్తాడు.
దానికి బలిచక్రవర్తి మహాత్మా! అర్థం, కామం, కీర్తి, జీవనాధారం – వీటిలో ఏది అడిగినా ఇస్తానని               చెప్పాను. ఇప్పుడు మాట తప్పలేనని అంటాడు.
పూర్వం రాజులు ఉన్నారు. వారు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. శిబిచక్రవర్తిని లోకం మరువలేదు కదా! అని శుక్రాచార్యునితో బలి అంటాడు.
వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే ! నా నాలుక వెనుదిరుగదు అని చెబుతాడు.
ఓ ఉత్తమ బ్రహ్మచారీ! నీ పాదాలు కడగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి? అని వామనుని పాదాలను కడుగుతాడు బలిచక్రవర్తి.
‘బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు, నీకు మూడడుగులు దానం చేస్తున్నానని’  పలికి నీటిని ధారపోశాడు.
వామనునికి బలిచక్రవర్తి దానమియ్యగానే నలుదిక్కులూ, పంచభూతాలు ‘బళి బళి’ అని పొగిడాయి.

 I) లఘు సమాధాన ప్రశ్నలు
1. “ఈ కుబ్జుండు అలతిఁబోడు” అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ‘ఉద్దేశమేమై’ ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా?
   జ: వామనుడు సామాన్యుడు కాడని, తాను అడిగిన మూడు అడుగుల నేలతో పోడని, ఆ మూడడుగుల పేరుతో, మూడులోకాలనూ కొలుస్తాడనీ, బ్రహ్మాoడo అంతా నిoడిపోతాడనీ, బలి చక్రవర్తి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొంటాడనీ, శుక్రాచార్యుడు చెప్పిన మాటల్లోని సారాంశం.  రాక్షస వంశ గురువైన శుక్రాచార్యుడు, రాక్షసరాజు బలిని కాపాడాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాడు. బలి చక్రవర్తిని తన వంశాన్ని, రాజ్యాన్నినిలుపుకోమని ఉపదేశించాడు. కనుక  నేను కూడా శుక్రాచార్యుని మాటలతో  ఏకీభవిస్తాను. 
2. హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు? 
జ: హాలికుడంటే రైతు. రైతును దేశానికి వెన్నెముక అంటారు. కాని రైతుకు వసతి సౌకర్యాలేవి కల్పించరు. మంచిపొలం, విత్తనాలు, నీటివసతి, ఎరువులు, పొలంలో పనిచేసేoదుకు చౌకగా కూలీలు దొరికితే, రైతు తృప్తి చెందుతాడు. తాను పండించిన పంటను అమ్ముకొనేందుకు మార్కెట్ సదుపాయం ఉండి, దళారి వ్వవస్థ లేకపోతే మరింత బాగా తృప్తి చెందుతాడు.
]

3. ‘సిరి మూట గట్టుకొని పోవంజాలిరే?’ అనడంలో బలి చక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది?
జ: పూర్వం ఎందరో రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ధన ధాన్య సంపదలు కూడబెట్టారు. కాని, వారు మరణించినపుడు వాటిని తమ వెంట తీసుకెళ్ళలేదు. ఎవరూ తాము సంపాదించిన సిరిసంపదలను చనిపోతూ కూడా తీసుకువెళ్ళరు. సంపదలు శాశ్వతం కావనీ, వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలే శాశ్వతంగా నిలుస్తాయనీ, బలి చక్రవర్తి మాటల్లోని ఆంతర్యం.
4.ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వం ఎలా ఉందని భావిస్తున్నారు?
జ: పోతనగారి కవిత్వం, శబ్దాలంకారాల సొగసుతో పండిత పామరులకు నచ్చేవిధంగా ఉన్నది. వామన చరిత్రలోని పోతన గారి పద్యాలు తెలుగు వారి నాలుకలపై నాట్యమాడుతూ ఉంటాయి. అంత్యాను ప్రాసలు ఎక్కువగా కనబడుతాయి.  తన కవిత్వంలో శబ్దాలంకారాలను ఎక్కువగా ప్రయోగించాడు. అర్థాలంకారాలను కూడా సందర్భానుసారంగా ప్రయోగించాడు. ఈ వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి దానగుణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. బలిచక్రవర్తి తాను ఇచ్చినమాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరిస్తున్నా కాదంటూ ‘వామనుని’ కోరిక మేరకు దానం చేసే, ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయoగా వర్ణించాడు.
5. ‘ఆడినమాట తప్పగూడదు’ ఎందుకు?
జ: పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డపని చేసినవాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేను అని చెప్పింది! అంతేకాదు, తాను అన్నమాటకు కట్టుబడి సత్యంతో బతకడం, అభిమానధనులైన వారికి ఉత్తమ మార్గం. ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం సంభవించినా, ధన ప్రాణాలకు చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పరు. సత్యం మాట్లాడేవారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. కాబట్టి ఆడినమాట తప్పకూడదు.  
II) కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) నేటి సమాజానికి దాతృత్వం కల వ్యక్తుల ఆవశ్యకతను తెలపండి.
  జ:  నేటి సమాజంలో ధనవంతులు, పేదవారు ఉన్నారు. మహాసంపన్నుల వద్ద ధనం మూలుగుతోంది. వారంతా ఆ ధనాన్ని విదేశీబ్యాంకుల్లో దాస్తున్నారు. తమ పిల్లలకు ఇస్తున్నారు. సమాజంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వారికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తాగడానికి మంచి నీరు దొరకడం లేదు. కాబట్టి ధనవంతులు దాతృత్వ గుణాన్ని పెంపొందించుకొని, బీదవారికి తోచిన సహాయం చేయాలి. మంచి విద్యాలయాలు, వైద్యశాలలు ప్రారంభించి బీదవారికి సాయపడాలి. ఆదాయం పన్నులు ఎగ్గొట్టి ఎంత ధనాన్ని సంపాదించినా వారు చనిపోయేటప్పుడు ఆ ధనాన్ని వెంట తీసుకెళ్ళరు. ఎంత లక్షాధికారైనా లవణమూ, అన్నమే తింటాడు. కాని బంగారాన్ని తినడు. ఈ సత్యాన్ని ధనవంతులు గుర్తించి తమ సొమ్ములో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చుపెట్టాలి. అలా చేస్తే స్వర్గాది పుణ్యలోకాలు లభిస్తాయి. మానసిక ఆనందం కలుగుతుంది.
ఆ) ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను  తెలుపుతూ నినాదాలు సూక్తులు రాయండి.
 జ:  నేటికి ఈ సమాజం ఈ విధంగా, మంచిగా ఉందంటే కారణం, ఆడినమాట తప్పనివారు, దానగుణం కలిగిన వారు ఉండడం. కాబట్టి ఆడినమాట తప్పడం కన్నా మరణించడం మేలు. దానగుణం అన్ని గుణాల్లో గొప్పది.
ఆడినమాట తప్పకపోవడం
      నినాదాలు :
ఆడి తప్పకండి – పలికి బొంకకండి.
ఇచ్చినమాట నిలబెట్టుకోండి – నీతిగా బతకండి. 
మాటమీద నిలబడండి – పౌరుషంగా బతకండి.
మితంగా మాట్లాడండి – అమితంగా విలువివ్వండి 
సూక్తులు :
మాటకు ప్రాణం సత్యం
మానధనులు మాట తప్పరు
ప్రాణం కంటే మాటవిలువైనది
దానగుణం
నినాదాలు :
రక్తదానం చేయండి  - ప్రాణాలు కాపాడండి
విద్యాదానం చేయండి – వివేకం పెంచండి
దానధర్మాలకు కాని ధనం – ఎంతున్నా దండుగే

పువ్వు గుర్తు గల పద్యాలు
1. కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతింబొందరే ?
 వారేరి? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపై
 బేరైనం గలదే ? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశ:కాములై 
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా ! 
 ప్రతిపదార్థo:
భార్గవా ! =  ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)
రాజులు = ఎంతోమందిరాజులు
కారే = కాలేదా ?
రాజ్యముల్ = రాజ్యములు
కలుగవే =  పొందలేదా ఏమి ? 
గర్వ = అహంకారంతో
ఉన్నతిన్ = గొప్పదనాన్ని
పొందరే  = పొందలేదా  ఏమి ?
వారు= వాళ్ళందరు
ఏరి= ఎక్కడ ఉన్నారు ?
సిరిని =సంపదలను
మూటగట్టుకొని = కూడగట్టుకొని
పోవన్+ చాలిరే = తీసుకెళ్ళగలిగారా, లేదు
భుమిపైన్ = నేలపైన  ( ఈ భూలోకంలో )
పేరు+ ఐనన్ = కనీసము పేరైన
కలదే  = ఉన్నదా, లేదు
శిబి = శిబి చక్రవర్తి
ప్రముఖులున్ = మొదలగువారు
యశః = కీర్తిని
కాములు + ఐ  = కోరువారై
కోర్కులు  = దానములను
ప్రీతిన్ = సంతోషముతో
ఈరే  =  ఇవ్వలేదా
ఈ  =  ఇప్పటి
కాలమున = కాలమునందు
వారలన్  =  వారిని
మఱచిరే  =   మరచిపోయారా,  లేదు.  (మరచిపోలేదని భావం)
2. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము, కానిమ్ము పో;
హరుడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ ; వినుమా ! ధీవర్య ! వేయేటికిన్?
 ప్రతిపదార్థo:
ధీవర్య          =  ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా!)
నిరయంబు +  ఐన = నరకము దాపురించినా
నిబంధము + ఐన  = అనారోగ్యo కలిగిన
ధరణీ     = రాజ్యము
నిర్మూలనంబు = నాశనము
ఐనన్   =  అయినా సరే
దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా
కుల + అంతము + ఐన  = వంశం నాశనమైన
నిజమున్  =  నిజంగానే పైవన్నీ
రానిమ్ము  =  వస్తే రాని
కానిమ్ము  =  జరిగెడిది జరగనిమ్ము
వేయేటికిన్ =  వేయి మాటలు దేనికి
వినుమా = వినుము
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుడు = శివుడు
ఐనన్ = అయినా
హరి = విష్ణువు
నీరజభవుడు+ ఐన = బ్రహ్మదేవుడైనా
నాదు  = నా యొక్క
జిహ్వ = నాలుక
ఔన్   =  ఇస్తానని
తిరుగన్  = వెనుతిరుగుట (మాట తప్పడం)
నేరదు  = చేయలేదు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
1. సత్య వాక్యాన్ని పలకడంలోనూ, దానశీలం కలిగి యుండడంలోనూ గల విశిష్టతను తెలుపుతూ (వ్యాసం) రాయండి.         
  సత్య దాన విశిష్టత : సత్యాన్ని మించిన దైవము లేదు. సత్యవాక్యాన్ని మించిన ధర్మం లేదు. ఆడి తప్పరాదు. తనకున్న దానిలో పరులకు కొంత దానం చేయాలి. ఈ జన్మలో అధిక దానాలు చేస్తే, మరుసటి జన్మలో మరింతగా సంపన్నుడిగా జన్మిస్తాడు.  మనం పుట్టినప్పుడు మన వెంట ఏ ధనాన్ని తేలేదు. తిరిగి చనిపోయినప్పుడు మన వెంట ఏమి తీసుకుపోము. బలిచక్రవర్తి గురువు గారికి చెప్పినట్లు, ఎందరో రాజులు తాము చక్రవర్తులమని గర్వించారు. వారు చనిపోయినప్పుడు, వారు సంపాదించిన ధనాన్ని వెంట తీసుకుపోలేదు. నేడు లోకంలో వారి పేరు కూడా లేదు. శిబి చక్రవర్తి, కర్ణుడు వంటి గొప్పదాతలు చేసిన దానాలను గూర్చి, వారి త్యాగాలను గూర్చి, నేటికి లోకంలో చెప్పుకుంటారు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది.
   హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే మాట్లాడాడు. చివరకు ఆ కష్టాలను అధిగమించాడు. రంతిదేవుడు, సక్తుప్రస్థుడు వంటి దాతలు, తమ సర్వస్వాన్నీ దానం చేసి పేరు పొందారు. ప్రాణాలు పోతాయని తండ్రి దేవేంద్రుడు హెచ్చరించినా, కర్ణుడు కవచకుండలాలు బ్రాహ్మణుడికి దానం చేశాడు. బలి చక్రవర్తి గురువు కాదన్నా, మూడు అడుగుల భూమిని వామనునికి ధారపోశాడు.  సత్యం, దానం విశిష్టగుణాలు, మనం సత్యమే పలుకుదాం. మనకు ఉన్నంతలో పరులకు దానం చేద్దాం.
2. రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేయడం పట్ల ప్రజలలో చైతన్యం కలిగించేలా ‘కరపత్రం’ తయారుచేయండి. 
దానగుణం
   వదాన్యులారా! మానవత్వం మూర్తీభవించిన కరుణామూర్తులారా ! సోదర సోదరీమణులారా !
        దానగుణం పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన పూర్వులు మహాదాతలు. మనమూ ఆ బాటలో నడుద్దాం. అన్నదానం చేస్తే ఒక్కపూట ఆకలి తీర్చిన పుణ్యం వస్తుంది. ధన దానం చేస్తే కొన్ని అవసరాలను తీర్చినవారo అవుతాం. వస్త్రదానం చేస్తే కొద్దికాలమే ఆ వస్త్రాలు ఉపయోగిస్తాము. రక్తదానం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణదానం చేసిన పుణ్యం వస్తుంది. నేత్రదానం చేస్తే మరణించిన తర్వాత కూడా గ్రహితద్వారా లోకాన్ని చూడవచ్చు. అవయవదానం చేసినా శాశ్వతంగా జీవించవచ్చు. దానం చేద్దాం. తోటివారికి సాయపడుదాం.                                        
                                                                                                                    ఇట్లు
                                                                                        అవయవదాన కమిటీ,
                                                                                        నాదర్ గుల్,
                                                                                          హైదరాబాద్.
దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. 
                                                                                                                                  హైదరాబాద్,
                                                                                                                               19-03-2018. ప్రియమైన మణికంఠ !
        ఎట్లున్నవు ? నేను బాగున్న. బాగా చదువుతున్న. మాతరగతిలో మొన్ననే “ దానశీలం ” అనే పాఠం చెప్పుకున్నాo.  మా గురువు గారు బలిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని చాలా చక్కగా వివరించారు. దానం చేయాలని చెప్పారు. శిబి, బలి, కర్ణుడు, రంతిదేవుడు మొదలైన మహాదాతల గురించి వివరించారు. వారి గురించి తెలుసుకొన్న తరువాత నాకోటి అనిపించింది. దానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉoదని, అన్నదానం, విద్యాదానం, రక్తదానం, అవయవదానం మొదలైన దానాల వలన ఎంతో ప్రయోజనం ఉందని కూడా తెలుసుకున్నాం. అందుచేత మనం కూడా ఏదో ఒకదానం చేయాలి. దానం చేయడం వలన చాలా ఆనందం కలుగుతుంది. 
                                                                                                                    ఇట్లు
                                                                                                           కౌశిక్ గౌడ్.  
చిరునామా 
బి. మణికంఠ,
క్రమసంఖ్య  (5)  10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాలాపూర్ గ్రా,  మం,
రంగారెడ్డి జిల్లా.
పిన్ నెం 501510.


ప్రశ్నల నిధి:
I) లఘు సమాధాన ప్రశ్నలు 
  1. ఈ పాఠ్యభాగ కవి పరిచయము రాయండి.
  2. ఈ పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
  3. ప్రస్తుత పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది. 
  4. బలిచక్రవర్తి స్వభావం గురించి రాయండి.
  5. “మాట దిరుగలేరు మానధనులు” ఈ మాటను మీరు సమర్థిస్తారా ?
  6. సిరి మూట గట్టుకొని పోవం జాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది ?
II) వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 
  1. పోతన రచనలోని గొప్పతనాన్ని వివరింపుము?
  2. పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి. 
  3. దాన శీలము కలిగిన వ్యక్తుల వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి?
III) సృజనాత్మకత
  1. దానం యొక్క గొప్పతనాన్ని వివరించే నినాదాలు రాయండి.
  2. దానగుణం పెంచుకోమని కోరుతూ కరపత్రం తయారు చేయండి.
  3. దానం చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.   





 నికష
I) ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.                4మా 
     1. ఆడినమాట తప్పకూడదు ఎందుకు ?
    2. మానధనులంటే ఎవరు ? వారి స్వభావం ఎట్లాంటిది ?
II) ఈ కింది పద్యమును పూరించి, భావం రాయండి.        3మా 
     కారే రాజులు ............................. భార్గవా!
III) ఈ కింది పదాలకు అర్థాలు రాయండి.            3మా 
    1. హరి =                                    2. ధరణి =                                    3. అభ్యాగతుడు =
  












10 వ తరగతి తెలుగు 
2. ఎవరి భాష వాళ్లకు వినసొంపు 
 I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు
ఏదైనా ఒక సంఘటనను సంభాషణగా రాయగలగాలి.
విద్యార్థులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను చక్కగా వివరించడం అలవరచుకోవాలి.
 భాషలోని పలుకుబళ్ళు, నుడికారాలు, జాతీయాలు గుర్తించగలగాలి.
పసందైన ప్రాంతీయ భాష గురించి మాట్లాడగలగాలి.
రచయిత గురించి సొంతమాటల్లో రాయగలగాలి.

II) ముఖ్యపదాలు - అర్థాలు 
ఇగపటు  =   ఇదిగోనండి
పలుకుబడి = మాట తీరు
నుడికారము = మాట సొగసు
వాగ్ధాటి = మాటల జోరు
యాదికి  = గుర్తుకు
ప్రాంతీయ భాష = ప్రాంతములో మాట్లాడు భాష
ఉద్దండ పండితులు= గొప్ప పండితులు
జర్దా, డబ్బీ= తాంబూలంలో వేసుకొనే నల్లపొగాకు ఉన్న చిన్న డబ్బా
గ్రాంథిక భాష = గ్రంథములందలి భాష
10.  మాండలిక భాష = ఆయా మండలాల్లోని వాడుక భాష
11.వ్యవహారికభాష =  వ్యవహారంలోని భాష  (మాట్లాడే భాష)
12.ఉస్తాద్ = గురువు, బోధకుడు
  III) చర్చనీయ అంశాలు :
 1. ఏ ప్రాంతం వాళ్ళ తెలుగు ఆ ప్రాంతం వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది.
 పాతనీరు పోయి కొత్తనీరు వస్తున్నట్టుగా భాష నిరంతరం మారుతూ ఉంటుంది. అది సహజ లక్షణం. అదే సజీవ లక్షణం. అలాగే ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతూ ఉంటుంది. ఇది క్రియా రూపాల్లోనే గాక నామవాచాకాల్లో, సంబోధనల్లో, మర్యాదల్లోనూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలోని మనుషుల జీవన విధానం, వ్యవహార శైలి, పాలకుల విధానం పరిసర భాష ప్రభావం, అక్కడ ఉత్పత్తులు, వనరుల వినియోగం తదితర అంశాలు భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి. అదే విధంగా ప్రతి పది మైళ్ళకు భాషలో భేదం ఉంటుంది. భాష పరమార్థం భావ వినిమయమే కాబట్టి ఎక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడ మాట్లాడే భాషకు బాగా అలవాటు పడతారు. చెవులకు ఇంపుగా, హృదయాన్ని తాకేటట్లుగా ఉండే ఆ భాష వాళ్ళ రక్తంలో రక్తమై విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే భాష తల్లి వంటిదని గౌరవిస్తూ ఆత్మీయానందాన్ని అనుభవిస్తుంటాం. మనదైన భాష మనకు ఇంపూ, సొంపు. అలవాటులో లేని భాష విన్నప్పుడు అసౌకర్యంగానే కాక విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే ఎవరి భాష వాళ్లకు గొప్పదనిపిస్తుంది.  
2. గురుస్థాననీయులు :
  అంటే గురువు స్థానానికి తగినవారు. భారతీయ సంస్కృతిలో  గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. దేవుని కంటె గురువే గొప్పవాడంటాడు కబీరుదాసు. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెప్పినవాడు గురువే. మనలోని సృజనకు బీజాలు వేసి, ఉత్తమ గుణాలను పోషించి, చెడును జయింపజేసి జీవితాన్ని జ్ఞానభరితంచేయగల స్వరూపం గురువు. అలాంటి జ్ఞానం, ప్రేరణ, మార్గదర్శనం ఇచ్చే ప్రతి ఒక్కరినీ గురువుతో సమానంగా భావించడం ఉత్తమ సంస్కారం.అలాంటి వారందరూ గురుస్థానీయులే.
౩. గురువులలో ఆశించదగిన ప్రత్యేకతలు :
 గురువంటే సర్వశ్రేష్టుడు. వక్తృత్వం, ధృతి, స్మృతి, కృతి, నమ్రత, ఉత్సాహం, జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఉత్తమ గురువులుగా భాసిoచగలరంటారు పెద్దలు. అంటే బయట, మనసులో స్వచ్చంగా ఉండే వాళ్ళు, మంచి జ్ఞానవంతులు, చక్కగా మాట్లాడడంతో పాటు పట్టుదల, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, వినయo, ఉత్సహం, కొత్తవిషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిరంతరం కృషి చేసేవాళ్ళు, వాళ్ళ విధులను ఏలోపం లేకుండా నిర్వర్తిస్తే చాలు. పిల్లలంతా ప్రభావితులవుతారు. అంటే 
 అ) ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపిస్తుండాలి.
 ఆ) ఏది అడిగినా చక్కగా అర్థమయ్యేటట్లు వివరించాలి.
 ఇ) ప్రేమతో, మంచి మాటలు మాట్లాడాలి.
 ఈ) పట్టుదలతో పనిచేస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపాలి.
 ఉ) మంచి జ్ఞాపకశక్తి కలిగి విషయాన్ని బోధించాలి. చర్చించాలి.
 ఊ) ఎప్పటికప్పుడు కొత్తదనం ఉట్టిపడేటట్టుగా బోధన నిర్వహించాలి.
 ఋ) ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి.
 ౠ) కొత్త విషయాలను నేర్చుకునేందుకు తపించాలి.
4. పసందైన ప్రాంతీయ భాష :
  పసందు అంటే బాగా ఇష్టం అని అర్థం. ఏప్రాంతం వాళ్లకు ఆ ప్రాంతంలో మాట్లాడే భాష బాగా నచ్చుతుంది. అలా నచ్చడంలో భాషకు మూలాలైన స్థానిక పదాలు, అన్యభాషా ప్రయోగాలు, పలుకుబడులు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు ..... ఇవన్నీ ఎక్కడి వాళ్ళకక్కడ అప్రయత్నంగా తాము మాట్లాడేటప్పుడు భాషలో ప్రయోగించడం వల్ల అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తాయి. అందుకే ప్రాంతీయ భాష ఆయా ప్రాంతాల వారికి పసందుగా ఉంటుంది. 
5. ఏకలవ్య శిష్యుడు : 
 అంటే ఏకలవ్యుని వంటి శిష్యుడు. ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా విద్య నేర్పించకున్నా, అతనినే గురువుగా భావించి, ధనుర్విద్యలోని మెళకువలన్నీ నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అదే విధంగా తమకు అందుబాటులో లేకున్నా కొందరి గొప్ప లక్షణాల గురించి ప్రేరణ పొంది, ఆయా రంగాల్లో కృషిచేసి పేరు సంపాదించుకునేవారు ఏకలవ్య శిష్యుడినని చెప్పుకున్నారు. 
6. పలుకుబడి, నుడికారం, జాతీయాలు భాషకు అలంకారం వంటివి :
 పలుకుబడి అంటే ఒక ప్రాంతంలోని యాసలో ఉపయోగించే పదం. నుడికారం అంటే ఒకప్రాంత ప్రజల అనుభవం నుంచి పుట్టిన మాటచమత్కారం/విశేషపదo. జాతీయం అంటే ఒక మాట ప్రత్యేకమైన అర్థంలో ఉపయోగించడం అన్నమాట.
 భాష కేవలం భావ వినిమయం చేస్తే, అది నిత్య వ్యవహారానికి ఉపయోగపడుతుంది. అదే భాషను మనోరంజకంగా మలచినప్పుడు అది కళగా భాసిస్తుంది. కళాత్మకంగా మాట్లాడడం, రచనలు చేయడం భాషను కళగా నిలబెడుతున్న అంశాలు. ఆ విధంగా భాష కళాత్మకంగా మారాలంటే అది సాధరాణార్థంలో కాకుండా చమత్కారంగా, విశేషార్థం వచ్చేటట్లు, నిగూడార్థం స్ఫురించేటట్లు రచించటం, మాట్లాడటం జరగాలి. అలా జరగడానికి  దోహదం చేసే  అంశాలే పలుకుబళ్ళు, నుడికారాలు, జాతీయాలు. అందుకే అవి భాషకు అలంకారం వంటివి.  
 IV) పాఠ్యపుస్తకములోని ప్రశ్నలు - జవాబులు
 1. మనుమరాలు మాట విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు?
 జ: రచయిత సామల సదాశివ గారి మనుమరాలు  లావణ్యకి అప్పుడు నాలుగేళ్లు. ఆమెకు తెలుగు రాదు. తెలుగు మాటలను హిందీలోకి అనువదించుకొని మాట్లాడుతుంది. ఆమెకు తెలుగు పలుకుబడి, నుడికారం తెలియదు.
  అలా నాలుగేళ్లు పూర్తిగా నిండని రచయిత మనుమరాలు లావణ్య “ తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని, సదాశివ గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. లావణ్య “ ఇగపటు” అనగా, ఇదిగోనండీ అని అర్థం వచ్చేలా, ఆ ప్రాంతపు తెలుగులో మాట్లాడింది. తీయని ఆ ప్రాంతం తెలుగు, తన మనుమరాలికి పట్టువడినందుకు సదాశివ గారు అబ్బురపడ్డారు.
2. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి. 
జ: కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందిన మహాపండితులు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సామల సదాశివ గారు, లక్ష్మణశాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయకున్నా, వారి సన్నిధానంలో కూర్చుండి, తరచుగా జాబులు రాస్తూ, వారి దగ్గర అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. అందుకే సదాశివ గారు లక్ష్మణశాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావించారు.
3. అందరు యునివర్సిటీ ఆచార్యులుండగా “ ఒక రిటైర్డ్ రెవెనన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి ?” అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది? 
జ: ఒకసారి సామల సదాశివగారు, కాళోజి వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సభలో ఎందరో తెలుగు విద్వాంసులున్నారు. ఎందరో యూనివర్సిటీ ఆచార్యులున్నారు. అంతమంది తెలుగు సాహిత్య పండితులున్న సభకు, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడానికి కారణం ఏమై ఉంటుందా అని సదాశివగారు ఆలోచించారు. బహుశః కాళోజీలకు ఆ రెవెన్యూ ఆఫీసర్ స్నేహితుడేమో అని సదాశివగారు మొదట భావించారు. కాని ఆ అధ్యక్షుడైన రెవెన్యూ ఆఫీసర్ వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువగా వాడకుండా, ఇంగ్లీషు, ఉర్దూ పదాల జోలికి వెళ్ళకుండా చక్కగా మాట్లాడాడు. అప్పుడు సదాశివగారికి ఆయనను ఎందుకు అధ్యక్షుణిగా ఎన్నుకున్నారో తెలిసింది.  యూనివర్సిటీ ఆచార్యులు, రెవెన్యూ ఆఫీసర్ కన్నా బాగా తెలుగు మాట్లాడతారని సదాశివగారి ఉద్దేశం.
4. రచయిత రచన శైలిని ప్రశంసిస్తూ రాయండి.
 సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, మరాఠీ భాషల్లో పండితుడు. సహృదయ విమర్శకుడు. ఈయన రచన సరళంగా, మనసుకు హత్తుకు పోయేటట్లు ఉంటుంది.
  సదాశివగారి వ్యాసశైలి సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ వ్యాసంలో ఆయన స్వీయ అనుభూతులను గుర్తుచేసుకుంటూ, తెలంగాణమాండలికంలోని తీయని తెలుగును గురించి చక్కగా వివరించారు. వీరి రచన చదువుతూ ఉంటే ఒక పుస్తకం చదువుతున్నట్టు కాక, ఆత్మీయుడైన మిత్రునితో మాట్లాడుతున్నంత హాయిగా ఉంటుంది. 
వ్యాసరూప సమాధాన ప్రశ్న :
1. ఈ పాఠం ఆధారంగా సామల సదాశివ గురించి మీకేమి అర్థమయిందో రాయండి.
జ:  సామల సదాశివ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ సాహితీవేత్త.
     తెలుగు, సంస్కృతo, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో పండితుడు.
ఉర్దూ సాహిత్య చరిత్ర , అమ్జద్ రుబాయిలు, మలయమారుతాలు, సంగీత శిఖరాలు, స్వరలయలు మొదలైన రచనలు వీరికి సంగీత సాహిత్యాలలో గల పట్టును తెలియజేస్తున్నాయి. వీరి ‘యాది’ గ్రంథం ఎంతో జనాదరణ పొందింది. సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు గురుస్థానీయులు. సదాశివగారు శాస్త్రిగారి వద్ద కూర్చుండి, తరచుగా జాబులు రాసేవారు. ఆయన నుండి ఎన్నో సాహిత్య విషయాలు వీరు తెలుసుకున్నారు. సదాశివగారు వేలూరి వారికి ఏకలవ్య శిష్యులు. అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబళ్ళనూ, ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవాలని సదాశివగారి అభిప్రాయం. ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినిపిస్తుందని సదాశివగారి తలంపు. సదాశివగారు ఉర్దూలో కూడా మాట్లాడగలరు.  సదాశివగారి తెలుగు వ్యాసాలను ఆంధ్రాప్రాంతం వారు కూడా మెచ్చుకునేవారు. 
V) పదజాలం 
1. కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
 అ)  పసందు = మా అమ్మ చేసిన ఉగాది పచ్చడి పసందుగా ఉంది.
 ఆ) రమ్యం = మా బడిలో పూలతోటలు రమ్యంగా ఉన్నాయి.   
 ఇ) క్షేత్రం = దక్షిణాది పుణ్యక్షేత్రాలలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రo విశిష్టమైనది.
2. నిఘంటువు సహాయంతో కింది పదాలకు నానార్థాలు రాయండి.
  అ) కవి :       కావ్యమురాసినవాడు,   శుక్రుడు,    నీటికాకి
  ఆ) క్షేత్రం :   పుణ్యస్థలం,     భార్య,     వరిమడి 
3. కింది పర్యయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని రాయండి.
  అ) ఇల్లు,  గృహం  =  సదనం 
  ఆ) పొగడ్త, స్తోత్రం  =  ప్రశంస 

4. ప్రకృతి – వికృతులు
అ)  భాష -  బాస
ఆ) కవిత - కైత
ఇ) కథ -  కత
ఈ) స్త్రీ – ఇంతి
5. కింది వ్యుత్పత్త్యర్థాలకు పదాలను రాయండి.
 అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు : గురువు 
 ఆ) భాషించునది : భాష 
VI) వ్యాకరణాంశాలు 
1. కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.
  అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.
   జ: తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు.
       తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు.
 ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
     జ:  నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
     జ:  నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. 
  అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం    లేదు.
జ: తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కాని వాటిని మనం భద్రపరుచుకోవడం    లేదు.
 ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేఖరులు ఉన్నారు.
  జ: నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ పత్రికా విలేఖరులు ఉన్నారు.
ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
  జ: నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. పోతుంటారు.
3. కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి.
 అ) అంబటి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటి వెంకటరత్నం అచ్చు వేయించాడు.
 జ:  అంబటి వెంకటరత్నం కావ్యం రాసి,అచ్చు వేయించాడు.
 ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు     పొందాడు.
 జ: గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.
ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.
 జ: కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

 VII) తరగతి పుస్తకములో రాయవలసిన అంశాలు
 1. మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి
 2. మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుకభాషలో సంభాషణగా రాయండి.
 VIII) గైహికము (ఇంటిపని)
1. పుటసంఖ్య 20, 21 లోని గద్యాంశాలను చదివి, జవాబులను రాయండి.
2. ఈ పాఠంలోని  ప్రశ్న జవాబులు చదివి రాయండి.
IX) అదనపుసమాచారం
1. పాఠము  చదువండి. ముఖ్యాంశాలను గుర్తించి రాయండి.
2. పాఠ్యభాగ ముఖ్యాంశాలను గురించి చర్చించండి.
3. పాఠంలోని వ్యాకరణాంశాలు గుర్తించి రాయండి.
X) ప్రశ్నాపత్రం 
1. ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.                                       5మా 
  అ) మనుమరాలు మాట విని తాతయ్య ఎందుకు అబ్బుర పడ్డాడు?
  ఆ) రచయిత రచన శైలిని ప్రశంసిస్తూ రాయండి.
2. ఈ కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.                                       2 మా 
   అ) పసందు                            ఆ) క్షేత్రం
3. రుగాగమ సంధి సూత్రం రాసి, ఉదాహరణ రాయండి                              2మా 
 4. కింది వాక్యాన్ని సామాన్య వాక్యoగా మార్చoడి.                                   1మా 
  అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.





3. వీర తెలంగాణ
పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 
తెలంగాణ రాష్ట్రం గురించి సొంతమాటల్లో చెప్పగలగాలి. రాయగలగాలి
చుక్కపద్యాలు కంఠస్థo చేసి ప్రతిపదార్థాలు రాయగలగాలి.
అపరిచిత కవితను చదివి జవాబులు రాయగలగాలి.
పదజాలం, వ్యాకరణాంశాలపై చర్చించగలగాలి.
ముఖ్య పదాలు – అర్థాలు 
మహా రవమ్ములు = గొప్పవైన ధ్వనులు 
కృపాణము = కత్తి 
జలధి = సముద్రం 
తెలుగు జెండాలు = తెలుగు వీరుల జయ పతాకాలు 
పథం =మార్గం 
శ్రావణాభ్రము =శ్రావణ మాసంలోని మేఘం 
అట్టహాసము = పెద్దనవ్వు 
లంఘించి =దాటి
చర్చనీయ అంశాలు 
1. బతుకు తోవ చూపే కాలం రావడం :
  బతకడానికి ఆధారాన్ని, బతుకుకు ఆధారమైన మార్గాన్ని బతుకుబాట లేదా బతుకు తోవ అంటారు. తెలంగాణలో సామాన్యులు తమ దారిలో తాము సంపాదించుకునే అవకాశాల్లేవు. అలాంటి పరిస్థితుల్లో నిజాంరాష్ట్ర  (తెలంగాణ) విముక్తి పోరాటం సాగింది. రాష్ట్రం స్వతంత్రమై ప్రజలు ఎవరి బతుకు వాళ్ళు బతకగలిగే పరిస్థితులేర్పడ్డాయి. ఈ కాలం/ పరిస్థితుల గురించి చెబుతూ బతుకు తోవ చూపే కాలం వచ్చింది అని అన్నారు కవి.మరొక అర్థంలో చచ్చే కాలం పోయి బతికే కాలం వచ్చిందని భావం. 
2. గడ్డిపోచ కత్తిగా మారడం :
  సాధారణంగా ‘గడ్డిపోచ’ అనే మాట తేలికైనది, పనికిరానిది, అల్పమైనది అనే అర్థంలో వాడుతారు. తెలంగాణలోని గడ్డిపోచలు కూడా ఖడ్గాలు ధరించి  యుద్ధరంగంలోకి దిగాయని దాశరథి పేర్కొనడంలో ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నివసించే అల్పులు అంటే స్త్రీలు, బాలురు, వృద్ధులు, బలహీనులు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్లు కత్తులుగా మారి యుద్ధంలోకి దూకారని చెప్పడమే.
3. తెలంగాణ నేలలో కాంతి :
  ‘తెలుగు రేగడిలో జిగిమెండు’ అన్నది దాశరథి ప్రయోగం. అంటే తెలంగాణ నేలలో కాంతి అధికం. అంటే ఇక్కడ నివసించే వాళ్లలో తేజస్సు, ఉత్సాహం, బుద్ధి మొదలైనవి ఎక్కువ అని అర్థం. అయితే రేగడిలో ‘జిగి’ అనే ప్రయోగం చేయడం వల్ల ఈ ‘జిగి’ కాంతికి పర్యాయపదంగా కాక పట్టుదలకు ప్రతీకగా భావించవలసి ఉంటుంది. రేగడినేల సహజంగా ‘జిగి’ అంటే పట్టుగలిగి ఉంటుంది. అంటే ఇక్కడి వాళ్లలో పట్టుదల ఎక్కువ అని చెప్పడం కవి ఉద్దేశం. 
4. నవోదయం రావడమంటే : 
   కొత్త ఉదయం అనేది ప్రతినిత్యం ఉండేదే. అయితే ప్రతిరోజు చీకటి వస్తుంది. ఆ చీకటిని చీలుస్తూ కొత్త వెలుగు ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది.ఇక్కడ చీకటి ఒక్క నాటిది కాదు. తరతరాలుగా పట్టిపీడించిన దుష్పరిపాలన అనే చీకటి తొలిగిపోయి కొత్త ఉదయం వచ్చిందని చెప్పడo కవి గారి ఉద్దేశం.  
5. తెలంగాణ వీరుల ప్రత్యేకత :
  తెలంగాణ వీరులు ఆగని తమ పోరాట పటిమతో స్వాతంత్ర్యమనే సూర్యుడిని పిలిచి, ఈ నేల అంతటా కాంతి సముద్రాలు ఉప్పొంగేటట్లు చేశారు. కాంతి సర్వత్రా నిండేది. అది సముద్రమైనప్పుడు అణువణువునూ తడుపుతుంది. ఈ ప్రయోగం చేయడం వల్ల దాశరథి స్వాతంత్ర్యo గొప్పతనాన్ని, తెలంగాణ దాన్ని అనుభవించిన విధానాన్ని చాలా నిండుగా వర్ణించాడు. ఇది సాధించిన వీరుల గొప్పతనం చెప్పకనే చెప్పాడు. అంతేకాదు ఇక్కడి వీరులు సామాన్యులు కారు. మత పిశాచం కోరలు సాచి భయంకరంగా  విజృంభిస్తున్న సమయంలో, అది భయంకరంగా గొంతులు కోస్తున్నా, దిక్కుతోచని పరిస్థితులు దాపురించినా, బతకడమే కష్టమైనా తమ తెలుగుదనాన్ని కాపాడుకుంటూ విజయం సాధించిన వీరపుత్రులు వీళ్లు. 
1. “ తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు?
జ: తెలంగాణ ప్రాంతాన్ని చాలా కాలం నిజాం నవాబులు పరిపాలించారు. కులీకుతుబ్ షా వంశస్థులు గోలకొండ కోటను కేంద్రంగా చేసుకొని తెలంగాణను పరిపాలించారు. క్రీ.శ.1687లో ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు, గోలకొండ కోటను సర్వనాశనం చేసి, తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
   నవాబులు ఇక్కడి ప్రజలను పీడించి పన్నులు వసులు చేసి గోలకొండ పట్టణాభివృద్ధికి, వారి విలాసాలకూ, వైబోగాలకూ ఖర్చు చేశారు. ఔరంగజేబుకు ప్రతినిధులుగా ఈ ప్రాంతాన్ని పాలించినవారు కూడా, దుర్మార్గులై ప్రజల్ని పీడించారు. ప్రజలకు దేనికి స్వాతంత్ర్యం లేకపోయింది. అధికారులకు కాల్మొక్కుతూ, బానిసల్ల ప్రజలు ఉండిపోయారు. ప్రజలకు వ్యవసాయానికి సాగునీరు, తాగడానికి మంచినీరు కూడా లేదు. ప్రజలకు విద్యా వైద్య రవాణా సదుపాయాలు సమకూర్చబడలేదు.
  కాబట్టి కాకతీయ చక్రవర్తులు వంటి తెలంగాణ ప్రభువులు చేసిన సత్కార్యాలు కూడా, సుల్తానుల పాలనలో దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయనే మాట నిజం.
2. ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథి ఎందుకన్నాడు?
 జ: తెలంగాణలో ప్రజలు నైజాంపాలనలో రజాకార్ల చేతిలో ఎన్నో కష్టాలు పడ్డారు. దానితో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి తెలంగాణ పౌరుడు, తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. చెరసాలలో బందింపబడ్డారు. కొందరు ప్రాణాలు వదిలారు. తెలంగాణ విముక్తి పోరాటంలో గడ్డిపోచవంటి అల్పులు సైతం, ప్రాణాలకు తెగించి నైజాం చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారు. 
    అందుకే దాశరథి “గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని అన్నాడు.    
3.తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించిండని కవి ఎందుకన్నాడు ?
జ: సంధ్యా భానువు అంటే తొలిసంధ్య వేళ ఉదయించే సూర్యుడు.  తెలంగాణలో కాకతీయుల పాలన అంతరించిన తరువాత దుర్మార్గులైన నవాబుల పాలనలో ఉండిపోయింది. దానితో తెలంగాణ గొప్పతనం, విశేషాలు చాలా కాలం ఆ తురుష్కుల చేతుల్లో చిక్కుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలు లేకుండా పోయాయి.
   1948లో నైజాం ప్రభుత్వం పోయి, తెలంగాణ రాష్ట్రం స్వతంత్రమైంది. తెలంగాణ రాజ్యం, భారత యూనియన్ లో కలిసింది. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు ప్రజలకు బతికే దారిని చూపెట్టాయి. అందుకే కవి స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యా సూర్యుడు మొదటగా ఉదయించాడని చెప్పాడు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఉదయభానుని కాంతి, మొదటిసారిగా వెలుగులను తెచ్చిందని భావం. 
4.  ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి రచనా శైలిని అభినందిస్తూ రాయండి.
 జ: ‘వీర తెలంగాణ’ అనే పద్య ఖండికను, దాశరథి కృష్ణమాచార్య రచించారు. దాశరథిగారు మహాకవి. ఈయన ప్రత్యక్షంగా తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నవాడు. సాటి వీరుల సాహసాలను, ఈ పద్యాలలో అద్భుతంగా ప్రశంసించారు. తెలంగాణను ‘వీరమాత’ అని పొగిడాడు.  
     దాశరథి,తెలంగాణ వీరుల త్యాగాలను, చరిత్ర పుటల్లోకి ఎక్కించి, భావి తరాలకు మంచి స్ఫూర్తిని నింపాడు. దాశరథి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి, అభ్యుదయ మార్గంలో తన కవిత్వాన్ని నడిపాడు. సున్నితమైన భావుకతతో ప్రాచీనపద్యశైలితో, ప్రజల హృదయాలను ఆకట్టుకున్నాడు. ఈయన సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి.
    తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరునూ, వారి మహోన్నత త్యాగాల తీరునూ, దాశరథి ఈ పద్యాల్లో ప్రదర్శించాడు. దాశరథి పద్యాలు వరద గోదావరిలా, ఆవేశంతో, వీర రసోద్రేకంతో, తెలంగాణ మాతృ సంకీర్తనతో, రసవంతంగా సాగాయి. 
ఆ) ఈ కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
  1. వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
  జ: తెలంగాణ ఊదిన శంఖ ధ్వనులు, భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. ఉదయ భానుడి కిరణాలచే ప్రీతిపొందిన పద్మాలు, ఆకాశగంగా తరంగాలు, అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయి. తెలంగాణ గొప్పతనం విశేషాలు, చాలా కాలం పాటు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ అడ్డంకులు పోయి, సంధ్యా సూర్యుడు మొదటిసారిగా, ఉదయించాడు.  
   తెలుగు నేల ఎంతో జిగి కలది. తెలంగాణ తల్లి, కోటిమంది పిల్లల్ని పెంచి, వారి చేతికి కత్తులిచ్చి, నైజాం నవాబుతో పోరాడమంది. నాడు తెలంగాణాలో గడ్డిపోచ కూడా, కత్తిపట్టి ఎదిరించింది. రాజు గర్వం అణచేలా యుద్ధం సాగించింది. దిగంతాలలో ఇంద్రధనుస్సులు సయ్యాటలాడాయి. 
  తెలంగాణ స్వాతంత్ర్యపోరాటం సముద్రంలా ఉప్పొంగింది. నేడు తెలంగాణ నేలను, స్వాతంత్య్రం నీటితో వీరులు తడుపుతున్నారు. నవాబు ఆజ్ఞలకు కాలం చెల్లింది. తెలంగాణ పిల్లలలోని విప్లవ చైతన్యం, భూమండలాన్ని అంతా సవరించింది. తెలుగు వీరులు, యోధులు, పరోపకారులు.
   మతపిశాచి తన కోరలతో తెలంగాణ ప్రజల గొంతులు కోస్తున్నప్పుడూ, వారికి దిక్కు తోచనప్పుడూ, బతుకు భారమైనప్పుడు కూడా, తెలంగాణ ప్రజలు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధంలో రుద్రాదులు మెచ్చుకొనేటట్లు వారు విజయం సాధించారు.  
కాకతీయుల కంచు గంట మ్రోగినపుడు, శత్రువులు కలవరపడ్డారు. రుద్రమదేవి కాలంలో, తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. కాపయ్య నాయకుని విజృంభణకు, శత్రువుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజుల కాలంలో కళ్యాణ ఘంటలు మ్రోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బకు ఓడిపోలేదు. శ్రావణ మేఘంలా గర్జిస్తూ ముందుకు సాగుతోంది.
కంఠస్థ పద్యాలు  :
1. తల్లీ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్
   డుల్లెన్ కొన్ని తరాలదాక ! ఇప్పుడడ్డుల్ వోయె ; సౌదామినీ 
    వల్లీ ఫుల్లవిభావళుల్ బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్మునన్
    మళ్ళేన్! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్
  ప్రతిపదార్థం :
 తల్లీ                        =      ఓ తెలంగాణ తల్లీ
 నీ ప్రతిభా విశేషములు  ;
 నీ                           =   నీ యొక్క 
ప్రతిభా విశేషములు       =  ప్రజ్ఞా విశేషాలు 
కొన్ని తరాలదాక          = కొన్నితరముల వరకు 
భూతప్రేత హస్తమ్ములన్  
భూతప్రేత                  =  దెయ్యాలు పిశాచాలు వంటి (చెడు శక్తుల) 
హస్తమ్ములన్             =  చేతులలో
డుల్లెన్                     =  నాశనమై పోయినవి ( చిక్కుకున్నవి )
 ఇప్పుడు                 =  ఇప్పుడు
అడ్డుల్                     =  ఆటంకాలు 
పోయెన్                   = తొలిగిపోయాయి
 
సౌదామినీ వల్లీ ఫుల్లవిభావళుల్ ;
సౌదామినీ వల్లీ            =  తీగల వంటి మెరుపుల యొక్క
 విభావళుల్               =  కాంతుల వరుసలు 
  బ్రతుకు త్రోవల్           =  బ్రతుకు దారులను 
 చూపు                      =  చూపించే 
కాలమ్మునన్                =  సమయములునూ 
    మళ్ళేన్                  =  తిరిగి వచ్చాయి
2. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్
    ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధ మాడి వా 
    జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్ 
    చేయుమంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
  ప్రతిపదార్థం :
 మాతరో           =    ఓ తెలంగాణ తల్లీ!
 నీ యొడిలోనన్ 
నీ                   =   నీ యొక్క 
ఒడిలోనన్         =  ఒడిలో 
కోటి తెలుంగు కుర్రలన్ 
కోటి                =  కోటి సంఖ్య గల 
తెలుంగు కుర్రలన్  = తెలుగు పిల్లలను 
నిండుగన్           =   సంపూర్ణంగా ( సంతోషిoచేటట్లుగా )
పెంచితివి            =  పెంచావు  ( పోషించావు)
ప్రాయము           = యౌవనం 
వచ్చినంతనే         =  రాగానే 
కృపాణములు       = కత్తులు 
ఇచ్చితి               = ఇచ్చావు
యుద్ధమాడి
యుద్ధము +  ఆడి  =  యుద్ధం చేసి 
జగమ్ము              =  లోకం  
వాజ్రేయ              = వజ్రమువలె కఠినమైన 
భుజాబలమ్ము       = వారి భుజ, బల పరాక్రమాలను 
 దరిసింపన్           చూచేటట్లు 
నవాబుతో               =   నైజాం నవాబుతో
 సవాల్ చేయుమంటివి   
 సవాల్ చేయుము     =  ప్రశ్నించుము ( ఎదిరించుము)
అంటివి                   = అని అన్నావు 
ఈ తెలుగు రేగడిలో      = ఈ తెలంగాణ బంకమన్నులో ( ఈ తెలుగు నేలలో)
జిగి                         =   వన్నె (బలము)  (కాంతి)
మెండు                    =  అధికం
3. తెలగాణమ్మున గడ్డిపోచయును సంధిoచెన్ కృపాణమ్ము ! రా 
   జలలాముం  డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము ! భీ
    తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్ ! దిశాం 
    చలమున్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ 
  ప్రతిపదార్థం :
  తెలగాణమ్మున              =      ఈ తెలంగాణలో 
  గడ్డిపోచయును              = గడ్డిపోచకూడా ! ( గడ్డి పరక వంటి అల్పుడు కూడా) 
  కృపాణమ్మున్                =  కత్తిని 
  సంధిoచెన్                    =  చేత పట్టింది ; ( కత్తిపట్టి ఎదిరించిది )
  రాజలలాముండు            = రాజ శ్రేష్టుడు  
అనువాని                        = అని పేరు పొందిన నిజాం నవాబు యొక్క 
పీచము                          =  గర్వము 
అడచన్                        =  అణచడానికి
 యుద్ధమ్మున్                  =యుద్ధాన్ని ( పోరాటమును)
 సాగించెన్                        =  సాగించింది 
  యేమియగునో
ఏమి + అగునో                    =  ఏమి అవుతుందో 
 తెల్యంగరాకన్                    =    తెలియకపోవడం వల్ల 
జగమెల్ల
జగము + ఎల్లా                   =    లోకం అంతా 
 భీతిలిపోయెన్                    =  భయపడిపోయింది
 దిశాంచలమున్                   
 దిశా  +  అంచలముల్              = దిక్కుల చివరలు 
శక్రధనుఃపరంపరలతోన్ ;
శక్రధనుః                             =    ఇంద్రధనుస్సు యొక్క
 పరంపరలతోన్                     =  ఎడతెగని వరుసలతో
సయ్యాటలాడెన్                     =  కూడియాడాయి
 
4.  తెలగాణా ! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
      చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ 
      జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబoతటన్ కాంతి వా  
      ర్ధులు నిండిoచిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!
  ప్రతిపదార్థం :
   తెలగాణా                 =      ఓ తెలంగాణమా !
భవదీయ పుత్రకులలో; 
భవదీయ                    = నీ యొక్క 
 పుత్రకులలో              =  పిల్లలలో
తీండ్రించు                  = ప్రకాశించే  ( ప్రజ్వలించే ) 
వైప్లవ్యసంచలనమ్మూరక
వైప్లవ్య                      = విప్లవాత్మకమైన
సంచలనమ్ము              = కదలిక 
ఊరక                        = ఊరికే ( వ్యర్థముగా) 
  పోవలేదు                  =  పోలేదు
తెల్గుజోదుల్              =  తెలుగు యోధులు 
వసుధా చక్రమ్ము          = భూమండలాన్ని అంతా 
సారించి                    =  సవరించి (సరిచేసి)
ఉజ్జ్వల వైభాతిక భానునిన్
ఉజ్జ్వల                    =  ప్రకాశించునట్టి 
వైభాతిక                    = ప్రభాతకాలమునకు సంబంధించిన  (ఉదయ కాలపు)
భానునిన్                  =  సూర్యుని 
పిలిచి                      = పిలిచి (ఆహ్వానించి) 
దేశంబoతటన్
దేశంబు + అంతటన్        =  దేశమంతా
కాంతి వార్ధులు              =  కాంతి సముద్రాలు 
నిండిoచిరి                    = నింపారు
బళా                          =  ఆహా!
వీరు                          =  నీ పుత్రులైన వీరు 
వీరులు                      = శూరులు 
పరార్థుల్
పర + అర్థుల్                =   పరోపకారులు
 పదజాలం 
1. ఈ కింది వాక్యాలు చదువండి. గీతగీసిన పదాల అర్థాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
  అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుచున్నాయి.
    జ: సయ్యాటలాడు    =  సహక్రీడించు
    వాక్య ప్రయోగం : బాలల దినోత్సవం నాడు, పాఠశాలలో బాలబాలికలు కూడి ఆడుతున్నారు.
ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
  జ: కల్లోలం   =  పెద్దతరంగం
 వాక్య ప్రయోగం :  తెలంగాణ పోరాటం, కేంద్రప్రభుత్వం గుండెల్లో పెద్ద తరంగాలను రేపింది.
ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.
     వెనుకాడరు      =  జంకరు, వెనుకంజ వేయరు 
    వాక్య ప్రయోగం :  వీర తెలంగాణ పోరాటంలో యువత ముందుకు దూకడానికి,  వెనుకంజ వేయరు.
ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.
     దిక్కు తోచనప్పుడు        =  దారి తెలియనప్పుడు 
     వాక్య ప్రయోగం : పిల్లలు ఏమి చేయడానికి దారి దొరకనప్పుడు, పెద్దల వైపు చూస్తారు.
2. కింది పదాలకు నానార్థాలురాయండి.
  అ)  ఉదయము   :   ఉదయించడం,  తూర్పు కొండ,  పుట్టుక,  సృష్టి 
  ఆ)ఆశ             :   కోరిక,      దిక్కు 
  ఇ) అభ్రము       :  మేఘం,     ఆకాశo,   స్వర్గం,    కర్పూరం 
3. పర్యాయపదాలు
  అ) రవము        :  ధ్వని,    రొద,   చప్పుడు 
  ఆ) కృపాణము    : ఖడ్గం,  కత్తి,    అసి,    కరవాలం 
  ఇ) జలధి          :  సముద్రం,   సాగరం,  పయోధి,   అబ్ధి
  ఈ) జెండా         :  పతాకం,  కేతనం 
  ఉ) లంఘించు    :  దాటు,       దుముకు
వ్యాకరణాంశాలు
1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
   అ)  జగమెల్ల             =  జగము    +    ఎల్ల         -  ఉకారసంధి 
   ఆ)  సయ్యాటలాడెన్     =  సయ్యాటలు  +   ఆడెన్   -  ఉకారసంధి
   ఇ) దారినిచ్చిరి           =   దారిని   +  ఇచ్చిరి        -  ఇకారసంధి
   ఈ) ధరాతలమెల్ల        =  ధరాతలము + ఎల్ల         -  ఉకారసంధి
   ఉ) దిశాంచలము        =  దిశా    +  అంచలము     -  సవర్ణదీర్ఘ సంధి
   ఊ) శ్రావణాభ్రము        = శ్రావణ  +  అభ్రము          -  సవర్ణదీర్ఘ సంధి
   ఋ) మేనత్త              =  మేన   +   అత్త             -  అకారసంధి
2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.
    అ)  కాకతీయుల కంచు గంట  =    కాకతీయుల యొక్క కంచు గంట - షష్టీ తత్పురుష సమాసం 
    ఆ)  కళ్యాణ ఘంటలు         = కళ్యాణము కొరకు ఘంటలు    -      చతుర్థీ తత్పురుష సమాసం
    ఇ) బ్రతుకు త్రోవ              = బ్రతుకునకు త్రోవ             -       షష్టీ తత్పురుష సమాసం
    ఈ) మహారవము            =  గొప్పదైన రవము            -  విశేషణ పూర్వపద కర్మధారయసమాసం
    ఉ) వికారదంష్ట్రలు           = వికారమైనదంష్ట్రలు           -  విశేషణ పూర్వపద కర్మధారయసమాసం
    ఊ) కాంతివార్ధులు          = కాంతులు అనే వార్ధులు      -  రూపకం సమాసం
    ఋ) తెలంగాణరాష్ట్రం        = తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం  -  సంభావనా పూర్వపద కర్మధారయసమాసం
    ౠ) మతపిశాచి               = మత అనే పిశాచి               -   రూపకం సమాసం 

తరగతి గదిలో రాయవలసిన అంశాలు
1.  ‘తెలంగాణ తల్లి’ తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రాభినయం రాయండి.
2. ‘తెలంగాణ తల్లి’ ఆత్మకథ రాయండి.
గైహికము (ఇంటిపని)
1. పుటసంఖ్య 31లో గల కవితను చదువండి. జవాబులు రాయండి.
2. ఛేకానుప్రాసాలంకారము నిర్వచనం  చదువండి. రాయండి. 
3. ఈ పాఠంలోని లఘుసమాధాన ప్రశ్నలు చదువండి. రాయండి.
అదనపు సమాచారం :
 1. పాఠ్యభాగ కవిపరిచయo, నేపథ్యం చదువండి.
 2. చుక్కపద్యాలు కంఠస్థo చేసి, భావాలు సొంతమాటల్లో రాయండి. 
 3. పాఠంలోని అదనపు వ్యాకరణాంశాలు గుర్తించండి.
ప్రశ్నల నిధి 
1. నవోదయం రావడమంటే  ఏమిటి? 
2. ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథి ఎందుకన్నాడు?
3. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి రచనా శైలిని అభినందిస్తూ రాయండి.
 4. తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించిండని కవి ఎందుకన్నాడు ?
 5. “ తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి   మాటలను మీరెట్లా సమర్థిస్తారు?
6. బతుకు తోవ చూపే కాలం రావడమంటే ఏమిటి? 
నికష
1. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.                    4 మా 
  అ) ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథి ఎందుకన్నాడు?
  ఆ)  నవోదయం రావడమంటే  ఏమిటి?
2. ఈ కింది పద్యానికి ప్రతిపదార్థం రాయండి.                      4 మా 
    నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్ 
    ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధ మాడి వా 
    జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్ 
    చేయుమంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
3. ఈ కింది పదాలు విడదీసి సంధిపేరు రాయండి.                2 మా  
   అ)  సయ్యాటలాడెన్                         ఆ) దారినిచ్చిరి              
      


4. కొత్త బాట 
i) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 
పల్లె సౌందర్యాన్ని వర్ణించగలగాలి.
ప్రాంతీయభాష (యాస)ను గుర్తించగలగాలి.
పల్లెల్లో నాటి తరానికి నేటి తరానికి మధ్య వ్యత్యాసాలు గుర్తించగలగాలి.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చోటుచేసుకున్న మార్పులు,  స్థానిక ఆధిపత్యశక్తుల మీద సామాన్యుడి విజయాలను గురించి సొంతమాటల్లో రాయగలగాలి.
ii) ముఖ్యపదాలు - అర్థాలు 
            బాట         =      దారి
            రొద          =     ధ్వని
            ఎన్నెల      =     వెన్నెల
చిర్తగండు    =     మగపులి
కూనలు     =     పిల్లలు
ఆదెరువు    =    ఆధారం
రచ్చకట్ట     =    రచ్చబండ
యోగం      =    అదృష్టం
మత్తడి      =    రేగడి పొలం


చర్చనీయ అంశాలు
1.సెవ్వుమీద పేనువారుడు
   అంటే చెవి మీద పేను పారడం. దీని అర్థం పట్టించుకోకపోవడం. స్పర్శ జ్ఞానం బాగా కలిగిన శరీర భాగాల్లో ఒకటి చెవి. తలలో ఉండే పేలు ఒక్కొక్కసారి దారి తప్పి చెవి మీదికి వస్తాయి. అది వెంటనే తెలిసిపోతుంది. ఆ విధంగా  చెవి మీద పేను పారడం అంటే గ్రహింపు కలగటం అని అర్థం. ‘సెవ్వుమీద పేనువార్తెనా ?’ అని రచయిత్రి ప్రయోగించడంలో అర్థం అసలు ‘పట్టించుకోవడం లేదు’ (గ్రహించడం లేదు) అని.
2. నడుచుకుంటూ పోయేటప్పుడు గమనించేవి :
   మామూలుగా నడుచుకుంటూ పోయేటప్పుడు చాలా మంది చుట్టూ గమనించే స్థితిలో ఉండరు.కారణం ఇప్పుడు నడక చాలా తగ్గింది.ఎప్పటిలాగా నడిచే నడక అలవాటైపోయి పరిసరాల మీద దృష్టి అంతగా ఉండదు. కొత్త ప్రదేశంలో ఆయా ప్రాంతాలను చూడటానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా అన్నీ గమనిస్తాం.హృదయానికి కళ్లుంటే, కళ్లు హృదయపూర్వకంగా చూస్తుంటే ఎన్ని అంశాలైనా గమనించవచ్చు.
గాలివీచడంలోని ప్రత్యేకత
నేల, నేల మీద పరుచుకున్న ప్రకృతి
చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రత్యేకతలు
రకరకాల మనుషుల ప్రవర్తనలు 
చుట్టూ పేరుకుపోయిన మాలిన్యం, మనుషుల మనసుల్లోని కాఠిన్యం
3.తనకాళ్ళ మీద తాను నిలబడటం :
   అంటే స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం. సాధారణంగా ఎదిగిన పిల్లలు ఏదో ఒక వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడి, తల్లితండ్రుల మీద ఆధారపడకుండా బతికే సందర్భంలో ఈ మాటను ప్రయోగిస్తారు. ఈ మాట ఎవరైనా ఇతరుల మీద ఆధారపడకుండా  జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది.
4. నాటి – నేటి  ఆచార వ్యవహారాల్లో తేడాలు :
   మానవ జీవితం ఆనందంగా, ఆదర్శంగా ఉండటం కోసం ఏర్పరచుకున్న విధానాలే ఆచార వ్యవహారాలు.మనిషి ఆలోచనల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు సాంకేతిక విజ్ఞానం శరవేగంతో ముందుకు దూసుకునిపోవడం, సమసమాజ చింతన, అభ్యుదయవాదం ఆచారవ్యవహారాల్లో పరిణామాలకు  కారణమవుతున్నాయి. అందుకే ఒకప్పటికి ఇప్పటికి ఆ తేడాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఒకప్పుడు వర్గభేదాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు ఉన్నత వర్గాలు – నిమ్న వర్గాల మధ్యగల అంతరం
             తగ్గిపోయింది.  
కులతత్వం వేళ్ళూనుకొని ఉండేది. ఇప్పుడు కుల సంఘాలున్నా వాటి పరిధి, పనితీరు మారింది.
అంతరానితరం పాటించేవారు. ఇప్పుడది తీవ్రనేరం.
వస్త్రధారణ సంప్రదాయబద్దం – ఇప్పుడు ఆధునిక వస్త్రాలు ధరిస్తున్నారు.
5. కడ్పుల ఇసం – నాల్కెన తీపి :
   కడుపులో విషం – నాలుక మీద తీయదనం అంటే మనసులో అసూయ, కుట్ర ఉన్నప్పటికీ పైకి మాత్రం ప్రేమతో మాట్లాడుతూ ఉండటమని అర్థం. ఆధునిక సమాజంలో ఈ లక్షణం సర్వ సాధారణమై పోయింది.
6. కళదప్పిన ఇల్లు :
    ఇల్లు కళ దప్పడం అంటే అందాన్ని కోల్పోవడం.ఇది భౌతికమైంది కాదు. కొత్తగా రంగులు వేసి అలంకరించిన ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే ఆ ఇల్లు కళదప్పుతుంది. ఇంటినిండా మనుషులుండి ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఇల్లు కళకళలాడుతుంది.
పెద్ద ఇంట్లో మనుషులెవరు లేకపోయినా, ఒక్కరిద్దరే ఉంటున్నా, దీపం వెలిగించే దిక్కు లేక[పోయినా ఇల్లు కళతప్పుతుంది.
7. నలుగురు నడిసిందే బాట :
    నలుగురూ నడిచిందే బాట. అంటే పది మంది పాటించింది పద్ధతిగా మారుతుంది. ఈ విషయాన్నే వేమన ‘పదుగురాడుమాట పాడియె ధర జెల్లు; ఒక్కడాడు మాట ఎక్కదెందు’ అని వక్కాణించాడు. నలుగురూ దేన్ని సమర్థిస్తారో అదే అనుసరణీయమవుతుంది. నలుగురు ఏది అనుసరిస్తారో అదే పద్ధతిగా, సంప్రదాయంగా మారుతుంది.    నలుగురూ నడిచినప్పుడే అది బాటగా మారుతుంది. దాన్నే తక్కిన వాళ్ళుకూడా అనుసరిస్తారు.
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.
అ) “ ఎంత చెడ్డపని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు” అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది ?
జ: ఎవరైనా సరే ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడితే చులకనగా చూడబడతారు. విలువ ఉండదు. అందుకని తాను కష్టపడి పనిచేసి సంపాదించిన దానితో కలో, గంజో తాగుతూ, తన నోటి మాట బయటకు రాకుండా గడుపుకుంటూ స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటే చాలు అనేది, అక్క మాటల్లోని అంతర్యం.
ఆ) “ అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తూన్నవి ” అంటే మీకేం అర్థమైంది? 
 జ: అదునుగాయడం అంటే అవకాశం కోసం కాచుకొని కూచోవడం.నక్కలు జిత్తులమారివి. అవి స్వయంగా వేటాడ లేవు. తేరగా ఆహారం ఎలా దొరుకుతుందా అని చూస్తాయి.పొదల్లో నక్కి ఉండి అదునుచూసి, సింహం, పెద్దపులి వంటి జంతువులు తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తినడానికి కాచిపెట్టుకు కూర్చుంటాయి. రెండు జంతువులు ఒకదానిని మరొకటి చంపుకుంటే, ఈ నక్కలు ఆ రెంటి మాంసాన్ని తినడానికి సిద్ధంగా ఎదురుచూస్తూ ఉంటాయని అర్థమైంది.
ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జ: ఆధునికీకరణ కారణంగా గ్రామాలల్లో ప్రకృతిలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మా గ్రామంలోని ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, రకరకాల పూలమొక్కలు, పచ్చటి పొలాలు, పాడి పశువులతో కళకళలాడుతూ ఉంటుంది. ఊరి మధ్యలో శివాలయం ఉంది. ఊరి చివర చెరువు ఉంది. ఆ చెరువు పంట పొలాలకు ఆధారంగా ఉంది. చెరువులో చేపలు సమృద్ధిగా ఉంటాయి. వాటికోసం కొంగలు వస్తుంటాయి. మా గ్రామంలో ప్రజలు ఒకరికొకరు సహాయపడుతూ, కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తారు. మా గ్రామ వాతావరణం ఆహ్లాదకరoగా, ప్రశాంతంగా ఉంటుంది.
ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?
జ: సాధారణంగా నీటి వసతి ఉన్న చోటే గ్రామాలు ఏర్పడతాయి. గ్రామాలు ఏర్పాటైన కొత్తలో గాని, కొంత కాలానికి గాని చెరువులు, కుంటలు ఏర్పాటు చేసుకోవడం తెలంగాణలోని ప్రత్యేకత. అందుకే ఈ విషయంపై అందరికీ అవగాహన ఉంటుంది. చెరువుల ప్రాముఖ్యతలోని ముఖ్యాంశాలు........
చెరువు నీరు పంటపొలాలకు నీటి వసతి కల్పిస్తుంది.
చెరువులో ఉండే చేపలు ఎందరికో జీవనోపాధిని కలిగిస్తున్నాయి.
చెరువు నీరు పశువులకు దాహార్తిని తీరుస్తుంది.
ప్రజలకు తాగునీటిని అందిస్తుంది.
గ్రామాల్లో చెరువులు ఉంటే భూగర్భజలాలు ఎండిపోవు.
చెరువులోని మట్టి పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది.
చెరువుల్లో నీరు ఉంటే గ్రామాల్లోని ప్రకృతి పచ్చగా కళకళలాడుతుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
  అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
పల్లెల్లో ఒకప్పుడు పచ్చని ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన వాతావరణంలో ఉoడేవి. రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. కుల వృత్తులు అందరు తప్పనిసరిగా పాటించేవాళ్ళు. చదువు అంతంతమాత్రంగా ఉండేది. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు. వస్త్రధారణ, భాష నగరాలకు భిన్నంగా ఉండేది........ అటువంటి గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి.
పూర్వం పల్లెల్లో భూస్వాములు సన్న, చిన్న కారు రైతులపై పెత్తనం చెలాయిస్తూ ఉండేవారు. రైతులకు అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలుచేసి, పేద రైతులను, పీడించేవారు.   
పల్లెల్లో జనసాంద్రత పెరిగి, సాగుబడిలో లేని నేల కూడా వ్యవసాయానికి వినియోగించడం వల్ల అడవులు, చెట్లు తగ్గిపోయాయి.
ప్రభుత్వ పథకాలు, ప్రణాళికల కారణంగా రవాణా సౌకర్యాలు పెరిగాయి. ప్రజలు కాలినడకపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. పొలాలకు కూడా కొందరు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు.
చదువుకున్న వాళ్ల సంఖ్య పెరిగింది. సామాజిక అసమానతలు తగ్గిపోతున్నాయి. వర్గాభేదాలు, కులభేదాలు, మత వైషమ్యాలు తగ్గుతున్నాయి.
భాషలో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్థానిక మాండలిక యాస తగ్గిపోయి, పత్రికల భాష, ఇంగ్లీషు మాటలతో కూడిన భాష, టీ.విల భాష ఇప్పుడు పల్లెల్లో ప్రవహిస్తుంది.
  మనుషుల మధ్య మునుపటి ఆత్మీయతలు సన్నగిల్లుతున్నాయి. గతంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేవాళ్ళు. ఇప్పుడా పరిస్థితి లేదు. దాంతో పరస్పరం లెక్క చేసుకోవడం తగ్గిపోయింది.
కుల మతాల పట్టింపులు కూడా మునుపున్ననంత తీవ్రంగా లేవు. నిమ్న కులాల వాళ్లను నీచంగా చూడటం లేదు. కులాలకు అతీతంగా మనుషులు పరస్పరం గౌరవించుకోవడం చూడగలుగుతున్నాం.
iii) పదజాలం 
1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
  అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
  జ:  చెవివారిచ్చి వినడం             =   శ్రద్ధగా వినడం
 నేను మా అమ్మ చెప్పే మంచి మాటలను చెవివారిచ్చి వింటాను.
  ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి.
  జ:  గవిన్లు                  =  గుహలు 
   సింహానికి ఆకలి వేసి గవిన్లలో నుండి బయటికి వచ్చింది.
  ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
   జ: కుటిలవాజితనం =   మోసం
  కొందరు కుటిలవాజితనంతో ఇతరులను ఇబ్బంది పెడతారు.
  ఈ) మా ఊరి పొలిమేరలో పంటపొలాలున్నాయి.
   జ: పొలిమేర   =  సరిహద్దు 
   మా ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గుడి ఉoది.
2. పర్యాయపదాలు 
  అ)  పెయి      =   మేను,      దేహం
  ఆ) తావు       =   చోటు,   ప్రదేశం
3. ప్రకృతి -  వికృతులు 
  అ)  సముద్రం  -   సంద్రం                                     ఈ) విద్య   -   విద్దె 
  ఆ) ఆధారము   -  ఆదెరువు                                 ఉ)  ప్రయాణం   - పయనం (పైనం)
  ఇ) శిఖ    -    సిగ 
4. కింది జాతీయాలను వివరించండి. 
  నిండుకొన్నవి  :  ‘అయిపోయినవి ’ అనే అర్థంలో వాడతారు. ఖాళీ అవడం.
  దడిగట్టు        :  ‘రక్షణ కల్పించు ‘అనే అర్థంలో వాడతారు.
  నిప్పుకలు సెరుగంగ :  ‘మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం’ అనే అర్థంలో వాడతారు.
iv) వ్యాకరణాంశాలు
 1) కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
  అ) ప్రాణాలు గోల్పోవు         =   ప్రాణాలు   +  కోల్పోవు     -        గసడదవాదేశ సంధి       
  ఆ) మూటఁగట్టు                =  మూటన్    + కట్టు           -        సరళాదేశ సంధి (లేదా) ద్రుతప్రకృతిక సంధి      
  ఇ) ఆసువోయుట              =    ఆసు      + పోయుట      -       గసడదవాదేశ సంధి                    
  ఈ) కాలు సేతులు             =    కాలు      + చేయి       -       గసడదవాదేశ సంధి          
  ఉ) పూచెను గలువలు        =   పూచెను    + కలువలు     -       సరళాదేశ సంధి (లేదా) ద్రుతప్రకృతిక సంధి
      వృద్ధి సంధి  : అ కారానికి (అ,ఆ లకు)  ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ కారం,  ఓ, ఔ లు పరమైతే  ‘ఔ’ కారం ఏకాదేశంగా   వస్తాయి. 
అ) ఏకైక                 =  ఏక          +        ఏక                (అ+ ఏ=ఐ)
ఆ) వసుధైక             =  వసుధ      +       ఏక                 (అ+ ఏ=ఐ)
ఇ) దేశైశ్వర్యం           =  దేశ          +      ఐశ్వర్యం            (అ+ ఐ=ఐ)
ఈ) అష్టైశ్వర్యాలు       =  అష్ట          +   ఐశ్వర్యాలు            (అ+ ఐ=ఐ)
ఉ) వనౌషధి             =    వన        +  ఓషధి                   (అ+ ఓ= ఔ) 
ఊ) మహౌషధి          =    మహా      +    ఓషధి                 (అ+ ఓ= ఔ) 
ఋ) దివ్యౌషధం         =    దివ్య      +   ఔషధం                 (అ+ ఔ=ఔ) 
ౠ) నాటకౌచిత్యం     =   నాటక     +   ఔచిత్యం                (అ+ ఔ=ఔ)
v) తరగతిగదిలో చేయవలసిన అంశాలు
 1. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
 2. పాఠం చదువండి. ముఖ్యమైన అంశాలు గుర్తించి రాయండి. చర్చించండి.
 3. పల్లెకు సంబంధించిన కవిత/పాట సేకరించి రాయండి.
vi) గైహికము (ఇంటిపని)
  1. రచయిత్రి పరిచయం, పాఠం ఉద్దేశం అంశాలు చదువండి. రాయండి.
  2. పుట సంఖ్య 43లోని  పేరా చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
 vii)ప్రశ్నల నిధి 
i) లఘుసమాధాన ప్రశ్నలు 
1. నలుగురు నడిసిందే బాట’ అంటే మీకేమర్థమైంది ?
 2. కళదప్పిన ఇల్లు అంటే ఏమిటి ?
3. నాటి – నేటి  ఆచార వ్యవహారాల్లో తేడాలు ఏమిటి ?
4. “ అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తూన్నవి ” అంటే మీకేం అర్థమైంది? 
5. “ ఎంత చెడ్డపని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు”   అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది ?
6. మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
7. చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?
8. కడ్పుల ఇసం – నాల్కెన తీపి అంటే ఏమిటి?
ii) కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
  అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
  viii) నికష 
i) ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.                      5 మా
    1. మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
     2. కడ్పుల ఇసం - నాల్కెన తీపి అంటే ఏమిటి?
ii) ఈ కింది పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి.                     2మా
     1.  పొలిమేర                         2. కుటిలవాజితనం
iii) కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.                                  3మా 
    1. వసుధైక                          2.మూటఁగట్టు                3. కాలు సేతులు          




5. నగరగీతం
                                                                          - అలిశెట్టి ప్రభాకర్ 
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు : 
నగర జీవితంలోని అనుకూల, ప్రతికూల అంశాలను గురించి చెప్పగలగాలి   
 పరిసరాల పరిశుభ్రత కోసం అందరు కృషి చేయాలని తెలుపుతూ కరపత్రం రాయగలగాలి           
 పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగలగాలి. రాయగలగాలి
రూపకాలంకారం లక్షణాలను తెలుసుకోగలగాలి
II) ముఖ్య పదాలు – అర్థాలు 
మినీ కవిత               =  గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం 
నగారా                    =   పెద్ద ఢoకా 
పఠనీయ గ్రంథమే       =  చదువ దగిన పుస్తకమే 
సిటీ                      =  నగరం, పట్టణం 
దారిద్ర్యం                 =  బీదతనం 
తీరిక                     =  విశ్రాంతి 
మెర్క్యురీ నవ్వులు    =   పాదరసం నవ్వులు (తెచ్చి పెట్టుకున్న అసహజపు నవ్వులు)
చిక్కదు                 =   దొరకదు 
రసాయన శాల         =   ప్రయోగశాల 
మహా వృక్షం మీద    =    పెద్ద చెట్టు మీద 
సౌభాగ్యం               =  ధన వైభవం 

III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ కవితల ప్రత్యేకత ఏమిటి ?
జ: అలిశెట్టి ప్రభాకర్ గారు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరు సంవత్సరాలపాటు సీరియల్ గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగర జీవనంపై మినీ కవితలు రాశారు. ప్రభాకర్ గారి కవితలు ప్రఖ్యాతి పొందాయి.  అలిశెట్టి ప్రభాకర్ గారు కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని, పాఠకుల్లో ప్రగతినీ, ఆలోచనా దృక్పథాన్నీ, సామాజిక చైతన్యాన్నీ పెంపొందించిన మహాకవి. నగర జీవితంలోని యథార్థ దృశ్యాన్ని, పాఠకుల కళ్ళముందు నిలుపుతూ, నగరం యొక్క మరో పార్శ్వాన్ని  కవి ఎత్తిచూపారు. వాస్తవాలను కఠినంగా నిర్వచించారు. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా కోట్ చేయబడ్డ కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ గారిదే.
ఆ) పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.
జ: నగరం అంటే పట్టణం. పట్టణాలను మున్సిపాలిటీలుగా, కార్పోరేషనులుగా వర్గీకరిస్తారు. పట్టణాల్లో కనీసం 50 వేలకు పైగా జనాభా ఉంటారు. కోటి జనాభా మించిన నగరాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. మన దేశంలో బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాదు నగరాల జనాభా కోటిని మించింది. పల్లెలను పంచాయితీలుగా, నగర పంచాయితీలుగా, మైనర్ పంచాయితీలుగా వర్గీకరిస్తారు. నగరాల్లో పన్నులు ఎక్కువ. అయినా మంచినీరు సదుపాయం, మంచి రోడ్లు, వీధి దీపాలు, రోడ్లను శుభ్రంచేసే సిబ్బంది ఉంటారు. పల్లెల్లో సదుపాయాలు తక్కువ. నగరాల్లో 24 గంటలు విద్యుత్తు ఉంటుంది. పరిశ్రమలు ఉంటాయి. విద్యా వైద్య సదుపాయాలు ఉంటాయి. పల్లెల్లో సదుపాయాలు ఉండవు.
ఇ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జ: నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ పొద్దున్నే వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు ఇంటినుండి బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది. అలాగే నగరంలో కూలిపనులు చేసి జీవించే వారికి కూడా, వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.
     ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికీ, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.  
ఈ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
జ: పట్టణాలకు వచ్చి ఏవో సుఖాలను అనుభవించాలనుకునే వారికి, పట్టణాల నిజస్వరూపాన్ని తెలపడమే కవి యొక్క ఆంతర్యం. నగరాల్లో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటారని భ్రాంతిపడే పల్లె ప్రజలకు, పట్టణాల్లో ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయనీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నగరజీవనం, సమస్యల వలయం అనీ చెప్పడమే కవి ఆంతర్యం.
   నగర జీవనం ‘పద్మవ్యూహం’ లాంటిదనీ, ఒక్కసారి ఆ నగరజీవనం చిక్కుల్లో చిక్కుకుంటే, ఆ బంధనాల నుండి బయటపడడం కష్టమనీ తెలపడమే, కవి ఆంతర్యం. నగరవాసులకు తీరిక దక్కదనీ, వారి కోరికలు తీరవనీ, కవి నగరం యథార్థ స్వరూపాన్ని వెల్లడించాడు. నగరంలో కనిపించే పైపై మెరుగులకు మురిసిపోయి పల్లెలను వదిలి నగరాలకు రావద్దని, పల్లెవాసులకు హితబోధ చేయడమే, కవి గారి ఆంతర్యం. 
ఉ) నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.
(లేదా)
నగర జీవితం ఎలా ఉంటుందో రాయండి.
జ: నగరంలో మనిషి రోడ్లమీద నడుస్తూ ఉన్నా, లేక ఏదైనా వాహనాలలో వెళ్ళినా పెద్దగా నగారా మోగినట్లుగా ధ్వని వినబడుతూ ఉంటుంది. పట్టణాల్లో చిన్న చిన్న ఇరుకు ఇళ్ళల్లో జీవించాలి. అక్కడ గాలికూడా సరిగా రాదు. నగరంలో ఒకరిని ఒకరు పట్టించుకోరు. ఎవరి బతుకు వారిదే. పేవ్ మెంట్లపై నడవాలి. సిటీబస్సులు ఎక్కాలి. ఎక్కడచూసినా జనమే. పిల్లల్ని కాన్వెంటులకు పంపాలి. పట్టణాల్లో అందమైన భవనాలతో పాటు పూరిపాకలు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వర్యంతో పాటు దరిద్రం కూడా ఉంటుంది. అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. 
      ఎంత కష్టపడి పనిచేసినా, నగరవాసుల కోరికలు తీరవు. నగరంలో ఎవరికీ తీరుబడి ఉండదు. కృత్రిమపు నవ్వులు  నవ్వుతూ హడావిడి నడకలతో మనుష్యులు వెళ్ళిపోతూ ఉంటారు. లేనివాళ్ళు కాలినడకన, కొందరు రిక్షాలపైన, డబ్బు గలవాళ్ళు కార్లపైన వెడుతూ ఉంటారు. నగరంలో రోడ్లమీద జాగ్రత్తగా నడవాలి. నాలుగుప్రక్కలకూ చూసుకోవాలి. అక్కడ ఏ పక్కనుంచైనా ప్రమాదం ఎదురవుతుంది. నగరంలో ప్రజలు ఏకాకిగా జీవిస్తారు. నగరజీవనం ఒక పట్టాన అర్థం కాదు. అది ఒక చిక్కుల వలయం. పద్మవ్యూహం.


2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో రాయండి.
జ: నేడు మనుషులంతా నగరాల్లోనే జీవించాలని తాపత్రయపడుతున్నారు. నగరంలో ఉన్నతవిద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల ప్రజలందరూ నగరాలకు ఎగబ్రాకుతున్నారు. అందువల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాలలోకి వచ్చే ప్రజలు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకట్లేదు. ప్రజలు నడచివెళ్ళడానికి రోడ్లు చాలట్లేదు. సరిపడ మంచినీరు దొరకట్లేదు. ఆహారపదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. నగరాలకు వచ్చే వారు మురికివాడల్లో నివసించవలసి వస్తోంది. సిటీబస్సులు, రైళ్ళు ఎన్ని ఏర్పాటు చేసినా వారికి ప్రయాణసౌకర్యాలు సరిపోవడం లేదు. చెరువులు వగైరా కప్పిపెట్టి, పల్లపు ప్రదేశాల్లో వారు ఇళ్ళు కడుతున్నారు. అందువల్ల వర్షాలు వచ్చినప్పుడు వారి ఇళ్ళు మునిగిపోతున్నాయి. త్రాగడానికీ, వాడదానికీ వారికి నీరు సరిపోవడం లేదు.
     అందరికి ఉద్యోగాలు దొరకడం లేదు. నగరాల్లో వివిధ పరిశ్రమలు ప్రారంభిస్తున్నారు. దానితో నగరాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. పీల్చడానికి మంచి గాలి కూడా దొరకడం లేదు. ఇళ్ళ అద్దెలు పెరిగాయి. కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు దొరకడం లేదు. పిల్లల చదువుల కాన్వెంటు ఫీజులు పెరిగిపోయాయి. తగినంత ఆదాయాలు లేవు. అందువల్ల నేడు నగర జీవనం సంక్లిష్టంగా మారింది.   
 IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు:
అ) నగరజీవనంలోని అనుకూల అంశాలపై కవిత రాయండి.
ఆ) మనపరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషిచేయాలని తెలిపేలా, కరపత్రం రాసి ప్రదర్శించండి.


V) గైహికము (ఇంటిపని)
అ)పుట సంఖ్య 52లోని వచన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ)పాఠం చదివి ముఖ్యమైన పదాలు గుర్తించి రాయండి.
VI) పదజాలం :
1. కింది పదాలకు అర్థాలు రాయండి.
అ) నగారా        =  పెద్ద ఢoకా           ఆ) హోరు = తీవ్రమైన ధ్వనికి అనుకరణం (గాలివీయడం, వానకురవడం)
ఇ) పఠనీయ గ్రంథo       =  చదువ దగిన పుస్తకo
2. పర్యాయపదాలు
 అ) నరుడు  :   మానవుడు,       మనిషి 
 ఆ) అరణ్యం  :   విపినం,     అడవి
 ఇ) రైతు      :   కర్షకుడు,    కృషీవలుడు 
  ఈ) పువ్వు   :   కుసుమం,    పుష్పం
  ఉ) మరణం   :   చావు,     మృత్యువు
  ఊ) వాంఛ    :  కోరిక,       అభిలాష
  ఋ) వృక్షం   : చెట్టు,    తరువు
VII) వ్యాకరణాంశాలు :
1. కింది కవితాభాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.
  అ) ‘నగారా మోగిందా
       నయాగరా దుమికిందా’
  జ: అంత్యానుప్రాసాలంకారం
  ఆ) కొందరికి రెండు కాళ్ళు
       రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
       ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
  జ: అంత్యానుప్రాసాలంకారం
VIII) ప్రశ్నల నిధి 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ కవితల ప్రత్యేకత ఏమిటి ?
ఆ) పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.
ఇ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
ఈ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
ఉ) నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో రాయండి.
IX) నికష
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.                  6మా
  అ)పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.
  ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.                         
2. కింది పదాలకు అర్థాలు రాయండి.                                             2మా
   అ) నగారా =                                         ఆ) హోరు =
3. కింది వాటికి పర్యాయపదాలు  రాయండి.                                    2మా 
   అ) రైతు                                               ఆ) పువ్వు   

5. నగరగీతం
                                                                          - అలిశెట్టి ప్రభాకర్ 
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు : 
నగర జీవితంలోని అనుకూల, ప్రతికూల అంశాలను గురించి చెప్పగలగాలి   
 పరిసరాల పరిశుభ్రత కోసం అందరు కృషి చేయాలని తెలుపుతూ కరపత్రం రాయగలగాలి           
 పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగలగాలి. రాయగలగాలి
రూపకాలంకారం లక్షణాలను తెలుసుకోగలగాలి
II) ముఖ్య పదాలు – అర్థాలు 
మినీ కవిత               =  గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం 
నగారా                    =   పెద్ద ఢoకా 
పఠనీయ గ్రంథమే       =  చదువ దగిన పుస్తకమే 
సిటీ                      =  నగరం, పట్టణం 
దారిద్ర్యం                 =  బీదతనం 
తీరిక                     =  విశ్రాంతి 
మెర్క్యురీ నవ్వులు    =   పాదరసం నవ్వులు (తెచ్చి పెట్టుకున్న అసహజపు నవ్వులు)
చిక్కదు                 =   దొరకదు 
రసాయన శాల         =   ప్రయోగశాల 
మహా వృక్షం మీద    =    పెద్ద చెట్టు మీద 
సౌభాగ్యం               =  ధన వైభవం 

III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ కవితల ప్రత్యేకత ఏమిటి ?
జ: అలిశెట్టి ప్రభాకర్ గారు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరు సంవత్సరాలపాటు సీరియల్ గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగర జీవనంపై మినీ కవితలు రాశారు. ప్రభాకర్ గారి కవితలు ప్రఖ్యాతి పొందాయి.  అలిశెట్టి ప్రభాకర్ గారు కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని, పాఠకుల్లో ప్రగతినీ, ఆలోచనా దృక్పథాన్నీ, సామాజిక చైతన్యాన్నీ పెంపొందించిన మహాకవి. నగర జీవితంలోని యథార్థ దృశ్యాన్ని, పాఠకుల కళ్ళముందు నిలుపుతూ, నగరం యొక్క మరో పార్శ్వాన్ని  కవి ఎత్తిచూపారు. వాస్తవాలను కఠినంగా నిర్వచించారు. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా కోట్ చేయబడ్డ కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ గారిదే.
ఆ) పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.
జ: నగరం అంటే పట్టణం. పట్టణాలను మున్సిపాలిటీలుగా, కార్పోరేషనులుగా వర్గీకరిస్తారు. పట్టణాల్లో కనీసం 50 వేలకు పైగా జనాభా ఉంటారు. కోటి జనాభా మించిన నగరాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. మన దేశంలో బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాదు నగరాల జనాభా కోటిని మించింది. పల్లెలను పంచాయితీలుగా, నగర పంచాయితీలుగా, మైనర్ పంచాయితీలుగా వర్గీకరిస్తారు. నగరాల్లో పన్నులు ఎక్కువ. అయినా మంచినీరు సదుపాయం, మంచి రోడ్లు, వీధి దీపాలు, రోడ్లను శుభ్రంచేసే సిబ్బంది ఉంటారు. పల్లెల్లో సదుపాయాలు తక్కువ. నగరాల్లో 24 గంటలు విద్యుత్తు ఉంటుంది. పరిశ్రమలు ఉంటాయి. విద్యా వైద్య సదుపాయాలు ఉంటాయి. పల్లెల్లో సదుపాయాలు ఉండవు.
ఇ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జ: నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ పొద్దున్నే వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు ఇంటినుండి బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది. అలాగే నగరంలో కూలిపనులు చేసి జీవించే వారికి కూడా, వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.
     ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికీ, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.  
ఈ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
జ: పట్టణాలకు వచ్చి ఏవో సుఖాలను అనుభవించాలనుకునే వారికి, పట్టణాల నిజస్వరూపాన్ని తెలపడమే కవి యొక్క ఆంతర్యం. నగరాల్లో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటారని భ్రాంతిపడే పల్లె ప్రజలకు, పట్టణాల్లో ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయనీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నగరజీవనం, సమస్యల వలయం అనీ చెప్పడమే కవి ఆంతర్యం.
   నగర జీవనం ‘పద్మవ్యూహం’ లాంటిదనీ, ఒక్కసారి ఆ నగరజీవనం చిక్కుల్లో చిక్కుకుంటే, ఆ బంధనాల నుండి బయటపడడం కష్టమనీ తెలపడమే, కవి ఆంతర్యం. నగరవాసులకు తీరిక దక్కదనీ, వారి కోరికలు తీరవనీ, కవి నగరం యథార్థ స్వరూపాన్ని వెల్లడించాడు. నగరంలో కనిపించే పైపై మెరుగులకు మురిసిపోయి పల్లెలను వదిలి నగరాలకు రావద్దని, పల్లెవాసులకు హితబోధ చేయడమే, కవి గారి ఆంతర్యం. 
ఉ) నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.
(లేదా)
నగర జీవితం ఎలా ఉంటుందో రాయండి.
జ: నగరంలో మనిషి రోడ్లమీద నడుస్తూ ఉన్నా, లేక ఏదైనా వాహనాలలో వెళ్ళినా పెద్దగా నగారా మోగినట్లుగా ధ్వని వినబడుతూ ఉంటుంది. పట్టణాల్లో చిన్న చిన్న ఇరుకు ఇళ్ళల్లో జీవించాలి. అక్కడ గాలికూడా సరిగా రాదు. నగరంలో ఒకరిని ఒకరు పట్టించుకోరు. ఎవరి బతుకు వారిదే. పేవ్ మెంట్లపై నడవాలి. సిటీబస్సులు ఎక్కాలి. ఎక్కడచూసినా జనమే. పిల్లల్ని కాన్వెంటులకు పంపాలి. పట్టణాల్లో అందమైన భవనాలతో పాటు పూరిపాకలు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వర్యంతో పాటు దరిద్రం కూడా ఉంటుంది. అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. 
      ఎంత కష్టపడి పనిచేసినా, నగరవాసుల కోరికలు తీరవు. నగరంలో ఎవరికీ తీరుబడి ఉండదు. కృత్రిమపు నవ్వులు  నవ్వుతూ హడావిడి నడకలతో మనుష్యులు వెళ్ళిపోతూ ఉంటారు. లేనివాళ్ళు కాలినడకన, కొందరు రిక్షాలపైన, డబ్బు గలవాళ్ళు కార్లపైన వెడుతూ ఉంటారు. నగరంలో రోడ్లమీద జాగ్రత్తగా నడవాలి. నాలుగుప్రక్కలకూ చూసుకోవాలి. అక్కడ ఏ పక్కనుంచైనా ప్రమాదం ఎదురవుతుంది. నగరంలో ప్రజలు ఏకాకిగా జీవిస్తారు. నగరజీవనం ఒక పట్టాన అర్థం కాదు. అది ఒక చిక్కుల వలయం. పద్మవ్యూహం.


2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో రాయండి.
జ: నేడు మనుషులంతా నగరాల్లోనే జీవించాలని తాపత్రయపడుతున్నారు. నగరంలో ఉన్నతవిద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల ప్రజలందరూ నగరాలకు ఎగబ్రాకుతున్నారు. అందువల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాలలోకి వచ్చే ప్రజలు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకట్లేదు. ప్రజలు నడచివెళ్ళడానికి రోడ్లు చాలట్లేదు. సరిపడ మంచినీరు దొరకట్లేదు. ఆహారపదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. నగరాలకు వచ్చే వారు మురికివాడల్లో నివసించవలసి వస్తోంది. సిటీబస్సులు, రైళ్ళు ఎన్ని ఏర్పాటు చేసినా వారికి ప్రయాణసౌకర్యాలు సరిపోవడం లేదు. చెరువులు వగైరా కప్పిపెట్టి, పల్లపు ప్రదేశాల్లో వారు ఇళ్ళు కడుతున్నారు. అందువల్ల వర్షాలు వచ్చినప్పుడు వారి ఇళ్ళు మునిగిపోతున్నాయి. త్రాగడానికీ, వాడదానికీ వారికి నీరు సరిపోవడం లేదు.
     అందరికి ఉద్యోగాలు దొరకడం లేదు. నగరాల్లో వివిధ పరిశ్రమలు ప్రారంభిస్తున్నారు. దానితో నగరాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. పీల్చడానికి మంచి గాలి కూడా దొరకడం లేదు. ఇళ్ళ అద్దెలు పెరిగాయి. కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు దొరకడం లేదు. పిల్లల చదువుల కాన్వెంటు ఫీజులు పెరిగిపోయాయి. తగినంత ఆదాయాలు లేవు. అందువల్ల నేడు నగర జీవనం సంక్లిష్టంగా మారింది.   
 IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు:
అ) నగరజీవనంలోని అనుకూల అంశాలపై కవిత రాయండి.
ఆ) మనపరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషిచేయాలని తెలిపేలా, కరపత్రం రాసి ప్రదర్శించండి.


V) గైహికము (ఇంటిపని)
అ)పుట సంఖ్య 52లోని వచన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ)పాఠం చదివి ముఖ్యమైన పదాలు గుర్తించి రాయండి.
VI) పదజాలం :
1. కింది పదాలకు అర్థాలు రాయండి.
అ) నగారా        =  పెద్ద ఢoకా           ఆ) హోరు = తీవ్రమైన ధ్వనికి అనుకరణం (గాలివీయడం, వానకురవడం)
ఇ) పఠనీయ గ్రంథo       =  చదువ దగిన పుస్తకo
2. పర్యాయపదాలు
 అ) నరుడు  :   మానవుడు,       మనిషి 
 ఆ) అరణ్యం  :   విపినం,     అడవి
 ఇ) రైతు      :   కర్షకుడు,    కృషీవలుడు 
  ఈ) పువ్వు   :   కుసుమం,    పుష్పం
  ఉ) మరణం   :   చావు,     మృత్యువు
  ఊ) వాంఛ    :  కోరిక,       అభిలాష
  ఋ) వృక్షం   : చెట్టు,    తరువు
VII) వ్యాకరణాంశాలు :
1. కింది కవితాభాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.
  అ) ‘నగారా మోగిందా
       నయాగరా దుమికిందా’
  జ: అంత్యానుప్రాసాలంకారం
  ఆ) కొందరికి రెండు కాళ్ళు
       రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
       ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
  జ: అంత్యానుప్రాసాలంకారం
VIII) ప్రశ్నల నిధి 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ కవితల ప్రత్యేకత ఏమిటి ?
ఆ) పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.
ఇ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
ఈ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
ఉ) నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో రాయండి.
IX) నికష
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.                  6మా
  అ)పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.
  ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.                         
2. కింది పదాలకు అర్థాలు రాయండి.                                             2మా
   అ) నగారా =                                         ఆ) హోరు =
3. కింది వాటికి పర్యాయపదాలు  రాయండి.                                    2మా 
   అ) రైతు                                               ఆ) పువ్వు   

6. భాగ్యోదయం
                                               - కృష్ణస్వామి ముదిరాజ్
i) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 
బడుగువర్గాల కోసం కృషి  చేసిన భాగ్యరెడ్డివర్మ గురించి చెప్పగలగడం   
సమాజం కోసం పాటుపడిన వారి గురించి ‘అభినందన’ వ్యాసం రాయగలగడం  
ప్రత్యక్ష, పరోక్ష కథన వాక్యాలను తెలుసుకోవడం 
పాఠం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సొంతమాటల్లో సమాధానాలు రాయగలగడం.   
ii) ముఖ్య పదాలు  - అర్థాలు 
1.  అవస్థ        =   సంకటం 
2. అవగతం    =   అర్థం కావడం 
3. ఉన్నతి      =  అభివృద్ధి
4. అర్పించడం  =  భక్తితో ఇవ్వడం 
5. ఎరుక       =   జ్ఞానం 
6. చైతన్యం     =  కదలిక 
7. ఉదాసీనత  =  పట్టించుకోకపోవడం 
8. సమస్తం    =  సర్వం 
9. లిఖిత బద్ధం =  రాయబడినది
10. కడగండ్లు  =  కష్టాలు 



iii) చర్చనీయ అంశాలు :
1. కులవ్యవస్థ - సమాజంపై ప్రభావం :
‘కులవ్యవస్థ’ అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్లనంతా ఒకే వర్గంగా భావించి, ఆ వర్గం వ్యక్తుల్లోనే సంబంధ బాంధవ్యాలను విస్తరింపజేసుకోవడం. ఈ వ్యవస్థ మానవ సమాజాన్ని విభజిస్తుంది కానీ ఆధునిక యుగంలో విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఇది మరింత పటిష్టం కావడం ఆశ్చర్యకరమైన పరిణామం. కుల సంఘాలు స్థాపించుకోవడం, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం, ఇతర కులాలతో పిల్లలు సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని వ్యతిరేకించడం ఆరోగ్యకరమైన అంశాలు కావు. ఇది పరిహరించి మనుషులంతా ఒక్కటే అన్న భావన పెంపొందించాలి.
2. చిత్తశుద్ధి : 
అంటే మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా వ్యవహరించడం. అంటే స్వచ్ఛమైన మనసుతో ప్రవర్తించాలి. మనఃపూర్వకంగా పనిచేయాలి.
3. నిజాయితీ : 
న్యాయబద్ధంగా నడుచుకోవడమే నిజాయితీ. మనం చేసేపని ధర్మబద్ధంగా, సత్యాన్ని అతిక్రమించకుండా, ఎవరికీ అన్యాయం కలగకుండా ఉండేటట్లు చూసుకోవడం నిజాయితీ.
4. అజ్ఞానం, ఉదాసీనత వల్ల నష్టాలు :
అజ్ఞానం అంటే తెలియనితనం. ఉదాసీనత అంటే పట్టనట్లుండడం. ఈ రెండు అనేక కష్టాలకు, నష్టాలకూ కారణమవుతాయి. మానవజాతి వినాశనానికి సగం కారణం అజ్ఞానం ఐతే మరోసగం అమాయకత్వం అన్నారు మహానుభావులు.
ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం లేకపోయినా ఆ విషయంలో ప్రయోజనాన్ని పొందలేము. ఉదాహరణకు మహిళలకు గృహహింస చట్టం గురించి తెలియదనుకోండి. అప్పుడు ఇంట్లో ఎంత వేదన అనుభవిస్తున్నా, కష్టాలు పడుతున్నా ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా ఫలితం ఉండదని తమలో తాము బాధపడుతూ చివరికి ప్రాణాంతక పరిస్థితుల్లోకి తమనుతాము నెట్టుకుంటారు. ఇక రెండోది ఉదాసీనత. ఇది అజ్ఞానం కంటె భయంకరమైనది.చట్టాల గురించి తెలిసినా సరే ! ఎవరొచ్చి ఉద్ధరిస్తారు?’ అని అనుకోవడం. ‘నా కర్మ ఇలా కాలింది’ అని సరిపెట్టుకోవడం. ఏ మాత్రం లక్ష్యపెట్టకపోవడం..... ఇవన్నీ నష్టాన్ని కలిగించేవే కదా! ఇదే విధంగా ....
ప్రభుత్వ పథకాలు ; హక్కులు ; ఉమ్మడి ఆస్తుల రక్షణ, వినియోగం; సామాజిక సౌకర్యాలు; ఓటు హక్కు ; సమాచార హక్కు వంటి వాటి గురించి తెలుసుకోకపోవడం....
మనకేం జరిగినా; పక్కవాళ్ళకి నష్టం జరిగినా; పర్యావరణం పాడైపోతున్నా; వీధి వాడ మురికి కూపంగా  మారినా; ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా; అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం అన్ని రకాల కష్టనష్టాలు కలిగిస్తాయి.
5. మూఢ నమ్మకాలు అంటే .....
మూఢo అంటే అజ్ఞానం (తెలివిలేనితనం). ఏ విషయాన్నైనా గుడ్డిగా (అజ్ఞానంగా) నమ్మడాన్నే మూఢనమ్మకం అంటారు.ఎదుటివాళ్లు ఏది చెప్పినా నిజమేనన్న అమాయకత్వంతో, ఎదురు ప్రశ్నించకుండా, కనీసం ఆలోచించకుండా నమ్మి అనుసరించడమే మూఢనమ్మకం. తరతరాలుగా ఇలాంటి నిజాలని అనుసరిస్తూ, వాటిని సంప్రదాయంగా మలచి , కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మూఢనమ్మకాలను ఈ సమాజంలో స్థిరపడేటట్లు చేసుకున్నాం.
దయ్యాలు; చేతబడులు; బాణామతులు; తుమ్మితే, పిల్లిఎదురైతే, విధవల ముఖం చూస్తే అశుభం కలుగుతుందనుకోవడం; కుడికాలు – ఎడమకాలుకు తేడా; పుట్టుమచ్చలు; బల్లిపడటం; కలలుకనడం..... ఇలా ఎన్నో......  
6. వర్మ తన జాతి జనుల్లో తెచ్చిన మార్పు ......
  భాగ్యరెడ్డివర్మ తెలంగాణ రాష్ట్రంలో 20వ శతాబ్దపు ప్రారంభంలో నిమ్న జాతుల అభ్యున్నతికి, సమాజ శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన సంస్కర్త.
మనుషులంతా సమానమని, ఎవరూ ఎక్కువ తక్కువ కాదన్న నిజాన్ని గ్రహించేలా చేశాడు.
నిమ్న జాతులపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ, వాళ్లు చదువుకునేలా చేశాడు.
బహిరంగ సభలు నిర్వహించి, హిందువులందరినీ ఒక్క తాటిమీదికి తెచ్చే ప్రయత్నం చేశాడు.
దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలకు అడ్డుకట్ట వేశాడు. 
తాగుడు మాన్పించగలిగాడు.
అనేక దురాచారాల నుంచి కొన్ని కుటుంబాలను కాపాడగలిగాడు.

7. మంచి వక్త:
మంచి వక్త అంటే బాగా మాట్లాడగలిగేవాడు. బాగా మాట్లాడటం అంటే 1) సందర్భానికి తగ్గట్టు మాట్లాడడం. 2) తగినంత మాట్లాడటం 3) మంచి భాష ఉపయోగించి, స్పష్టంగా మాట్లాడటం 4) ఎంత కఠినమైన విషయాన్నైనా సున్నితంగా చెప్పగలగడం. 5) చక్కని జాతీయాలు, ఉదాహరణలు, సామెతలు సమయోచితంగా ఉపయోగించడం 6) ధారాళంగా మాట్లాడడం 7) ప్రేక్షకులకు/శ్రోతలకు అర్థమయ్యేట్టుగా మాట్లాడడం 8) అలంకారంగా మాట్లాడడం 9) హేతుబద్ధతతో మాట్లాడడం 10) ప్రయోజనాత్మకంగా, సందేశాత్మకంగా మాట్లాడడం
8. నాయకత్వ పటిమను అంచనా వేయడం :
‘నాయకత్వం’ అంటే పదిమంది మేలుకోరుతూ ముందుండి పనిచేయడం. నూటికొక్కడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఒక నాయకుని నాయకత్వ పటిమను అంచనా వేయాలంటే ....
ధైర్యంగా ఎంతటివారితోనైనా మాట్లాడడం.
ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం అందించడం.
తనకు నష్టమైనా, కష్టమైనా భరిస్తూ, సమాజం మేలు కోసం పనిచేయడం.
సమాజ చైతన్యం కోసం కృషి చేయడం.
స్వార్థాన్ని వదిలి, అందరి బాగు కోసం పనిచేయడం.
అందరినీ తన మాటలతో ఒప్పించడం, చేతలతో అభిమానాన్ని చూరగొనడం.
సమాజాన్ని ఒక్క తాటి మీద నడిపించడం.
పోరాట పటిమను రగిలించడం.
అనుకున్నది సాధించడానికి ప్రాణాలనైనా త్యజించడానికి సిద్ధపడడం.




iv) పాఠ్యపుస్తకములోని ప్రశ్న – జవాబులు 
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జ: చదువుకుంటే విచక్షణ కలుగుతుంది. వివేకం వస్తుంది. మంచిచెడులు తెలుస్తాయి. ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుస్తాయి. దురాలవాట్ల వలన కలిగే నష్టాలు తెలుస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది. చేసేపనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది.
ఆ) అసమానతలు తొలిగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
జ: చదువుకునే అవకాశాలు పెరగాలి. చదువుకునేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఉద్యోగాలలో రిజర్వేషను అమలు చేయాలి. భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలి. పని కల్పించాలి. రాజకీయ పదవులను కూడా ఇవ్వాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రతీ వ్యక్తీ గౌరవంగా జీవించడానికి సరిపడా సదుపాయలు కల్పించాలి. పేదలకు ప్రభుత్వం అండగా నిలబడాలి. మానవులంతా సమానమనే భావం కలిగించాలి. చైతన్యం కలిగించాలి. మూఢనమ్మకాలను పారద్రోలాలి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కల్గించాలి. కుల నిర్మూలన జరగాలి. అప్పుడే సమాజంలోని అసమానతలు తొలుగుతాయి. సమానత్వం వస్తుంది. నవసమాజం ఏర్పడుతుంది.
ఇ) అంకితభావంతో పని చేయడం అంటే ఏమిటి ?
జ: అంకితము అంటే పూర్తిగా వశం అవ్వడం. అంకితభావం అంటే పూర్తిగా వశం అయినట్లు భావించడం. అంకితభావంతో పనిచేయడమంటే పూర్తిగా పనిలో మునిగిపోవడం. ఇతరం ఏమీ ఆలోచించకుండా పని గురించే ఆలోచించడం. వేరే పనులేమి చేయకుండా చేయదలచుకొన్న పని మాత్రమే చేయడం. అంటే చేస్తున్న పనిలో పూర్తిగా మునిగిపోవడం. ఫలితం ఆశిoచకుండా కేవలం పని చేయడం. తనకంటూ వేరే ఆలోచన లేకుండా పనిచేయడాన్ని అంకితభావంతో పనిచేయడo అంటారు.


ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
జ: వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు ఐతే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా వ్యసనం అనే మాట ‘చెడు అలవాటు’ అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. చెడు వ్యసనాల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. సంపాదనా మార్గాలు, సమయం తగ్గిపోతుంది. సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. కోపం పెరుగుతుంది. గొడవలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితులు దూరం అయిపోతారు.ఒక్కొక్కసారి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి. దానితో మరణం కూడా సంభవించవచ్చు. అందుచేత చెడు వ్యసనాలున్న వారిని చైతన్యపరచి ఆ చెడు వ్యసనాలను మాన్పించడం మనధర్మం. మన కర్తవ్యం.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు? 
జ: చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తాం. మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్థాలను సోదాహరణంగా వివరిస్తాం. నమ్మకం మంచిదే. కాని మూఢనమ్మకo పనికిరాదని చెబుతాం. వాళ్లకు పూర్తిగా నమ్మకం కలగడానికి అనుభవపూర్వకంగా నిరూపిస్తాం. దిగదుడుపులు వలన రోగాలు తగ్గవని చెబుతాం. దిగదుడిచినవి తొక్కినా ఏమీ కాదని నిరూపిస్తాం. దిగదుడిచిన నిమ్మకాయలు కోసుకొని హాయిగా రసం తాగుతాం. చిల్లంగి, చేతబడి వంటివి కూడా తప్పని నిరూపిస్తాం. జనవిజ్ఞాన వేదిక వారిని మా గ్రామానికి ఆహ్వానిస్తాం. ప్రదర్శనలు ఇప్పిస్తాం. ఉపన్యాసాలు చెప్పిస్తాం. ప్రజలలో చైతన్యం కలిగిస్తాం. మా గ్రామం నుండి మూఢనమ్మకాలను తరిమేస్తాం. సశాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేస్తాం.  ‘మూఢనమ్మకాలు లేని గ్రామం’ అని మా గ్రామపు సరిహద్దులలో బోర్డు పెడతాం.
(లేదా)
ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి?
జ: ఆదిహిందువులు అనుభవిస్తున్న అవస్థల నుండి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డివర్మ చాలా కృషి చేశాడు. అంకితభావంతో పనిచేశాడు. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనత అనే విషయం వారు గ్రహించేలా చేశాడు వర్మ. మానవులలో ఎక్కువ, తక్కువలు లేవని ఆదిహిందువులు తెలుసుకొనేలా చేశాడు. 3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్యపరిచాడు. దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొన్నాడు. 
   ఆదిహిందువులకు చదువుపై శ్రద్ధ కలిగించాడు. తాగుడు మాన్పించాడు. మూఢాచారాలు మాన్పించాడు. ఆటల ప్రదర్శన నిర్వహించాడు. ఆదిహిందువులకు ప్రభుత్వం అండగా నిలిచేలా చేశాడు.
v) పదజాలం
1. కింది పదాలకు పర్యయపదాలను రాయండి.
  అ) అండ      =    ఆధారం,  ఆదరువు,  ఆలంబనం,  ఆసరా,   ఆశ్రయం 
ఆ) ఉన్నతి       = గొప్ప,     ఘనత,    పెంపు,     దొడ్డతనం,     మేటి 
ఇ) స్వేచ్ఛ        =  స్వచ్ఛదoము,    అలవోక,   స్వతంత్రత,    స్వాతంత్ర్యం 
ఈ) వికాసం      =  వికసనం,    ప్రఫల్లం 
2. కింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) ఏకతాటిపై          =  ప్రజలంతా ఏకతాటిపై ఉండాలి. అప్పుడే ప్రగతి సాధ్యం.
ఆ) మచ్చుతునక     =  తెలంగాణ వైభవానికి నల్లగొండ కోట మచ్చుతునక.
ఇ) మహమ్మారి       =  వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.
ఈ) నిరంతరం         =  పిల్లలు నిరంతరం చదువుపై దృష్టి పెట్టాలి.
3. కింది పదాలను/ పదబంధాలను వివరించి రాయండి.
అ) అoకితం కావడం             =  చేయదలచుకొన్న పని తప్ప వేరే ఆలోచన, పని లేకపోవడం 
ఆ) నైతిక మద్దతు                =  ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా మద్దతును   
                                         ప్రకటించడం.
ఇ) చిత్తశుద్ధి                      =  మనస్సులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించడం.
ఈ) సాంఘిక దురాచారాలు      =    సంఘపరమైన చెడు ఆచారాలు
ఉ) సొంతకాళ్ళపై నిలబడడం    =  ఎవరిపైనా, దేనికీ ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడం.
vi) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :
అ) భాగ్యరెడ్డివర్మ గురించి తెలుసుకొన్నారు కదా! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా ‘అభినందన‘ వ్యాసం రాయండి.
ఆ) భాగ్యరెడ్డివర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలు తెలపండి?
vii) గైహికము (ఇంటిపని)
అ) పుట సంఖ్య 60,61లోని పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ)  పుట సంఖ్య 62,63లోని వ్యాకరణాంశాలు చదువండి.
viii) ప్రశ్నలనిధి 
i) ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
  1. చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
  2. అసమానతలు తొలిగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
  3. అంకితభావంతో పని చేయడం అంటే ఏమిటి ?
  4. వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
ii) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
  1.  మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?                                                                                                                                                                                                                                                                                                                            
  2. భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి?

ix) నికష
i) ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.             4మా
  1. అంకితభావంతో పని చేయడం అంటే ఏమిటి ? 
  2. వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
ii) కింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.                2మా 
  1. నైతిక మద్దతు                 2. సొంతకాళ్ళపై నిలబడడం  
iii) కింది పదాలకు పర్యయపదాలను రాయండి.                               2మా 
  1. అండ =                             2. నిరంతరం
iv) మీకు తెలిసిన  ప్రత్యక్ష, పరోక్ష కథన వాక్యాలు రాయండి.           2మా


7. శతక మధురిమ 
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు:
  నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవడం
 శతక పద్యాల ఆధారంగా మిత్రునికి లేఖ రాయగలగడం 
  ఆటవెలది పద్య లక్షణాలు తెలుసుకోవడం
 చుక్కపద్యాలు కంఠస్థo చేసి, ప్రతిపదార్థం రాయగలగాలి 
II) చుక్కపద్యాలు – ప్రతిపదార్థాలు
1. భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పoబెన్న సత్యంబు, రెం
   డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో 
   త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో 
   గవిధానం బవి లేని పూజల మదిoగైకోవు సర్వేశ్వరా. 
  ప్రతి పదార్థం:
సర్వేశ్వరా                      =   ఓ సర్వేశ్వరా !
భవదీయార్చన                 
(భవదీయ +  అర్చన)       =   నీ యొక్క పూజ
చేయుచోన్                     =   చేసేటప్పుడు 
సత్యంబు                       =   సత్య వచనం
ఎన్నన్                         =   పరిగణింపగా 
ప్రథమ పుష్పoబు            =    మొదటి పుష్పం 
దయాగుణం                   =    దయను కలిగి ఉండటం 
      రెండవ                         =   రెండవదైన  
      పుష్పoబు                     =   పుష్పం
      అతివిశిష్టంబు                 =   మిక్కిలి గొప్ప శ్రేష్ఠమైన 
      ఏకనిష్ఠా సమోత్సవ సంపత్తి; 
      ఏకనిష్ఠా                       =   (నీపై) ఏకాగ్రనిష్ఠతో
      సమోత్సవ సంపత్తి           =   నిండిన ఆనందాధిక్యం
      (సమ + ఉత్సవ, సంపత్తి)  
      తృతీయ పుష్పము          =    మూడవ పుష్పం    
      అది                           =     ఆ పూజ 
      భాస్వద్భక్తి సంయుక్తి యోగవిధానంబు ;
భాస్వత్                        =    మిక్కిలి ప్రకాశించే 
భక్తి సంయుక్తి                 =      భక్తితో కూడిన 
యోగవిధానంబు             =     అష్టాంగ యోగ విధి
అవి లేని పూజలన్           =    ఆ సత్యము, దయ, ఏకాగ్రత, యోగము అనేవి లేని పూజలను ;
మదిన్                         =    నీ మనస్సు నందు 
కైకోవు                         =    స్వీకరింపవు (గ్రహింపవు)
2. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
    చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
    పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో 
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా ! 
  ప్రతి పదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా                 =   శ్రీకాళహస్తి క్షేత్రoలో వెలసిన ఓ ఈశ్వరా ! 
ఊరూరన్                         =   ప్రతి గ్రామంలోనూ    
జనులెల్లన్                       =   ప్రజలందరున్
(జనులు + ఎల్లన్)
 భిక్షమిడరో                      =   అడిగినచో భిక్షం పెట్టారా
(భిక్షము + ఇడరు + ఓ)
ఉందన్                           =   నివాసం ఉండడానికి ; (నివసించడానికి)
గుహల్                           =   గుహలు
కల్గవో (కల్గవు + ఓ)          =   లేవా ?
చీరానీకము                    =   నారబట్టల సముదాయం
(చీర + అనీకము)                      (చెట్టు పట్టలు)
వీధులన్                       =   వీధి అంగళ్ళలో 
దొరకదో                        =   లభింపదా ?
(దొరకదు + ఓ)
శీతామృత స్వచ్ఛవాఃపూరంబు ;
శీత                               =   చల్లని
అమృత                         =   అమృతం వంటి 
స్వచ్ఛ                           =  నిర్మలమైన 
వాఃపూరంబు                  =   నీటి ప్రవాహం 
ఏఱులన్                       =   సెలయేళ్ళలో
పాఱదో                         =    ప్రవాహించట్లేదా ?
(పాఱదు + ఓ)
తపసులన్                    =   ఋషులన్ (తపస్సు చేసుకునే మునులను)
ప్రోవంగన్                      =   రక్షించడానికి
 నీవు                           =   నీవు
ఓపవో                          =   సమర్థుడవు కావా !
(ఓపవు + ఓ)
జనుల్                         =   ప్రజలు
రాజులన్                      =    రాజులను 
చేరన్                          =    ఆశ్రయించడానికి 
పోవుదురేల                 =    ఎందుకు వెడతారో  కదా !
(పోవుదురు + ఏల)
     
3. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుoడౌదలన్
    గురుపాదానతి కేలనీగి చెవులoదున్విన్కి వక్త్రంబునన్  
     స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
     హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతివాచస్పతీ !
 ప్రతి పదార్థం:
సురభిమల్లా                   =    ఓ “సురభిమల్ల” భూపాలుడా!
నీతివాచస్పతీ                 =    నీతిశాస్త్రములయందు దేవతల గురువైన బృహస్పతి వంటి గొప్పవాడా !
ఔదలన్                         =    శిరస్సు  
గురుపాదానతి                
(గురుపాద + ఆనతి)
గురుపాద                       =    గురువు గారి పాదాలకు 
ఆనతి                            =    మ్రొక్కుటయు (నమస్కరించడమూ)
కేలన్                             =    చేతియందు
ఈగి                               =    దాన గుణమునూ
చెవులoదున్                   =    చెవులయందు
విన్కి                              =   శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్                     =    ముఖమునందు
స్థిర సత్యోక్తి 
 స్థిర                               =   స్థిరమైన  
సత్యోక్తి (సత్య + ఉక్తి)         =   సత్యమైన వాక్కునూ               
భుజంబులన్                   =   భుజములందు
విజయమున్                  =   విజయమునూ 
చిత్తంబునన్                   =   మనస్సునందు
 సన్మనోహర సౌజన్యము ;
సత్                              =   చక్కని
మనోహర                       =   ఇంపైన 
సౌజన్యము                    =   మంచితనమునూ 
కల్గినన్                          =   కల్గి ఉన్నట్లయితే
బుధుoడు                      =   పండితుడు
సిరి                               =   ఐశ్వర్యo
లేకైనన్ (లేక + ఐనన్)     =   లేకుండా ఉన్నా(లేకపోయినా)
విభూషితుండె                 =   అలంకరింపబడినవాడే   
(విభూషితుండు + ఎ) 
అయి                             =   అయి
భాసిల్లున్                        =  ప్రకాశిస్తాడు.
4. భండనభీముఁ  డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
    దండ కళాప్రచండ భుజతాండవ  కీర్తికి రామమూర్తికిన్
    రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
    డాండ డడాండ డాండ నినదంబులజాండము నిండ మత్తవే
    దండము నెక్కి చాటెదను దాశరథి ! కరుణా పయోనిధీ
  ప్రతి పదార్థం:          
దాశరథీ                       =    దశరథుని కుమారుడవైన ఓ శ్రీరామచంద్రా! 
కరుణాపయోనిధీ            =     దయకు సముద్రుడైన వాడా! (గొప్ప దయగలవాడా!) ఓ శ్రీరామా!
భండనభీముడు
భండన                         =    యుద్ధముల యందు
భీముడు                       =    శత్రువులకు భయంకరుడు
ఆర్తజన బాంధవుడు ;      
ఆర్తజన                         =    దుఃఖమును పొందినవారికి (దీనులకు)
బాంధవుడు                   =    బంధువు (చుట్టం)
డుజ్జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ  కీర్తికిన్ ;
ఉజ్జ్వల                          =    ప్రకాశించుచున్న 
బాణ                             =    బాణములను  
తూణ                            =    అమ్ముల పొదులును గల 
కోదండ కళా                   =    విలువిద్య యందు; 
ప్రచండ                          =    ఉగ్రమైన (మిక్కిలి తీవ్రమైన)
భుజతాండవ                  =    బాహువుల యొక్క నటనము చేత కలిగిన 
కీర్తికిన్                          =    కీర్తి కలవాడు
రామమూర్తికిన్               =    శ్రీరామచంద్రునికి 
రెండవ సాటి దైవము       =    సమానమైన మరియొక దేవుడు
ఇకన్                           =    ఇంక
లేడు                            =     లేడు
అనుచున్                     =    అని చెపుతూ 
గడగట్టి                         =   స్తంభమునాటి (జెండాచేత పట్టుకొని)
భేరికా డాండ డడాండ డాండ నినదంబులు ;
భేరికా                          =    భేరివాద్యము యొక్క
డడాండ, డాండ, డాండ  =    డాం డాం డాం అనే
నినదంబులు                =    ధ్వనులు
అజాండము                 =    బ్రహ్మాoడo
నిండన్                       =    నిండునట్లుగా
మత్తవేదండమున్         =    మదించిన ఏనుగును
ఎక్కి                           =    ఎక్కి
చాటెదను                    =     చాటిస్తాను. (ప్రకటిస్తాను)

5.  ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వoసహా
    జన  దైన్యస్థితి  బోనడంచి  సకలాశాపేశలానంద  జీ 
    వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
    అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !

  ప్రతి పదార్థం:
విశ్వనాథేశ్వరా                            
(విశ్వనాథ + ఈశ్వరా)                  =   ఓ విశ్వనాథుడు అనే ఈశ్వరా !
వేడు                                         =    ఎవడు
త్యాగమయ దీక్షన్                       =    త్యాగంతో కూడిన దీక్షను 
పూని                                        =    వహించి 
సర్వo సహా జనదైన్య స్థితిన్ ;     
సర్వoసహా                                 =    భూమిపైనున్న 
జన                                          =    జనులయొక్క 
దైన్య స్థితిన్                                =    దీనత్వమును (జాలి కలిగించే స్థితిని)
పోనడంచి                                  =    పోయేటట్లుగా ఆపి 
(పోన్ + అడంచి)                         =      (పోయేటట్లు చేసి) 
సకలాశాపేశలానంద జీవన సంరంభమున్ ;
సకల                                        =    సమస్తమైన
ఆశా                                         =    కోరికలతో
పేశల                                        =   అలంకరించబడిన (అన్ని కోరికలు తీరిన)
ఆనంద                                     =    సంతోషమయమైన
జీవన                                       =    బ్రతుకులోని
సంరంభమున్                            =    ఉత్సాహమును
పెంచి                                      =    పెంపుచేసి
దేశజననీ ప్రాశస్త్యమున్
దేశజననీ                                 =    దేశమాత యొక్క
ప్రాశస్త్యమున్                            =    ప్రశస్తి (ప్రసిద్ధిని ) గొప్పతనాన్ని
పెంచునో                                  =     పెంచుతాడో (వృద్ధిని పొందిస్తాడో)
అవ్వాడు (ఆ + వాడు)               =     అటువంటివాడే
ఘనుడు + అగున్                    =     గొప్పవాడు అవుతాడు.

6. పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోధిoచు మిత్రుండు, సం 
   విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా 
   యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
   చ్చితంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా ! 
  
ప్రతి పదార్థం:
శ్రీలొంకరామేశ్వరా
శ్రీ                       =   వన్నెగల 
లొంక                  =   లొoకలో వెలిసిన  (లొoక క్షేత్రంలో)
రామేశ్వరా           =   రామేశ్వర స్వామీ!
మిత్రుండు           =   స్నేహితుడు
పొత్తంబై              =   పుస్తకమై
(పొత్తంబు + ఐ) 
కడున్                =   మిక్కిలి
నేర్పుతోన్        =  నేర్పుతో
హితమున్       =   మంచిని  (మేలు చేకూర్చు దానిని)
ఉద్భోధిoచున్   =   బోధిస్తాడు
మిత్రుండు        =   స్నేహితుడు
సంవిత్తంబై        =   విలువైన ధనమై
(సంవిత్తంబు + ఐ)
ఒక కార్యసాధనమునన్ =   ఒక కార్యాన్ని సాధించే పనిలో
వెల్గొందున్       =       ప్రకాశిస్తాడు
స్వాయత్తంబైన  =     తన స్వాధీనమైన
(స్వాయత్తంబు + ఐన)
కృపాణమై       =   ఖడ్గము వంటివాడై
(కృపాణము + ఐ)
అరులన్         =   శత్రువులను 
ఆహారించున్    =   ఆరగిస్తాడు (సంహరిస్తాడు)
మిత్రుడు        =   స్నేహితుడు
తగన్            =   తగు విధంగా 
ప్రోచ్చితంబై           =   నిండు మనసు కలవాడై
(ప్ర + ఉత్ + చిత్తంబు + ఐ)
సుఖము              =   సుఖాన్ని
ఇచ్చున్               =   ఇస్తాడు.  
III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి ?
జ: నా దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే, శ్రీరాముని వలె, ధర్మరాజువలె, ఉండాలి. ఎందుకంటే రాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి చెబితే, సముద్రంలోనైనా, అగ్నిలోనైనా దూకుతానన్నాడు. రాముడు శరణాగత రక్షకుడు. విభీషణునికి అభయమిచ్చి, అతడిని లంకానగర చక్రవర్తిని చేశాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. తమ్ముళ్ళతో కలిసి ఉన్నాడు. సత్యమునే పలికాడు. శాంతి, దయలను ఆభరణాలుగా ధరించాడు.   
ఆ) నిజమైన త్యాగి ఎవరు ? అతని లక్షణాలెట్లా ఉంటాయి?
జ: తన జన్మభూమి కోసం, తన తోటి ప్రజలకోసం తన సుఖాన్నీ, భార్యాబిడ్డలనూ త్యాగం చేసినవాడు, నిజమైన త్యాగి. మనదేశంలో ఎందరో త్యాగపురుషులు తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలి, తాము చదివే చదువులు మాని, దేశం కోసం  బ్రిటిష్ వారిని ఎదిరించి  జైళ్ళలో ఉన్నారు. కొందరు ప్రాణాలు వదిలారు. కొందరు దేశంకోసం సంసారాన్నీ, తాము సంపాదించే ధనాన్నీ, వృత్తులనూ విడిచిపెట్టారు. 
   గాంధీ, నెహ్రూ, పటేలు అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తులు, నిజమైన త్యాగులు. పురాణకథల్లో చూస్తే శిబిచక్రవర్తి, రంతిదేవుడు, బలి వంటి వారు నిజమైన త్యాగులు. దేశం కోసం, పరోపకారం కోసం, తమ ధన, మాన, ప్రాణ, రాజ్య, సుఖాలను విడిచిపెట్టడమే, త్యాగుల లక్షణం.


ఇ) మిత్రుడు పుస్తకం వలె మంచి దారిని చూపుతాడని ఎట్లా చెప్పగలవు ?
జ: నీతిగ్రంథాలు మనిషికి మంచిదారిని చూపిస్తాయి. భర్తృహరి సుభాషితాలు, నీతి శతకాలు, మనిషి కర్తవ్యములనూ, చేయరాని పనులను బోధిస్తాయి. రామాయణం వంటి పుస్తకం చదివితే, రాముని వలె నడవాలి. రావణునిలా ఉండరాదనే విషయం తెలుస్తుంది. అలాగే మంచి మిత్రుడు సహితమూ, తన మిత్రులకు ఆపదలు ఎదురయినపుడు, వారికి ఎలా ముందుకు వెళ్ళాలో దారి తెలియనప్పుడు, కర్తవ్యమునూ, ఆకర్తవ్యమునూ బోధిస్తాడు. మంచి మిత్రుడు తన స్నేహితుని వెంట ఉండి, మంచి పుస్తకంలా మంచి చెడ్డలు బోధిస్తాడు. అందుకే మిత్రుడు మంచిపుస్తకం వంటివాడు. 
ఈ) పాఠంలో పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత అవసరమని తెలుసుకున్నారు కదా! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు ?
జ: పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత వలె చదువుకు మంచి గురువు, పుస్తకాలు, శ్రద్ధ, మంచి పట్టుదల అవసరం అవుతాయి. చదువు బాగా రావాలంటే మంచి విద్యావేత్త గురువుగా దొరకాలి. ఆ గురువు శిష్యుడికి చక్కని జ్ఞానబోధ చెయ్యాలి. శిష్యుడు శ్రద్ధ, పట్టుదల కలిగి, క్రమశిక్షణతో చదువుకోవాలి. చెప్పిన విషయాన్ని కంఠస్థo చెయ్యాలి. గురువు బోధించిన విషయాలను పునశ్చరణ చేసుకోవాలి. చదివేవాడికి ఏకాగ్రత ముఖ్యం. నిరంతరపఠనం అవసరం. ఇలా చేస్తే చదువుకున్న చదువు రాణిస్తుంది. 
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషిస్తూ]రాయండి.
జ: శతక పద్యాలలో నీతిపద్యాలూ, భక్తి ప్రభోదక పద్యాలూ ఉంటాయి. మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే నీతులు ఉంటాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి వేణుగోపాల శతకంలో చెప్పాడు. ఆ పద్యాలను చదివితే, రాక్షస లక్షణాలను విడిచిపెట్టి మంచిగా నడుచుకోవచ్చు.
మిత్రుడి మంచి లక్షణాలను శతకపద్యాల ద్వారా తెలుసుకొని, మంచి మిత్రులను సంపాదించుకొని, జీవితంలో సుఖపడవచ్చు.
విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన మంచి విషయాలను గ్రహించి, దేశభక్తిని పెంచుకోవచ్చు. తాము కూడా త్యాగబుద్ధితో, ప్రజల దైన్యస్థితిని తొలగించవచ్చు.
నరసింహ శతకపద్యాలు చదివి, మంచి లక్షణాలు అలవరచుకోవచ్చు. దేవమాన్యాలు అపహరించకుండా, మంచివారిని మోసం చేయకుండా ఉండవచ్చు.
భగవంతుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించి దైవభక్తితో జీవించవచ్చు.
రాజాశ్రయం అన్న ధూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకులవెంట తిరగడం మాని, హాయిగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు.
పండితునికి డబ్బుకంటే సత్యభాషణము, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు.
గోపన్న చెప్పినట్లు శ్రీరాముని సాటిదైవం లేడని తెలుసుకోవచ్చు. 
 
IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :
అ) పాఠం ఆధారంగా మనం అలవరచుకోవలసిన మంచిగుణాలు, ఉండకూడని గుణాలు వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
ఆ) నీతి పద్యాల ఆవశ్యకతను తెలుపుతూ వ్యాసం రాయండి.
V) గైహికం (ఇంటిపని)
అ) పుటసంఖ్య 73లోని పద్యాన్ని చదివి భావం సొంతమాటల్లో రాయండి.
ఆ) చుక్కపద్యాలు కంఠస్థo చేయండి. 
VI) పదజాలం :
1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
 అ) భాసిల్లు : మన తెలంగాణ రాష్ట్రo, సకల సంపదలతో భాసిల్లుతోంది.
 ఆ) ఉద్బోదించు: గాంధీజీ కులమత భేదాలనూ, అవినీతినీ రూపుమాపాలని, ప్రజలకు ఉద్బోధించారు.
 ఇ) దైన్య స్థితి : ప్రజల దైన్యస్థితిని తొలగించడానికి, యత్నిoచేవారే సరియైన ప్రజాప్రతినిధులు.
 ఈ) నరరూప రాక్షసుడు : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాలకుడు నరరూప రాక్షసుడితో సమానం.
2. పర్యాయ పదాలు గుర్తించి రాయండి.
 అ)  ఏనుగు  :   గజము,     కరి,       నాగము
 ఆ) స్నేహితులు :  మిత్రులు,   నెచ్చెలులు
 ఇ) కృపాణం :   కత్తి,     అసి
 ఈ) బంగారం :  కనకం,     స్వర్ణం
3. ప్రకృతి  - వికృతులు
 అ) దిశ   -  దెస                  ఆ) సముద్రం   -  సంద్రం                   ఇ) రాజు  -  రేడు 

VII)వ్యాకరణాoశాలు :
1. కిoది పదాలు విడదీసి, సంధిపేరు రాయండి.
 అ) బుద్ధిమంతురాలు               బుద్ధిమంత  +  ఆలు          =   రుగాగమసంధి
 ఆ) అచ్చోట                           ఆ            +  చోట           =   త్రికసంధి
 ఇ) దివ్యౌషధం                        దివ్య         +  ఔషధం       =   వృద్ధిసంధి
 ఈ) సాహాసవంతురాలు            సాహాసవంత  +  ఆలు          =  రుగాగమసంధి
 ఉ) సమైక్యత                        సమ           +  ఐక్యత        =  వృద్ధిసంధి
 ఊ) ఎక్కాలము                      ఏ             +  కాలము      =   త్రికసంధి
2. కింది పద్యపాదానికి గణవిభజన చేసి గురులఘువులను గుర్తించి ఏ పద్యపాదమో తెలుపండి.
అ) భండనభీముఁ  డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
     భ              ర          న            భ              భ             ర           వ
U   I I       U   I U          I I I      U    I    I       U    I    I     U   I   U       I   U              
భండన     భీముఁడా    ర్తజన     బాంధవుఁ     డుజ్జ్వల    బాణతూ    ణకో
 ‘భ, ర, న, భ, భ, ర, వ’ గణాలున్నాయి కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.
VIII) ప్రశ్నల నిధి :
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి ?
ఆ) నిజమైన త్యాగి ఎవరు ? అతని లక్షణాలెట్లా ఉంటాయి?
ఇ) మిత్రుడు పుస్తకం వలె మంచి దారిని చూపుతాడని ఎట్లా చెప్పగలవు ?
ఈ) పాఠంలో పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత అవసరమని తెలుసుకున్నారు కదా! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు ?
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషిస్తూ రాయండి.
IX) నికష :
1. కింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.               5 మా
 అ) పాఠం ఆధారంగా మనం అలవరచుకోవలసిన మంచిగుణాలు, ఉండకూడని గుణాలు వివరిస్తూ మిత్రునికి లేఖ   రాయండి.
2.  కింది పద్యానికి ప్రతిపదార్థం రాయండి.                           5 మా
    పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోధిoచు మిత్రుండు, సం 
   విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా 
   యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
   చ్చితంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా ! 







8.లక్ష్య సిద్ధి
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 
తెలంగాణ తొలిదశ – మలిదశ ఉద్యమాల గురించి చెప్పగలగాలి. రాయగలగాలి.
సంపాదకీయ వ్యాసం గురించి సొంత మాటల్లో రాయగలగాలి.                                
 పత్రికల్లో సంపాదకీయాలు ఎందుకు రాస్తారో చెప్పగలగాలి.
అతిశయోక్తి, స్వభావోక్తి అలంకారాలను గుర్తించగలగాలి.          
II) ముఖ్య పదాలు - అర్థాలు
 సజీవంగా                   =     ప్రాణ సహితంగా 
 శకం                         =     రాజ్యకాలం 
 క్షణం                        =     సమయం 
 తారలు                      =     నక్షత్రాలు 
 బాష్పాలు                   =     కన్నీళ్ళు 
 ముసురుకొని              =      కమ్ముకొని 
 నినాదాలు                  =     ధ్వనులు
 స్వీయరాష్ట్రం               =     సొంతరాష్ట్రం
 తత్త్వo                      =     స్వభావం
 వివక్ష                      =      భేదం 



III)  చర్చనీయ అంశాలు 
1. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో స్పందన .......
‘తెలంగాణ రాష్ట్ర సిద్ధి’ కల సాకారమవుతుందన్న ఆశ ఇక్కడి వాళ్లందరి మనస్సులో బలంగా వెలుగుతున్నా, సుడిగాలి లాంటి ఆంధ్రనాయకుల విజృoభణ ఏ క్షణాన ఎలాంటి పరిణామాలు కొని తెస్తుందోనన్న అనుమానం కుదిపేస్తుంది. గతంలో చాలా సార్లు నోటిదాకా వచ్చిన ముద్ద జారిపడ్డ గత అనుభవాలే ఈ అనుమానానికి కారణం. కాని, అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించింది. బీజేపి కూడా తన మాటను నిలబెట్టుకుంది. రెండు నాల్కల ధోరణి అనుసరించిన వాళ్లు కుదేలైపోయారు. మసిపూసి మారేడుకాయ చేసి మంచిపేరు తెచ్చుకోవాలని ఆరాటపడ్డవాళ్ల ఆటలు సాగలేదు. ఆంధ్రానాయకుల నిరసనలు తెలంగాణ ప్రాంతానికి చెందిన తీపికబురును అడ్డుకోలేక పోయాయి. తెలంగాణ ప్రకటన విషయాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. ఎట్టకేలకు షాక్ నుంచి తేరుకొని అర్థరాత్రి వేళ ఆకాశాన్నంటే సంబురాలను ఆనందంగా జరుపుకున్నారు. ఎక్కడి వాళ్ళక్కడ తీన్మార్ దరువులతో, డాన్సులతో, బతుకమ్మ ఆటలతో, ఉద్యమం పాటలతో 
ఆకాశమే హద్దుగా ఆనంద నృత్యాలు చేశారు. ఉద్యమ స్మృతులను నెమరువేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మాటిమాటికి అమరవీరులకు జోహార్లు అర్పించారు. బాణాసంచా వెలుగులతో అర్థరాత్రిని పట్టపగలుగా మార్చారు. ఒక కొత్తశకం ప్రారంభమైన వైనాన్ని పత్రికలన్నీ ముక్తకంఠoతో అభినందిచాయి. మేమంతా వీధుల్లోకి వెళ్లి మిఠాయిలు తినిపించుకున్నాo. డాన్సులు చేసి అబినందించుకున్నాo.     
2. తెలంగాణ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చిన పోరాట ఘట్టాలు : 
 తెలంగాణ ఏర్పాటు కోసం సాగిన రెండు దశల ఉద్యమంలో తొలిదశ ఉద్యమానికి సంబంధించి ఈ తరం వారికి ప్రత్యక్ష నిదర్శనాలు అంతగా అందుబాటులో లేవు. కాని మలిదశ ఉద్యమంలో మాత్రం ఎన్నో సంఘటనలు ప్రజలను కలచివేశాయి. కన్నీరు వరదలై పారిన సంఘటనలు, హృదయం చెమ్మగిల్లేలా చేశాయి. 2001 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా సాగింది. 2010 – 11లో కొంచెం నెమ్మదించినట్టు ఉన్నా, 2012లో పడిలేచిన కెరటమై విజృoభించింది. స్త్రీలు, బాలురు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, రోజుకూలీలు, ఆటోకార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, కులసంఘాలు..... పల్లెలు, పట్నాలు, నగరాలు, వీధులు, వాడలు  అన్నీ కలిపి ఉప్పెనై సీమాంధ్ర నాయకులను ముంచెత్తాయి. ఆ సందర్భంగా మనసులను చెమ్మగిల్లేలా చేసిన వాటిలో కొన్ని........
అ) శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకోవడం.
ఆ) కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం.
ఇ) పార్లమెంట్ భవన్ సమీపంలో యాదిరెడ్డి ఆత్మార్పణ గావించడం.

ఈ) ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై విచక్షణా రహితంగా బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీలతో విపరీతంగా కొట్టడం.
ఉ) సీమాంధ్రుల సమైక్యవాద సభ ఎల్.బి స్టేడియంలో జరుగుతున్నప్పుడు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పోలీస్ ‘జై తెలంగాణ’ నినాదం చేసి అధికారులచే శిక్ష ఎదుర్కోవడం..... ఇలా ఎన్నెన్నో ఆర్ద్రమైన జ్ఞాపకాలు ఇప్పటికీ, ఇంకా పచ్చిగానే ఉన్నాయి.
 3.  ‘జై తెలంగాణ’ నినాదం బలపడటానికి దారితీసిన పరిస్థితులు, పర్యవసానాలు.......
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటాన్ని మొదటి నుంచి ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రధాని ‘జవహర్ లాల్ నెహ్రూ’ ఇది తాత్కాలిత బంధమే. అన్న ఆపద్దర్మ సూత్రంతో రెండు ప్రాంతాలను ముడివేశాడు. ఆనాటి నుంచి 2014 జూన్ 2 వరకు ఆ బలహీనమైన బంధం తుమ్మితే ఊడిపడే ముక్కులాగే సాగింది. అయితే ముల్కీ నిబంధనల ప్రకారం ఇక్కడి స్థానిక ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే, పరిస్థితులు ఇంత దారుణంగా మారేవి కాదు. క్రమక్రమంగా తెలంగాణేతర ప్రాంతీయుల ఆధిపత్యం బలపడటం, పాలకవర్గంలో వాళ్ల బలం అధికం కావడంతో తమకు అన్యాయం జరుగుతుందన్న స్పృహ కలిగింది తెలంగాణ ప్రజల్లో. అది అంతకంతకూ తీవ్రమై 1969లో ఉధృతరూపం దాల్చింది. ‘జై తెలంగాణ’ నినాదం ఊపిరి పోసుకుంది. ఒక్కసారి ప్రజల నాలుకల మీదికి వచ్చిన ఈ నినాదం ఇప్పటికీ అలసట లేకుండా నర్తిస్తోంది. ఒకప్పుడు ఆర్తితో, ఇప్పుడు ఆనందంతో.
వలస పాలకుల వివక్షపూరిత నిర్ణయాలు, పెత్తనాలు, అవమానాలు, అమర్యాదలు, పక్షపాత ధోరణులు, ఒంటెద్దు పోకడలు, అణచివేత విధానాలు  ‘జై తెలంగాణ’ నినాదం మరింతగా బలపడేటట్లు చేశాయి.  
4. గన్ పార్క్ అమరవీరుల స్తూపoతో ముడిపడిన సంఘటనలు......
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీర పోరాటయోధుల స్మృతి చిహ్నంగా 1969లో గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన స్తూపమే అమరవీరుల స్తూపం. దీని రూపశిల్పి ఎక్కా యాదగిరి. గత అర్థశతాబ్దంగా ఈ స్తూపం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తిని రగుల్కొల్పుతూనే ఉంది. తెలంగాణలోని చాలా ఉద్యమాలు ఇక్కడే ప్రారంభం కావడం ఆనవాయితీగా మారింది.
తొలిదశ ఉద్యమంలో 258 మంది బలిదానానికి గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల రాళ్లను స్తూప నిర్మాణానికి ఉపయోగించడం భిన్నమైన విషాదాలకు సంకేతం. అశోకచక్రం గుర్తు రాజ్యాంగ హక్కులకు ప్రతీక. మెడలాంటి  నిలువు చారలు తుపాకి తూటాలను గుర్తు చేస్తాయి. శిఖర భాగంలోని తెల్లని పువ్వు స్వేచ్ఛకు సంకేతం. తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు అనేక కార్యక్రమాలకు ఈ స్తూపం వేదికగా నిలిచింది. నిరాహారదీక్షలు, ప్రతిజ్ఞలు, మానవహారాలు, తీర్మానాలు, సభలు – ర్యాలీల ఆరంభాలకు ఇదే వేదిక. లాఠీలకు తూటాలకు కూడా ఇదే మౌనసాక్షి.  
5. తెలంగాణ పునర్నిర్మాణoలో చేపట్టవలసిన తక్షణ చర్యలు......
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో చేపట్టవలసిన అంశాలను గురించి నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు ఆశించినవి.
అ) తెలంగాణ భాష, సంస్కృతులకు ప్రాణం పోయాలె.
ఆ) తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్దరించుకోవాలె.
ఇ) ప్రజలకు కడుపు నిండాతిండి, కలతలేని నిద్రా, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలె.
ఈ) సంక్షేప పథకాలు చేపట్టాలె.
ఉ) నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాలు చక్కదిద్దాలె.
ఊ) పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలె.
IV) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జ: అది తెలంగాణ పోరాటం గమ్యాన్ని అందుకున్న శుభక్షణం. తెలంగాణ జాతి చరిత్రలో అది అరుదైన క్షణం. అద్భుతమైన క్షణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మూడు తరాల పిల్లల కన్నుల నుండి భావోద్వేగంతో ఆనందబాష్పాలు కారాయి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని, తెలంగాణ ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.అందుకే రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.
ఆ) సంపాదకీయాల్లోని భాష, శైలి ఎట్లా ఉంటుంది ?
జ:    సంపాదకీయాల్లో సృజనాత్మక శైలి వాడుతారు. సంపాదకీయం రచన, సరళంగా, సూటిగా, నిష్కర్షగా, సాధికారంగా, సులభగ్రాహ్యంగా ఉండాలి. సంక్లిష్టమైన అంశాలనూ, జనభవితవ్యాన్ని, వర్తమానాన్ని ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించి పాఠకునికి అందివ్వాలి. సంపాదకీయాల్లో ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు అవసరం. పత్రికా హృదయమే సంపాదకీయం. సృజనాత్మక శైలి ఎక్కువగా సంపాదకీయల్లోనూ, ప్రత్యేకవ్యాసాల్లోనూ కనిపిస్తుంది.
ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ? 
జ: పత్రికలో అతి ముఖ్యమైన రచన, సంపాదకీయం అని కొందరు చెప్పారు. పత్రికా హృదయమే సంపాదకీయమని కొందరు చెప్పారు.ప్రజల అభిప్రాయాలు వారికే వ్యాఖ్యానించి చూపి, మార్గనిర్దేశనం చేసేందుకు, సమస్యలపై స్పందించేలా నిర్మాణాత్మకంగా ఆలోచింపజేసేoదుకు, సంపాదకీయం రాస్తారు. తక్షణ సమస్యలపై, తాజా వార్తలపై, సంఘటనలపై చేసే పరిశోధన, ఆలోచనల వ్యాఖ్యానమే సంపాదకీయం. సంపాదకీయంలో ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు ఉంటాయి. సంపాదకీయాలు, సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. తక్కువ మాటల్లో, పాఠకులను ఆలోచింపచేసేటట్లు, ఆకట్టుకునేటట్లు, సంపాదకీయాలు రాస్తారు.
ఈ) పత్రికల్లోని సంపాదకీయలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
 జ: పత్రికల్లో సంపాదకీయలకు సృజనాత్మక శైలి వాడాలి. వార్తా రచనలో కల్పనలకూ,  అతిశయోక్తులకూ చోట్టివ్వరాదు. ప్రజలపట్ల, ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్ల బాధ్యత కల్గి వార్తారచన చేయాలి. సంపాదకీయ రచన, సరళంగా, సూటిగా, నిష్కర్షగా, సాధికారంగా, సులభగ్రాహ్యంగా ఉండాలి. వార్త వ్యాసాలలాగే సంపదకీయాల్లో కూడా, ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు అవసరం. వార్తలను సక్షేపించి రాయాలి. పత్రికల్లో వార్తా రచనలో భాష చాలా సరళంగా ఉండాలి. చిన్న చిన్న వాక్యాలలో రచన సాగాలి. చిన్న పదాలలో చెప్పదగిన భావాన్ని, చిన్న మాటలోనే సూచించాలి. పెద్ద మాటలను అనవసరంగా ఉపయోగించకూడదు.


2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
 అ) “ ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను, దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు”. దీనిపట్ల మీ అభిప్రాయాలను సోదాహరణంగా వివరించండి.
 జ: సంపాదకీయం చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణినీ, దృక్పథాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట యథార్థము. మన రాష్ట్రంలో వెలువడే “నమస్తే తెలంగాణా” పత్రిక, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారు చేసిన ప్రతి పనిని సమర్థిస్తుంది.“నమస్తే తెలంగాణా” పత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తుంది. అదే ఈనాడు పత్రిక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీకీ అనుకూలంగా రాస్తుంది. ఈనాడు పత్రిక సంపాదకీయాలు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి. నమస్తే తెలంగాణా పత్రిక, కే.సీ.ఆర్ పార్టీ పెట్టిన పత్రిక. అందుకే దాని సంపాదకీయంలో కే.సీ.ఆర్ ముఖ్యమంత్రిగా  చేసిన తొలి ప్రసంగాన్ని ఆ పత్రిక మెచ్చుకుంటూ రాసింది. కే.సీ.ఆర్ సంక్షేమ రాజ్యానికి అనుగుణమైన హామీలు ఇచ్చాడని ఆయనను పొగిడింది. కే.సీ.ఆర్ రుణాలమాఫీ చేస్తానన్నాడనీ, పేదలకు రెండు పడక గదుల ఇల్లు కట్టిస్తానన్నాడనీ మెచ్చుకుంది.  
V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :
1. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఏదైనా ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాదకీయ    వ్యాసం రాయండి.
2. దిన పత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
VI) గైహికము (ఇంటిపని)
1.  పుటసంఖ్య 82లోని పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
2. ప్రశ్నజవాబులు చదువండి. రాయండి.
VII) పదజాలo :
1. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
 అ) ముసురుకొను       -   మామిడి పండుపై ఈగలు ముసురుతున్నాయి. 
 ఆ) ప్రాణంపోయు         -   ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కే.సీ.ఆర్. ప్రాణం పోశారు.
 ఇ) గొంతు వినిపించు   -   పాటపాడి  గొంతు వినిపించుమని ప్రేక్షకులు అంతా అడిగారు.  
ఈ) యజ్ఞం               -          వర్షాలు కావాలని, ప్రజలు వరుణ యజ్ఞం తలపెట్టారు.   
2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
  అ) జ్ఞాపకం           =   జ్ఞప్తి ,     స్మృతి
  వాక్యప్రయోగం :  కాళిదాసు శ్లోకాలు, నాకు స్మృతి  పథంలో లేవు. 
  ఆ) పోరాటం          =   యుద్ధం,  సమరం
  వాక్యప్రయోగం :   అన్నదమ్ముల మధ్య సమరం మంచిది కాదు.
  ఇ) విషాదం          =   ఖేదం,     దుఖం  
  వాక్యప్రయోగం :  మనిషికి అత్యాశ ఉంటే దుఃఖం తప్పదు.
  సంస్కరణ            =  సంస్కారం,   సంస్క్రియ 
  వాక్యప్రయోగం :  దేశాభివృద్ధికి ఉత్తమ సంస్కారాలు అమలు చేయాలి.
VIII) వ్యాకరణాంశాలు :
1. కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
 అ) రాజకీయ పార్టీలవారు “జనానికి తక్షణo కావాల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.                                                                                (ప్రత్యక్ష కథన వాక్యo)
 జ: ) రాజకీయ పార్టీలవారు జనానికి కావాల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర అని, ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.                                                                                                      (పరోక్ష కథన వాక్యం)
 ఆ)“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నారు.(ప్రత్యక్ష కథన వాక్యo)        
                                                                                   
జ:  సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.    (పరోక్ష కథన వాక్యం)
2. కింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనoలోకి మార్చండి.
అ) పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు. (పరోక్ష కథన వాక్యం)
జ: “పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరo” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. (ప్రత్యక్ష కథన వాక్యo)        
ఆ) సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.   (పరోక్ష కథన వాక్యం)
జ:“సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని  మేధావులు నిర్ణయించారు.(ప్రత్యక్ష కథన వాక్యo)   
ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టీ.వీ ఛానల్లో ప్రసారం చేశారు.  (పరోక్ష కథన వాక్యం)
జ: “తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి” అని టీ.వీ ఛానల్లో ప్రసారం చేశారు. (ప్రత్యక్ష కథన వాక్యo)  
3. కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి. 
 అ) ప్రపంచమంతా :
 జ: ప్రపంచము  +  అంతా                  - ఉత్వసంధి 
 సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా వస్తుంది.
 ఆ) అత్యద్భుతం : 
 జ: అతి + అద్భుతం                             -  యణాదేశసంధి
 సూత్రం : ఇ, ఉ, ఋ, లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే య, వ, ర, లు ఆదేశంగా వస్తాయి.
 ఇ) సచివాలయం 
 జ:  సచివ + ఆలయం
  సూత్రం  : అ, ఇ, ఉ, ఋ, లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశoగా వస్తుంది.
 4. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
  అ) బృహత్కార్యం  :
    జ: బృహత్తు అయిన కార్యం                - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం 
 
   ఆ) శక్తియుక్తులు  :
  శక్తియును, యుక్తియును                       -  ద్వంద్వ సమాసం  
  ఇ) సంక్షేమపథకాలు    :
   జ:  సంక్షేమం కొఱకు పథకాలు                 - చతుర్థీ తత్పురుష  సమాసం  
IX) ప్రశ్నలనిధి
  అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
   ఆ) సంపాదకీయాల్లోని భాష, శైలి ఎట్లా ఉంటుంది ?
   ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ? 
   ఈ) పత్రికల్లోని సంపాదకీయలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
  అ) “ ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను, దృక్పథాన్ని అర్థం   
          చేసుకోవచ్చు”. దీనిపట్ల మీ అభిప్రాయాలను సోదాహరణంగా వివరించండి.
X) నికష : 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.                                           4మా
     అ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ? 
     ఆ) పత్రికల్లోని సంపాదకీయలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
2. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.                                               2మా
      అ) గొంతు వినిపించు                                ఆ) యజ్ఞం
 3. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.                                                             2మా
    అ) విషాదం                                           ఆ) జ్ఞాపకం 
4. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.                                   2మా
   అ) సంక్షేమపథకాలు                                 ఆ) బృహత్కార్యం


9. జీవన భాష్యం 
                                     - సి. నారాయణ రెడ్డి
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు :
ఇతరులకోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని తెలుసుకోవడం   
సినారె గజల్ ప్రక్రియను తెలుసుకోవడం    
అపరిచిత గేయపాదాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయగలగడం   
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగలగడం,    
II) ముఖ్య పదాలు  -  అర్థాలు :
జీవనం    = బతుకు 
భాష్యం    =  నిర్వచనం
గిరి        =  పర్వతం
నామధేయము = పేరు 
నేస్తం      = మిత్రుడు, స్నేహితుడు
మృగము = జంతువు
శిరస్సు    =  తల
జంకని     = భయపడని
దారి        = తొవ్వ, మార్గం
వంకలు   = ఏరులు



III) చర్చనీయాంశాలు
1. మనసుకు మబ్బు ముసరడం :
  మబ్బు ముసరడం అంటే మబ్బులు కమ్ముకోవడం అని అర్థం. మనసుకు మబ్బు ముసరడం అంటే మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం అని అర్థం. సమస్యలతో సతమతమయ్యే మనసు స్వచ్ఛంగా, స్పష్టంగా, కనిపించదు, వ్యవహరించదు. చింతలు, వెతలు అస్పష్టభావాలతో నిండి ఉన్న మనసు దుఃఖానికి కేంద్రంగా మారుతుంది. మబ్బు చినుకుల్ని కురిపించినట్లే మనసు దుఃఖాన్ని వర్షింపజేస్తుంది.
2. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
   కొత్తదారిలో వెళ్ళాలంటే, కొత్త మార్గం కనుక్కోవాలంటే, కొత్తగా బాటను వేయాలంటే ఏ అనుమానం, అధైర్యం లేక అడుగు ముందుకు వేయాలి. అలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఒక కొత్తమార్గంలో నడిచి విజయం సాధించినవారే పదిమందికి ఆదర్శం అవుతారు. వాళ్లు నడిచిన మార్గంలో మరికొంత మందినడిస్తేనే అది దారిగా మారుతుంది. జీవితంలోనూ ఒక ప్రయోజనాన్ని ఆశించి, కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు భయపడకుండా ముందడుగు వేసి, ఆదర్శంగా నిలవాలని కవి భావం.
3. మనిషి  - మృగం
    మనిషి  - మృగం ఎన్నటికి ఒకటి కాదు. మనిషి మనిషే, మృగం మృగమే. ఆకారoలో, స్వరూపంలో, స్వభావంలో స్పష్టమైన తేడాలున్నాయి. మృగానికి వావివరుసలు, తన పర భేదాలుండవు. దాని కడుపునిండడం, సుఖంగా ఉండడమే పరమార్థంగా బతుకుతుంది. తనకు అడ్డంకిగా ఉన్న వాళ్లను నిర్దాక్షిణ్యంగా, పశుబలంతో పక్కకు తోస్తుంది.
ఈ లక్షణాలేవీ మనిషిలో ఉండవు. అన్నిటికీ మించి మనిషి మేధోసంపన్నుడు. ఆలోచించి ఏదిమంచో, ఏది చెడో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసి, తెలివిగా జీవిస్తాడు. తెలివి అంటే విచక్షణ (మోసం కాదు). 
4. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. 
   మనిషి పేరు సంపాదించడం అంటే గొప్పపేరు పొందటం అని అర్థం. గొప్పపేరు మామూలు ప్రయత్నం వల్ల లభించదు. అందుకు ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగం ఎంతో విలువైనది కావాలి. అప్పుడు పేరు చిరస్థాయిగా మిగిలి పోతుంది. 
IV) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి పనులు చేయాలి ?
దానధర్మాలు చేయాలి.
దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
పేదవారికి పెళ్ళిళ్ళు చేయించాలి.
విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి.
బలహీన వర్గాలవారికి చేయూతనివ్వాలి.
వెనుకబడిన తరగతుల వారికి అండగా నిలవాలి.
బావులు, చెరువులు తవ్వించాలి.



ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ? 
జ: ఎడారి దిబ్బలు అంటే ఎడారిలో ఉండే ఇసుక గుట్టలు. అక్కడ అంతా ఇసుక ఉంటుంది. ఇసుక నేలలు పంటలకు మంచివి కావు. అదీగాక ఎడారుల్లో నీరు దొరుకదు. కాబట్టి ఎడారి ఇసుక దిబ్బలను దున్నినా ప్రయోజనం ఉండదని సామాన్య జనం అనుకుంటారు. ఇసుక దిబ్బలు దున్నితే ఫలం ఉండదనుకోవద్దని, కవి సందేశం ఇచ్చాడు. 
   ఇది విద్యార్థులకు సరిపోయే వాక్యం. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఎంత చదివినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వారు మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు పొందలేరు. కాని ఆ విధంగా వారు నిరాశ చెందవద్దనీ ప్రయత్నిస్తే, అటువంటి తెలివితక్కువ విద్యార్థులు కూడా రాణిస్తారనీ, ప్రయత్నం గట్టిగా సాగాలనీ, ఆశావహదృష్టితో ముందుకు పోవాలనీ విద్యార్థులకు సినారె సందేశం ఇచ్చాడు.
ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని సినారె ఎందుకు అని ఉంటారు ?
జ: ‘మనిషి’ భగవంతుని సృష్టిలో ఒకే రకం జీవి. అయినా నేడు సంఘంలో మనుషులు కులమత భేదాలతో, వర్ణవైషమ్యాయాలతో విడిపోతున్నారు. అందువల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మత వైషమ్యాల వల్ల దేశాలూ, రాష్ట్రాలూ నాశనం అవుతున్నాయి. ప్రాంతీయ భేదాల వల్ల కలతలూ, కార్పణ్యాలూ పెరిగిపోతున్నాయి. అలాగాక గ్రామంలోని పదుగురూ అంటే పదిమందీ కలిసి ఉంటే, అది చక్కని గ్రామం అవుతుంది. గ్రామంలోని ప్రజలంతా కలిసి ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. గ్రామంలో ఉన్నవారంతా కులమత భేదాలు లేకుండా కలిసి, గ్రామాభివృద్ధికి కృషిచేస్తే అది చక్కని ‘ఊరు’ అవుతుంది. ఆదర్శగ్రామం అవుతుందని భావం. ఆ గ్రామానికి కావలసిన సదుపాయాలు అన్నీ సమకూరుతాయి.ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావలసిన ధన సహాయం చేస్తుంది. గ్రామ ప్రజల్లో సహకారం, ఐకమత్యం అవసరం అని చెప్పడానికే ‘సినారె’ ఈ వాక్యాన్ని రాశారు. 

2. కింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాలల్లో జవాబు రాయండి.  
 అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలుపండి. వాటిని గురించి రాయండి.
జ: నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు ఇవి: 1) గేయ కవిత     2) వ్యాసం     3) ప్రబంధం     4) గీతం
 1) గేయ కవిత : లయకు ప్రాధాన్యం ఇస్తూ, మాత్రాఛoదస్సులో సాగే రచన “గేయ కవిత”. ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో పల్లవి, చరణాలు అనే విభాగాలు ఉంటాయి.
2) వ్యాసం : ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకొనేలా వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభగ్రాహ్యంగా ఉండటం దీని ప్రత్యేకత.     
3) ప్రబంధం : వర్ణనా ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని (16 వ శతాబ్దం) తెలుగు సాహిత్య చరిత్రలో “ప్రబంధ యుగం” అoటారు. పురాణ, ఇతిహాసాల నుండి చిన్నకథను తీసుకొని, వర్ణనలు కలిపి, పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ‘ప్రబంధo’ అంటారు. వీటిలో అష్టాదశ(18) రకాల వర్ణనలు ఉంటాయి.
4) గీతం :  లయకు ప్రాధాన్యం ఇస్తూ, మాత్రాఛoదస్సులో సాగే రచన గీతం. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలోని ఖండికలన్నీ గీతాలుగా పేర్కొన్నారు.  
(లేదా)
ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
జ: మంచి పంటలు పండాలంటే రైతులు వేసవిలో పొలాలను చక్కగా దున్నాలి. నీరు రాగానే సేంద్రియ ఎరువులను పొలంలో వేయాలి. పొలంలో ఎత్తుపల్లాలు లేకుండా సమంగా నీరు ప్రవహించేలా చూడాలి. రసాయనిక ఎరువులు నేల స్వభావానికి తగువిధంగా చల్లాలి. వరి చేనులో కలుపుతీసి ఎరువులు వేయాలి. క్రిమిసంహారక మందులు తగు మోతాదులో పిచికారీ చేయాలి. వరిచేను ఈనగానే పుష్కలంగా నీరుపెట్టి మూడవ మోతాదు రసాయనిక ఎరువు చల్లాలి. ఎలుకలు లేకుండా బుట్టలు పెట్టాలి. ధాన్యం పండిన తరువాత చేను కోయాలి.   


V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు:
అ) జీవనభాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను రాయండి.
ఆ) ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి.
VI) గైహికము (ఇంటిపని):
అ) పుటసంఖ్య 91లోని అపరిచిత గేయపాదాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ) ప్రశ్నజవాబులు చదువండి. రాయండి.
VII) పదజాలం 
1. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
  అ) మబ్బు :   మేఘము,       మెయిలు,       అంబుదము,        ఘనము
  ఆ) గుండె  :  హృదయం,          హృత్తు,          డెందము
  ఇ) శిరసు :   తల,        శీర్షము,       మస్తకము,       మూర్ధము
2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
  అ) ముసరడం :  ఆహారపదార్థాలపై ఈగలు ముసరడం వల్ల రోగాలు వస్తాయి.
  ఆ) జంకని అడుగులు : దేశ సైనికుల జంకని అడుగులే మనదేశానికి శ్రీరామరక్ష.
  ఇ) ఎడారి దిబ్బలు : ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకుంటూ వేగంగా నడుస్తాయి.     
  ఈ) చెరగని త్యాగం : బలిచక్రవర్తి చేసిన చెరగని త్యాగం చాలా గొప్పది.   
VIII) వ్యాకరణాంశాలు :
1. కింది పదాలు కలిపి, సంధిని గుర్తించి రాయండి.
  అ) నీరవుతుంది               = నీరు + అవుతుంది      -   ఉత్వ సంధి
  ఆ) ఎత్తులకెదిగిన              = ఎత్తులకు + ఎదిగిన     -   ఉత్వ సంధి         
  ఇ) పేరవుతుంది               = పేరు  + అవుతుంది     -   ఉత్వ సంధి
2. కింది పదాలలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.
  అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
  జ: ఎడారి దిబ్బలు                 -  ఎడారిలో దిబ్బలు                     షష్ఠి తత్పురుష సమాసం 
  ఆ) ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
  జ: ఇసుక గుండెలు               -  ఇసుక యొక్క గుండెలు             - షష్ఠి తత్పురుష సమాసం 
3. కింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.
  అ) నీకు వంద వందనాలు
  జ: పై వాక్యoలో “ఛేకానుప్రాసాలంకారం” ఉంది.
  ఆ) తెలుగు జాతికి అభ్యుదయo
       నవ భారతికే నవోదయం 
       భావిపౌరులం మనం మనం 
       భారత జనులకు జయం జయం 
  జ:  అంత్యానుప్రాసాలంకారం
  ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
  జ: వృత్త్యనుప్రాసాలంకారం
 ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
   జ: రూపకాలంకారం
IX) ప్రశ్నలనిధి :
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి పనులు చేయాలి ?
ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ? 
ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని సినారె ఎందుకు అని ఉంటారు ?
2. కింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాలల్లో జవాబు రాయండి.  
 అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలుపండి. వాటిని గురించి రాయండి.
ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
X) నికష :
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.                              6 మా
అ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని సినారె ఎందుకు అని ఉంటారు ?
ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ? 
పదజాలం 
1. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.                                                 2మా 
  అ) మబ్బు                                    ఆ) గుండె  

2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.                                2మా
  అ) ఎడారి దిబ్బలు                          ఆ) చెరగని త్యాగం  

10. గోలకొండ పట్టణం
                                              - ఆదిరాజు వీరభద్రరావు
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 
గోలకొండ పట్టణ ప్రాముఖ్యతను తెలుసుకోగలగాలి.   
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలగాలి.   
నాటి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలు సొంతమాటల్లో చెప్పగలగాలి.  
వ్యాకరణాంశాల్లో భాగంగా “బహువ్రీహి సమాసాన్ని” అర్థం చేసుకోగలగడం.
II) ముఖ్య పదాలు – అర్థాలు : 
హోనులు         =   నాల్గు రూపాయల విలువగల నాణెములు 
హవు            =   నీటితొట్టె 
హర్మ్యము       =   మేడ 
కౌశల్యము       =   నేర్పు 
దుర్లభము       =   కష్టం 
కైవారం           =   చుట్టుకొలత
సరదార్లు         =   యోధులు
ఉపాహారము    =   చిరుతిండి, ఫలహారం 
మొహల్లాలు     =   వీధులు
బాగ్              =   తోట 
రాజహర్మ్యములు =  రాజుల మేడలు (రాజభవనాలు)
దుర్గము          =  కోట 

III) చర్చనీయంశాలు
1. ఆజంఖాను :
గోలకొండ పట్టణ నిర్మాణ పథకం రూపకర్త  ఆజంఖాను. ఇతడే గోలకొండ పట్టణం రూపురేఖలు దిద్దాడు. పట్టణాన్ని అనేక విభాగాలు చేసి, ఆ విభాగాలకు మొహల్లాలని పేరు పెట్టాడు. పట్టణంలోని ఒక్కొక్క మొహల్లాలో ఒక ప్రముఖుడు నివసించడమో లేక ఒక్కొక్క మొహల్లా గురించి శ్రద్ధ వహించడమో జరిగేది. అందుకే మొహల్లాలకు ప్రముఖుల పేర్లు నిర్ణయించారు.  ఉదా: మాదన్న మొహల్లా 
2. గోలకొండ పట్టణం ప్రత్యేకతలు :
 భారతదేశంలోని దక్షిణపథంలో పూర్వం ఏకైక పట్టణంగా ప్రసిద్ధి గాంచింది గోలకొండ పట్టణం. గోలకొండ మూడుకోటలుగా ఉంది. మొదటి కోట, రెండో కోటల మధ్య భాగంలో గోలకొండ పట్టణం విస్తరించి ఉన్నది. దుర్గానికి సుమారు ఏడు మైళ్ళ పరిధిలో ఎనభై బురుజులు, ఎనిమిది ద్వారాలు ఉండేవి. సుమారు నాలుగు మైళ్ళ విస్తీర్ణంలో గోలకొండ పట్టణం వెలిసింది. ఇందులో అనేక మొహల్లాలు ఉండేవి. విశాలమైన వీధులుoడేవి. పడమటిదిశలో రాజభవనాలు ఉండేవి. ధనవంతుల గృహాలతో పాటు ఉద్యోగస్తులకు భవనాలుఉండేవి. ఆలయాలు, మసీదులతోపాటు భిక్షగాళ్ళకు(ఫకీర్లకు) గృహాలు ఉండేవి. ఉద్యానవనాలు, స్నానమందిరాలుండేవి. పాఠశాల భవనాలూ ఉండేవి. మిద్దెల మీది తోటలు జలాశయాలు, నీటికాల్వలు, అంతరాళనందనం ఉండేవి. ఈ అంతరాళనందనం బాబిలోనియాలోని నందనాన్ని పోలి ఉండేది. వాయవ్యదిశలో దొడ్డ బాల్బోవావృక్షం ఒకటి ఉండేది. దాని పాదంలోని తొర్రలో ఒక టేబుల్, నాలుగు కుర్చీలు వేసుకొని కుర్చునేవాళ్ళు.
3. గోలకొండ పట్టణం  - రాకపోకల జాగ్రత్తలు :
గోలకొండ పట్టణంలోకి రాకపోకలు చాలా కట్టుదిట్టంగా జరిగేవి.ఎందుకంటే అది రాజధాని. ఎంతో ఖరీదైన వర్తక వ్యాపారాలు జరిగేవి. ముఖ్యమైన రాజపరివారం అంతా అక్కడే నివాసం ఉండేది. విదేశీప్రముఖులు చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. 
రాజు, రాజకుటుంబం, రాజపరివారాన్ని కంటికి రెప్పలా కాపాడటం సైనిక వ్యవస్థ ప్రధాన భాద్యత.
విదేశీయులు, గూడాచారులు, దొంగలు, మోసగాళ్ళు చొరపడే అవకాశం ఎక్కువగా ఉండేది. వాళ్లను అరికట్టడం, దొరికితే పనిపట్టడం రక్షణ విభాగం కర్తవ్యం.
అక్రమ వ్యాపారం, అనైతిక వ్యవహారాలను అడ్డుకోవలసిన అవసరం ఉంది.
ఇతరుల ప్రవేశం ఇక్కడి ప్రజా జీవితంలో ఇబ్బందులు కలిగించడం, వాటిని అరికట్టడం కోసం సైనికులు, భటులు అప్రమత్తంగా ఉండడం వంటివి పకడ్బందీగా జరిగేవి.   
4. గోలకొండ పాదుషాల జీవకారుణ్యం, ప్రకృతియత్వం :
 గోలకొండ పాదుషాల కోటలో ఒక ఉండేది. అది జింకల వనం. అక్కడ  జింకలు స్వేచ్ఛగా విహరించేవి. వాటిని కొట్టకూడదని ఆంక్షపెట్టారు. ఇప్పటికీ గోలకొండ సమీపంలో జింకల పార్కు ఉంది. కోటలో ఉద్యానవనాలను విరివిగా పెంచారు. ద్రాక్షతోటలు పెంచారు. ఆ కాలంలోనే మిద్దెమీది తోటలు పెంచడం పాదుషాల ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం. 
IV) పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలకు జవాబులు 
1. కింది ప్రశ్నలకు  ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
 అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి 
 జ: గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా మంచి విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో హిందూ, మహమ్మదీయ కవులు, పండితులు ఉండేవారు. ఇతడు విజయనగరంలో రాజాదరణలో పెరిగి తెలుగు భాషా మాధుర్యాన్ని రుచి చూశాడు. అందుకే తెలుగుభాషపై అభిమానంతో తెలుగు కవులను సత్కరించేవాడు.
    ఇతడు అద్దంకి గంగాధర కవిచే ‘తపతీ సంవరణోపాఖ్యానం’ కావ్యం రాయించి అంకితం తీసుకొన్నాడు. ఇతడు మరింగంటి సింగరాచార్య కవిని గొప్పగా సత్కరించాడు. ఇతని సేనాని అమీర్ ఖాన్, పొన్నగంటి తెలగనార్యుడిచే ‘యయాతి చరిత్ర’ అనే అచ్చ తెలుగు కావ్యాన్ని రాయించి అంకితం తీసుకున్నాడు.
    అబ్దుల్లా పాదుషా, విజ్ఞాన శాస్త్రములను, లలితకళలను వృద్ధి చేయడానికి ప్రయత్నిoచాడు. పై విషయాలను బట్టి గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులని చెప్పవచ్చు.  


ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
జ: తెలంగాణమును, గోలకొండ రాజధానిగా పాలించిన నవాబులలో ఇబ్రహీం కులీకుతుబ్ షా మంచి విద్యాప్రియుడు. ఇతడు కొంతకాలం విజయనగరంలో రాజాదరణలో పెరిగి ఆంధ్రభాషపై అభిమానం కలిగి తెలుగు కవులను సన్మా నిoచాడు. అద్దంకి గంగాధరకవి ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యాన్ని రాసి, ఇబ్రహీం కులీకుతుబ్ షాకు అంకితం ఇచ్చాడు. ఇబ్రహీం పాదుషా మరింగంటి సింగరాచార్య మహాకవికీ ఏనుగులు, తెల్లగొడుగు, గుఱ్ఱాలు, బంగారం, వస్త్రాలు, పల్లకీలు, ఇచ్చాడు.
 ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్, పొన్నగంటి తెలగనార్యుడిచే అచ్చ తెలుగు కావ్యం, యయాతి చరిత్ర రాయించి అంకితం తీసుకున్నాడు. దీనిని బట్టి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు.
ఇ) “తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
జ: గోలకొండ పట్టణములో వర్తక ప్రముఖులు విదేశాలతో వర్తకము చేస్తూ కుబేరులతో సమంగా ఉండేవారు. గోలకొండలో అన్ని వస్తువులు దొరికేవి. గోలకొండ వజ్రాలకు పుట్టినిల్లు. విదేశాలనుండి వచ్చే సరుకులు బందరు రేవు ద్వారా గోలకొండకు వచ్చేవి. విదేశీవ్యాపారం చేసే వారిలో డచ్చివారు ప్రధానంగా ఉండేవారు. ఈ వర్తకం, గోలకొండ పట్టణం ప్రధాన కేంద్రంగా తెలంగాణలో అంతా జరిగేది.
      ఇబ్రహీం కులీకుతుబ్ షా కాలంలో తెలంగాణం, ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండేది. తుర్కిస్థాన్, అరేబియా, పారశీకము మొదలైన దేశాలనుండి వర్తకులు వచ్చేవారు.
ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ? 
 జ:  ఈనాడు పట్టణాలలో జనాభా పెరిగిపోతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. 
పట్టణంలో ప్రజల నివాసానికి సరిపడ ఇళ్ళు, వారికి తగినంత నీటివసతి, కావలసిన ఆహారపదార్థాలు లభ్యం కావడం లేదు.
పట్టణాలలో సరిపడ ఇళ్ళు లేకపోవడంతో ప్రజలు చేరువులనూ, ఖాళీ ప్రదేశాలను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకుంటున్నారు. దానితో మురికివాడలు నగరంలో పెరిగిపోతున్నాయి. చెరువులలో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
వర్షం నీరు పోయే దారులు మూసుకుపోవడంతో, వర్షం వస్తే ఇళ్ళు మునుగుతున్నాయి. మురికి నీరు ప్రవహించే దారులు మూతపడుతున్నాయి.
పెరుగుతున్న జనాభాకు సరిపడ మంచినీరు, పాలు, నిత్యావసర వస్తువులు దొరకడం కష్టం అవుతుంది.
విద్యా, వైద్య, రవాణా సదుపాయాలు కల్పించడం కష్టం అవుతుంది.
ఇళ్ళ స్థలాల ధరలు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోయాయి.
నగరవాసులకు మంచిగాలి, నీరు, ఎండ కూడా లభించడం లేదు. ఇరుకు కొంపలలో గాలి,వెలుతురు లేకుండా ప్రజలు జీవించవలసి వస్తుంది.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
  అ) గోలకొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత గూర్చి విశ్లేషించండి.
 జ: దక్షిణ భారతంలో గోలకొండ పట్టణం ప్రసిద్ధి చెందింది. గోలకొండ దుర్గం అంటే, మూడు కోటలు. ఈ దుర్గానికి ఏడు మైళ్ళ కైవారము, 87బురుజులు ఉన్నాయి. ఆజంఖాన్ అనే ఇంజనీరు ఈ గోలకొండ పట్టణ రూపశిల్పి. ఈ పట్టణంలో వీధులను మొహల్లాలు అనేవారు.
   ఈ పట్టణంలో జనసమ్మర్దం ఎక్కువ. రాజభవనాలు పడమటి దిక్కున ఉండేవి. ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి  కులీకుతుబ్ షా పాదుషాలు మంచి శ్రద్ధ తీసుకున్నారు. ఇబ్రహీం కుతుబ్ షా పట్టణాన్ని అలంకార భూయిష్టంగా  తీర్చిదిద్దాడు. ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం షాహిమహలు, దిల్ కుషా అనే రాజభవనాలు యుద్ధభటులకు రెండు బారకాసులు ఉండేవి. అందమైన మిద్దెలమీద  తోటలు ఉండేవి. ఉద్యానవనాలకు నీటి సరఫరా ఏర్పాట్లు, ఉండేవి. 80 అడుగుల చుట్టుకొలత గల దొడ్డబాల్బోవా వృక్షం, దానిలో పెద్ద తొర్ర ఉండేది.
   పట్టణంలో 40వేల ఇండ్లు, 2లక్షల ప్రజలు ఉండేవారు. పట్టణ ప్రజలకు కటోరా హవుజు ద్వారా మంచినీరు  సరఫరా చేసే ఏర్పాటు ఉండేది. బజార్లలో అన్ని వస్తువులూ దొరికేవి. పట్టణంలోని సరుకులు బంజారా దర్వాజా గుండా వచ్చేవి. ఉమ్రావులు దర్జాగా డాబుసారిగా నగరంలో ఊరేగేవారు. ప్రజలందరూ వినోదాలతో భోగలాలసులై ఉండేవారు.



ఆ) గోలకొండ పట్టణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జ: గోలకొండ దుర్గంలో మూడు కోటలు ఉండేవి. ఈ దుర్గం ఏడు మైళ్ళ కైవారంలో ఉంటుంది. ఈ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ‘ఆజంఖాన్’ అనే ఇంజనీరు. పట్టణ వీధులను మొహల్లాలు అంటారు. పట్టణంలో జనసమ్మర్దం ఎక్కువ. గోలకొండ పట్టణాన్ని కులీకుతుబ్ షాలు అందంగా నిర్మించారు. ఇబ్రహీం కుతుబ్ షా పట్టణాన్నిఅందంగా తీర్చిదిద్దాడు.
   పట్టణంలో నగీనాబాగ్’ అనే అందమైన తోట  షాహిమహలు, దిల్ కుషా అందమైన రాజహర్శ్యములు. రెండు బారకాసులు ఉండేవి. మిద్దె మీద తోటలు ఉండేవి. అందమైన ఉద్యానవనాలు, వాటికి నీటి సరఫరా ఏర్పాట్లు ఉండేవి. ప్రజల సౌకర్యాలకు మహమ్మదు కులీ కుతుబ్ షా 78 లక్షల హానులు ఖర్చు చేశాడు. దుర్గంలోని కటోరా హవుజు నుండి ప్రజలకు నీటి సరఫరా చేసేవారు.
   విదేశాలతో వర్తకం చేసి బాగా డబ్బు గడించిన వర్తకులు ఉండేవారు. బందరు రేవు నుండి విదేశీ వస్తువులు దిగుమతి చేసుకొనేవారు. ఆ రోజుల్లో హోను, పెగోడా వంటి నాణెములు చెలామణిలో ఉండేవి. కొత్తవారికి నగరంలోకి తేలికగా ప్రవేశం దొరికేది కాదు. ఉప్పుపై, పొగాకుపై పన్ను వేసేవారు.
    గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా మంచి సాహిత్య పోషకుడు. ఇతడూ, ఇతని సేనాని, తెలుగు కావ్యాలు అంకితం తీసుకున్నారు. కోటలో జింకలవనం, ద్రాక్షతోటలు ఉండేవి. 1589లో నగరంలో మశూచి వచ్చింది. సాధువులు భజనలు చేస్తే రోగం తగ్గింది. దానికి కృతజ్ఞతగా నగరంలో ‘చార్మినార్’ కట్టబడింది. నగరంలో దోషిని వెంటనే శిక్షించేవారు. 1687లో ఔరంగజేబు ఈ కోటను సర్వనాశనం చేశాడు. 
V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు: 
 అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక / సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
 ఆ) గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని, ప్రకృతి ప్రేమికులని ఎట్లా చెప్పగలరు.
VI) గైహికము (ఇంటిపని )
  అ) కింది పదాలను వివరించి రాయండి.
     జలాశయం                            అగ్రహారం                  బంజారా దర్వాజా                    ద్రాక్షాసవము 
  ఆ) పుటసంఖ్య 104లోని పేరాను చదివి పట్టికను పూరించండి.
VII) పదజాలం:
1. కింది వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి.
   అ) పుట్టినిల్లు       : వరంగల్లు నగరం, కాకతీయ చారిత్రక వైభవానికి పుట్టినిల్లు.
   ఆ) పాటుపడటం   :  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సుఖంగా సాగించడానికి పాటుపడటం తప్పదు.
   ఇ) పీడవదలడం   :  దేశం బాగుపడాలంటే అవినీతి పీడవదలడం అతిముఖ్యం 
  ఈ) తలదాచుకోవడం : తుఫానుకు ఇల్లు కూలడంతో, రమేష్ కు  తానూ, పిల్లలూ, తలదాచుకోవడం ఎలాగో   తెలియలేదు.
VIII) వ్యాకరణాంశాలు:
 1. కింది వాక్యాల్లోని సంధి పదాలను విడదీసి, అవి ఏ సంధులో రాయండి.
   అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
             దేవాలయాలు    =     దేవ    +   ఆలయాలు
  ఆ) మధురలోని రమ్యోద్యనములు చూపరుల మనస్సులను ఆకట్టుకుంటాయి.
            రమ్యోద్యనములు  =    రమ్య   + ఉద్యానములు 
  ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
              అశ్వారూఢుడు   =     అశ్వ    +  ఆరూఢుడు
  ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.
                  రాజాజ్ఞ         =     రాజ  +  ఆజ్ఞ 
2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
 సమాసపదం                                        విగ్రహవాక్యం                                        సమాసం పేరు 
అ. బ్రాహ్మణభక్తి                                 బ్రాహ్మణుల యందు భక్తి                      సప్తమీ తత్పురుష సమాసం 
ఆ. నీలవేణి                                       నీలమైన వేణి కలది                             బహువ్రీహి సమాసం
ఇ. పుష్పగుచ్చం                             పుష్పముల యొక్క గుచ్చం       విశేషణ పూర్వపద  కర్మధారయ సమాసం
ఈ. గోలకొండ పట్టణం                         గోలకొండ అనే పేరుగల పట్టణం     సంభావనా పూర్వపద  కర్మధారయ సమాసం

 ఉ. గరళకంఠుడు                             గరళము కంఠమునందు కలవాడు                  బహువ్రీహి సమాసం
 ఊ. సుందరాకారములు                    సుందరములైన ఆకారములు   విశేషణ పూర్వపద  కర్మధారయ సమాసం
  దయాంతరంగుడు                           దయతో కూడిన అంతరంగము కలవాడు         బహువ్రీహి సమాసం
  అండచందములు                             అందమును, చందమును                            ద్వంద్వ సమాసం
3. కింది వాక్యాలను వ్యవహారభాషలోనికి మార్చండి.
  అ) ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేసిరి. 
  జ:  ఈ మందిరము నందే పారశీకపు రాయబారికీ, అతడి అనుచర వర్గానికీ  బస ఏర్పాటు చేశారు.
  ఆ) నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు, అచ్చెరువు గొల్పుచుండెను.
  జ:  నీటి కాలువలూ, జలాశయాలూ, జలపాతాలూ, ఆశ్చర్యo కల్గిస్తున్నాయి.
  ఇ) పెద్ద అధికారుల యొక్క మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండును.
   జ: పెద్ద అధికారుల మందిరాలన్నీ లోపలి కోటలో ఉంటాయి.
   ఈ) వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా !
   జ: వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే కదా !
   ఊ) పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును.
   జ: పట్టణoలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తూంటుంది.
IX) ప్రశ్నలనిధి:
1. కింది ప్రశ్నలకు  ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
 అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి. 
 ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
 ఇ) “తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
 ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ? 
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
  అ) గోలకొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత గూర్చి విశ్లేషించండి.
  ఆ) గోలకొండ పట్టణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
X) నికష:
1. కింది ప్రశ్నలకు  ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.                                  4మా
    అ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
    ఆ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?  
2. కింది సంధి పదాలను విడదీసి, అవి ఏ సంధులో రాయండి.                                2మా 
    అ) అశ్వారూఢుడు                            ఆ) రాజాజ్ఞ
3. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.           2మా
    అ) గరళకంఠుడు                              ఆ) సుందరాకారములు     
4. కింది వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి.                                                   2మా
    అ) పుట్టినిల్లు                                   ఆ) తలదాచుకోవడం
 


11. భిక్ష 
                                                             - శ్రీనాథుడు 
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 
కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడం 
 భిక్ష యొక్క ప్రాధాన్యతను సొంతమాటల్లో చెప్పగలగడం
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలగడం
చుక్కపద్యాలు కంఠస్థo చేయడం  
 II) చుక్కపద్యాలు 
1. వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము 
    త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
    య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మని పిల్చెహస్తసం 
    జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్ 
ప్రతిపదార్థo :
వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన
వేద               =          వేదముల యందు
పురాణ           =           పురాణముల యందు 
శాస్త్ర              =           శాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన 
పదవీ            =           మార్గమునకు
 నదవీయసియైన
 న + దవీయసి + ఐన = మిక్కిలి దూరము నందు లేని ( అనగా దగ్గరగా నున్న)
                                  ( వేద పురాణ మార్గాన్ని అనుసరిస్తున్న)
పెద్దముత్తైదువ           =        పెద్దదైన పురంధ్రి
కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ 
         కాశికానగర       =   కాశికానగరము అనెడి
        హాటకపీఠ          =   స్వర్ణ పీఠం యొక్క 
             శిఖా            =   శిఖరమందు 
         అధిరూఢ          =   అధిరోహించియున్న 
    ( ఆ + ఆదిమశక్తి )   =   ఆ ఆదిశక్తి  స్వరూపిణి 
 హస్తసంజ్ఞాదరలీలన్ ;    
       హస్తసంజ్ఞా            =     చేతి సంజ్ఞ యందు వెల్లడి యవుతున్న 
            ఆదర             =     ఆదరముతో కూడిన 
           లీలన్              =     విలాసముతో 
రత్నఖచితాభరణంబులు 
              రత్న            =    రత్నములతో 
             ఖచిత            =    పోదుగబడిన (కూడిన)
          ఆభరణంబులు     =    నగలు
        ఘల్లు ఘల్లనన్      =    గల్లు గల్లుమని శబ్దము చేస్తుండగా 
          సంయమివరా     =    ఓ  మునీశ్వరా !
    ఇటురమ్ము  +   అని   =   ఇలా రమ్మని (ఇటు వైపు రమ్మని)
           పిల్చెన్            =    పిలిచింది  
2. ఆ కంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా 
   లేకున్నo గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే !
   నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
   శాకాహారులుఁ గందభోజులు, శిలోoఛప్రక్రముల్ తాపసుల్ !
ప్రతిపదార్థo :
 ఇప్డు                         =    ఇప్పుడు
 ఆ కంఠంబుగన్             =  కంఠము దాకా (గొంతు దాకా)
 మాధుకర భిక్షాన్నంబు    =  మాధుకర రూపమైన భిక్షాన్నమును
 భక్షింపఁగాన్                 =     తినడానికి 
 లేకున్నన్ (లేక + ఉన్నన్) =  లేకపోయేసరికి 
 కడున్                        =   మిక్కిలి
 అంగలార్చెదవు              =  అంగలు వేస్తున్నావు (తొట్రుపడుతున్నావు) (గంతులు వేస్తున్నావు)
 మేలే (మేలు + ఏ)         =  నీవు చేసే పని మంచిదేనా 
 లెస్స                         =  బాగున్నదా ?
 శాంతుండవే                 =   నీవు శాంతగుణం  కలవాడవేనా !
(శాంతుండవు  +  ఏ)
కటకటా                       =   అక్కడ కటా !
నీవార ముష్టింపచుల్       =   ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండి తినేవారునూ  
శాకాహారులుఁ               =  కాయ కూరలు మాత్రమే తినేవారునూ
(శాక  +  ఆహారులు)
కందభోజులు                =  దుంపలు మాత్రమే తినేవారునూ
శిలోoఛప్రక్రముల్ ;
శిల ప్రక్రముల్              =  కోతకోసిన వరిమళ్ళలో రాలిపడిన కంకులను ఏరుకొని
                                   వాటితో బతికేవారునూ 
ఉంఛ ప్రక్రముల్            =  రచ్చరోళ్ళ వద్ద, వడ్లు దంచేటప్పుడు, చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు
                                   ఏరుకొని జీవనం సాగించే వాళ్ళు అయిన 
తాపసుల్                   =   తపస్సు చేసుకొనేవారు ; (మునులు)
నీకంటెన్                    =  నీ  కన్న
మతిహీనులే               =   బుద్ధితక్కువ వారా ?
                                   (తెలివి తక్కువ వారా) 
3.  ఓ మునీశ్వర ! వినవయ్య యున్న యూరుఁ
     గన్నతల్లియు నొక్క రూపన్న రీతి 
     యటు విశేషించి శివుని యర్దాంగలక్ష్మి 
     కాశి ; యివ్వీటిమీఁద  నాగ్రహము దగునె ?


ప్రతిపదార్థo :

ఓ మునీశ్వర ! 
(ముని + ఈశ్వరా)              =  ఓ మునీశ్వరుఁడా !
ఉన్న యూరున్
(ఉన్న + ఊరున్)              =   తాను ఉన్న ఊరునూ 
కన్న తల్లియున్                =   తనను కన్న తల్లియునూ 
ఒక్క రూపు                     =   ఒకే రూపము 
అన్న రీతి                        =  అన్న పధ్ధతి 
వినవయ్య                       =   నీవు వినలేదా ?
అటు విశేషించి                 =    అంతకంటెను విశేషించి 
కాశి                               =   కాశీ పట్టణం 
శివుని                            =   ఈశ్వరుని యొక్క 
అర్థాంగ లక్ష్మి                   =   భార్య 
ఇవ్వీటిమీదన్
(ఈ + వీటిమీదన్)            =    ఈ కాశీనగరo మీద 
ఆగ్రహము                      =     కోపము 
తగునె ( తగును + ఎ )     =        తగునా ?  

4. అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
    మునివర ! నీవు శిష్యగణముoగొని చయ్యన రమ్ము విశ్వనా 
    థునికృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
    బని గొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ 
ప్రతిపదార్థం :
అనవుడున్             =     వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా 
కమలానన
(కమల + ఆనన)      =     పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ 
అల్ల                      =     కొంచెం (మెల్లగా)
నవ్వి                     =    నవ్వి
ఇట్లనున్                 
(ఇట్లు + అనున్)      =     ఇలా చెప్పింది
లెస్సగాక               =    మేలు అగునుకాక ! (మంచిది)
ఓ మునివర            =    ఓ మునీశ్వరుడా !
నీవు                    =     నీవు
శిష్యగణమున్          =     శిష్యులందరినీ 
కొని                     =     తీసుకొని 
చయ్యన్                =     శీఘ్రంగా 
రమ్ము                  =     రమ్ము  ( మా ఇంటి భోజనానికి రా)
విశ్వనాథుని           =      విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క 
కృప పేర్మిన్            =      దయాతిశయం చేత (అధికమైన దయ చేత)
ఎందఱతిథుల్        
(ఎందరు + అతిథుల్) =   ఎంతమంది అతిథులు 
చనుదెంచినన్          =    వచ్చినప్పటికీ 
కామధేనువున్        =   దేవతల కామధేనువును 
పనిగొనినట్లు          =   స్వాధీనం చేసుకొన్న విధంగా (కామధేనువు చెప్పుచేతల్లో ఉన్నవిధంగా)
అపారములైన 
(అపారములు + ఐన) =  అంతులేని 
అభీప్సితాన్నముల్ 
(అభీప్సిత + అన్నముల్)  = కోరిన అన్న పదార్థాలను 
పెట్టుదున్              =     పెడతాను       
III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) శ్రీనాథుని గురించి రాయండి.
జ: శ్రీనాథుడు, తెలుగు సాహిత్యంలో పేరుపొందిన పెద్దకవి. ఈయన తల్లితండ్రులు భీమాంబ, మారయలు. ఈయన కొండవీడును పాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. ఈయన, విజయనగరం చక్రవర్తి ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని ‘గౌడడిండిమభట్టు’ను ఓడించి, రాయలచే కనకాభిషేకమునూ, ‘కవిసార్వభౌమ’ అనే బిరుదును పొందాడు. ఈ కవి, శృంగారనైషధం, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం వంటి పెక్కు కావ్యాలు రచించాడు. పెక్కు చాటుపద్యాలు రచించాడు.

ఆ) వ్యాసునికి పాత్ర స్వభావాన్ని వివరించండి.
జ: వ్యాసుడు, సమస్త విద్యలకు గురువు. ఈయనకు పదివేలమంది శిష్యులు ఉండేవారు. ఈయన కాశీనగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ, భిక్షాటన చేసుకొంటూ జీవనం సాగించేవాడు. ఒకసారి శివుని మాయవల్ల వ్యాసునకు కాశీనగరంలో రెండురోజులు వరుసగా ఎవరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు సులభ కోపి. తనకు రెండు రోజులుగా బిక్ష దొరకలేదని సతమతమయ్యాడు. కాశీ నగరవాసులకు మూడు తరాలదాకా, ధనం, విద్యా, మోక్షం లేకుండా ఉండుగాక అని శపించబోయాడు. వ్యాసునికి శిష్యులంటే మంచి ప్రేమ. శిష్యులు తినకుండా తాను ఒక్కడూ తిననని వ్రతం పట్టిన శిష్యవత్సలుడు. నిత్యం పవిత్ర గంగాస్నానం చేసేవాడు. పార్వతీదేవీ చేత మందలింపబడి, తాను చేసిన తప్పును వ్యాసుడు గ్రహించాడు. శిష్యులందరికీ కూడా తనతోపాటు భోజనం పెడతానని ముత్తైదువు చెప్పిన తరువాతే, శిష్యులతో వెళ్ళి, పార్వతీమాత పెట్టిన భోజనం తిన్నాడు.
ఇ) “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అను మాటలు ఎవరు ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటో వివరించండి.
జ: “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అన్న మాటలు, వేదవ్యాసుడు సామాన్య స్త్రీ రూపంలో కనబడి తనను భోజనానికి తన ఇంటికి రమ్మని పిలిచిన పార్వతీదేవితో అన్నాడు. వ్యాసుడు కాశీనగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతీదేవి సామాన్య స్త్రీరూపంతో వ్యాసునకు కనబడి, వ్యాసుడు కోపించడం తగదని మందలించి, అతణ్ణి భోజనానికి రమ్మని పిలిచింది. అప్పుడు వ్యాసుడు పార్వతిదేవితో, సూర్యుడు అస్తమిస్తున్నాడనీ, తనకు పదివేలమంది శిష్యులు ఉన్నారనీ, తన వ్రతాన్ని విడిచి తాను ఒక్కడు వచ్చి తినడం వీలుగాదనీ చెప్పాడు.
అంతరార్థం : “ఈరోజు నిన్నటి రోజుకు తరువాతి రోజు అన్నదినిజము” అని ఈ మాటకు అర్థం. అంటే నిన్న ఎలాగైతే భోజనం లేకుండా పస్తు ఉన్నామో, అలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటామని, దీని అంతరార్థం.  
ఈ) కోపం వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు కదా ! “ కోపం - మనిషి విచక్షణను నశింపచేస్తుంది”. దాని గురించి రాయండి. 
జ: “ కోపo వస్తే నేను మనిషిని కాను” అని సామాన్యంగా అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలుసుకోలేడు. కోపంతోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా, చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు. ఈ కథలో వ్యాసుని అంతటి బ్రహ్మజ్ఞాని, రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది. కోపం శత్రువు లాంటిది అని దాని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచి పెట్టాలి. దుర్యోధనునికి, పాండవులపైనా, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని, యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచమైపోవును” అని వేమన కవి చెప్పాడు. కాబట్టి కోపాన్ని అణుచుకోవాలి. శాంతాన్ని చేబట్టాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమె తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం మనిషి వివక్షతను నశింపజేస్తుంది.   
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) భిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
జ: వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణవాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవోకారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ, వ్యాసుడు నిశ్చయించాడు. 
  ఈశ్వరుడి మాయవల్ల మరుసటిరోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షాపాత్రను నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు  మూడు తరాలపాటు ధనం, విద్య, మోక్షం లేకపోవుగాక అని శపించబోయాడు.
   ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. ఈ రోజు కూడా నిన్నటిలాగే పస్తుంటాను” అన్నాడు. అప్పుడు పార్వతీదేవీ నవ్వి “ నీవు శిష్యులందరినీ నీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలను పెడతాను”. అని చెప్పింది. వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానంచేసి వచ్చాడు. పార్వతీదేవీ వారికి ఎదురేగి స్వాగతం చెప్పి, భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.
ఆ) కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గూర్చి రాయండి.
జ: కోపం వచ్చిన మనిషిలో మంచిచెడ్డలను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాకాస ప్రవృత్తి పెరిగిపోతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలనీ, ఎదుటి వాడికి కష్టం కల్గించాలనీ, బుద్ధి కలుగుతుంది. కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒకప్పుడు తన భార్యనూ, పిల్లలనూ, తల్లిదండ్రులనూ కూడా, చంపడానికి ప్రయత్నిస్తాడు.
    కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. “ తన కోపమే తన శత్రువు “ అని సుమతీ శతకకర్త కూడా చెప్పాడు. కోపం వల్లే, వ్యాసమహర్షి, కన్నతల్లి వంటి కాశీనగరాన్నీ శపించబోయాడు. కోపంతో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది. తమోగుణం పెరుగిపోతుంది. కోపం వల్లనే, పాపకార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు. కోపం వల్లనే మోహం పెరుగుతుందని గీతాకారుడు చెప్పాడు. 
IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు 
అ) “ కోపం తగ్గించుకోవడం మంచిది !” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
ఆ) మీకు తెలిసిన జాతీయాలు, సామెతలు రాయండి. వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామో చెప్పండి.
V) గైహికము (ఇంటిపని)
అ) చుక్కపద్యాలు కంఠస్థo చేసి ప్రతిపదార్థాలు రాయండి.
ఆ) ప్రశ్నజవాబులు చదువండి. రాయండి 
VI) పదజాలం 
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె.
జ:       స్త్రీ        పురంధ్రి           అంగన        పడతి         నారి
ఆ) ప్రక్షాళితంబైన పసిడి చట్టువము.
జ:      బంగారము          సువర్ణము       కనకము        హిరణ్యము        పైడి 
ఇ) పారాశర్యుoడు క్షుత్పిపాసా పరవశుండై శపియింపదలంచెను.
జ:  వ్యాసుడు           బాదరాయణుడు           సాత్యవతేయుడు                కృష్ణ ద్వైపాయనుడు
ఈ) ఇవ్వీటి మీద నాగ్రహము తగునె ?
జ:  కోపము            క్రోధము           రోషము            కినుక
ఉ) అస్తమింపగా జేసినాడు ఆహిమకరుడు.
జ: సూర్యుడు           రవి          ఆదిత్యుడు           భాస్కరుడు  
2. కింది పదాలకు అర్థాలను రాయండి.
అ)   ద్వాఃకవాటంబు   =   ద్వారపు తలుపు 
ఆ)   వీక్షించు           =   చూచు 
ఇ)    అంగన            =   స్త్రీ 
ఈ)   మచ్చెకంటి       =   చేప వంటి కన్నులు కలది. (స్త్రీ)
ఉ)    భుక్తిశాల         =   భోజనశాల 
3. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.
అ) వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు.
జ:  ఇతడు (ఈ మనిషి)       పట్టణము           వదులుట
ఆ)  రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు.
జ:  క్షత్రియుడు             చంద్రుడు             ప్రభువు 
4. ప్రకృతి - వికృతులు
     విద్య           -   విద్దె 
     భిక్షము       -   బిచ్చము 
     యాత్ర         -    జాతర 
     మత్స్యము    -    మచ్చెము
     రత్నము      -    రతనము
     పంక్తి           -    బంతి
VII) వ్యాకరణాంశాలు 
1. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.
అ) పుణ్యాంగన                పుణ్య  +  అంగన         (సవర్ణదీర్ఘ సంధి)  
ఆ) యివ్వీటి                   ఈ      +  వీటి             (త్రిక సంధి)
ఇ) మునీశ్వర                  ముని  +  ఈశ్వర         (సవర్ణదీర్ఘ సంధి)  

VIII) ప్రశ్నలనిధి 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) శ్రీనాథుని గురించి రాయండి.
ఆ) వ్యాసునికి పాత్ర స్వభావాన్ని వివరించండి.
ఇ) “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అను మాటలు ఎవరు ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటో వివరించండి.
ఈ) కోపం వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు కదా ! “ కోపం - మనిషి విచక్షణను నశింపచేస్తుంది”. దాని గురించి రాయండి. 

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) భిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
ఆ) కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గూర్చి రాయండి.
IX) నికష 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.             6మా
అ) వ్యాసునికి పాత్ర స్వభావాన్ని వివరించండి.
ఆ) “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అను మాటలు ఎవరు ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటో వివరించండి.
2. కింది పదాలకు అర్థాలను రాయండి.                                       2మా
అ)   ద్వాఃకవాటంబు                            ఆ) అంగన             
3. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.                           2మా 
  అ) పుణ్యాంగన                                  ఆ) యివ్వీటి                   



12. భూమిక 
                                         - గూడూరి సీతారాం 
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు :
పుస్తక పరిచయం (పీఠిక) గురించి తెలుసుకొని, ఏదైనా ఒక కథల పుస్తకానికి పీఠిక రాయగలగాలి  
నెల్లూరి కేశవస్వామి కథల గురించి తెలుసుకోగలగాలి    
కథలకూ, కవిత్వానికీ గల భేదం చెప్పగలగాలి
శ్లేషాలంకారాన్ని గుర్తించగలగాలి  
II) ముఖ్య పదాలు – అర్థాలు :
      మాసపత్రిక            =  నెలకు ఒకసారి వచ్చే పత్రిక 
      అంతర్యుద్ధం           =  అంతర్గత పోరాటం 
      పట్టభద్రుడు            =  డిగ్రీ తీసుకున్నవాడు
      ఉద్యమాలు            =   పోరాటాలు
      సార్థకత                =   అర్థవంతం
      అంతర్భాగం           =   లోపలి భాగం  
       పరదాలు             =   తెరలు   
       జీవభాష              =  వాడుకలోని భాష 
       అచ్చం                =  సరిగ్గా
       వాత్సల్యం            =   ప్రేమ   

III) చర్చనీయ అంశాలు :
 1. కథకు, కవిత్వానికి గల భేదం..... ఇష్టమైన ప్రక్రియ :
కథ వచన రచన. కవిత్వం పద్యరచన. కథలో కథనం ఉంటుంది. కవిత్వంలో గూడార్థం ఉంటుంది. కథలో మనోరంజకత్వం ప్రధానం. కవిత్వంలో శబ్డ్డప్రయోగం అందం. కథ సంఘటనల మధ్య సంబంధాన్ని చిత్రిస్తుంది. కవిత్వం ఆలోచనలకు ఆశ్రయం ఇస్తుంది. దేనికది గొప్పదే. దేని ప్రత్యేకత దానిదే.
కథను ఇష్టపడితే.....
కథలో వేగం నచ్చుతుంది. సహజమైన పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది. సంభాషణలు ఉత్సాహాన్ని నింపుతాయి. కథనం ముగింపుపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముగింపు హృదయాన్ని కదిలిస్తుంది. సందేశం మార్గనిర్దేశనం చేస్తుంది.
కవిత ఇష్టమైతే.....
పద ప్రయోగం ఆకట్టుకుంటుంది. క్లుప్తత నచ్చుతుంది. కవితలోని లయ ముగ్ధులను చేస్తుంది. అంశ విశ్లేషణ ఆలోచింపచేస్తుంది. వ్యంగ్యం/ ధ్వని/శ్లేష /చమత్కారం పదేపదే చదివిస్తుంది. సొంతంగా రాయాలన్న ప్రేరణనిస్తుంది.

2. నాటి హైదరాబాద్ రాజ్యంలో ప్రజల ఉద్యమం ఎందుకు సాగి ఉండవచ్చు?
  20వ శతాబ్దం ప్రారంభం హైదరాబాద్ రాష్ట్రానికి చేదు అనుభవాలను మిగిల్చింది. మతం ప్రాతిపదికగా హిందువులను నీచంగా చూడటమే కాక రజాకార్ల పేరుతో చెప్పుకోలేనన్ని దౌర్జన్యాలు సాగించారు. అవి సహించలేక తిరగబడ్డ ఈ రాష్ట్ర ప్రజలు హక్కులకోసం, స్వాతంత్ర్యంకోసం ఉద్యమించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 13నెలల దాకా ఇక్కడి ప్రజలు నిరంకుశ పాలనలోనే నలిగిపోయారంటే, పరిస్థితులెంత దయనీయంగా ఉండేవో ఊహించుకోవచ్చు. 
3. జీవభాష – కథల్లో చిత్రించడం :
జీవభాష అంటే బతికున్న భాష. భాష బతికి ఉండటం అంటే వ్యవహారంలో ఉండటం. అంటే మాట్లాడుతున్న భాష జీవభాష. కథ అంటే దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్న అనుభూతి. ఆ అనుభూతికి సహజత్వాన్నిచ్చేది భాష. ఆ భాష వ్యవహారంలో ఉండే పాత్రోచితమైoదిగా ఉండాలి. సన్నివేశాలను, నేపథ్యాలను సహజంగా ఆవిష్కరించాలి. జీవభాషను కథల్లో చిత్రించడమంటేఇదే. 
4. చార్మినార్ కథలను ఎందుకు చదువాలి ?
 చార్మినార్ కథలు నెల్లూరి కేశవస్వామి అనుభవాల్లో నుంచి జీవం పోసుకున్న కథలు. 11వ శతాబ్దం నుంచి వేయి సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఊపిరి పోసుకున్న  సంస్కృతి, చరిత్ర కేశవస్వామి కథల్లో సాక్షాత్కరిస్తుంది. నవాబులు, దేవిడీలు, మహబూబ్ కి మెహందీలు, కోఠీలు, దివాన్ఖానాలు, జనాభాఖానాలు, బేగంసాహేబులు, పాన్దాన్లు, పరాటాకీమాలు, దాల్చాలు, నమాజులు, పరదాల వెనుక సంఘటనలు..... ఈ విధంగా హైదరాబాద్ నగర జీవితాన్ని, చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకునేందుకు, హైదరాబాదీ జీవితాన్ని అధ్యయనం చేసేందుకు చార్మినార్ కథలు చదువాలి.
5. నెల్లూరి కేశవస్వామి హృదయం చార్మినార్ కథల్లో ప్రతిబింబిస్తుంది
హైదరాబాద్ లో పుట్టి, పెరిగి, ఈ వాతావరణాన్ని, సంస్కృతిని గుండెలనిండా నింపుకున్న కేశవస్వామికి ఈ మట్టిలోని ప్రతిరేణువుతో సంబంధముంది. ఆ బంధం మతాలకు అతీతమైన మైత్రి బంధం. అందుకే తాను జీవించిన, అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితం చార్మినార్ కథల్లో ఆవిష్కరించాడు. అందుకే చార్మినార్ కథల్లో నెల్లూరి కేశవస్వామి హృదయం ప్రతిబింబిస్తుంది. ఇవి కేవలం కథలు కావు. వాస్తవ జీవితాల సామాజిక పరిణామాల చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకున్న చారిత్రక కథలు. నిజాం యుగాంత పరిణామాలను ఇవి కళ్లకు కడతాయి.   
6. హృదయ సంస్కారం అంటే.....
సంస్కారమైన హృదయం. అంటే హృదయ పూర్వకంగా సంస్కారవంతoగా ప్రవర్తించడం. మనుషులు అవకాశాన్ని బట్టి మంచివాళ్ళుగా, చెడ్డవాళ్లుగా మారిపోతుంటారు. హృదయంలో సంస్కారమున్న వాళ్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ మంచితనాన్ని విడనాడారు. మంచితనాన్ని అవకాశవాదానికి బలిచేయరు. నెల్లూరి కేశవస్వామి ‘రూహిఆపా’ కథలోని ‘నవాబు’ పాత్రలో అతని కుమారుడు సలీం పాత్రలోనూ ఈ హృదయసంస్కారం కనిపిస్తుంది. ఆవు - పులి కథలో పులి హృదయ సంస్కారం అలాంటిదే. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు లేని పాండవులు చిక్కినా అపకారం తలపెట్టని కర్ణుని ఔదార్యం కూడా హృదయ సంస్కారానికి ప్రతీక.


7. కేశవస్వామి కథల ఆధారంగా కథల స్వరూప స్వభావాలు.......
నెల్లూరి కేశవస్వామి కథలు అసాధారణమైనవి. కిషన్ చంద్ ల వంటి జాతీయస్థాయి రచయితలతో సమానమైన ప్రతిభతో చార్మినార్ కథలు రచించాడు కేశవస్వామి. ఈ కథలను పరిశీలించినప్పుడు కథలంటే ఎలా ఉండాలో ఒక అభిప్రాయo కలుగుతుంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా కథలుండాలి.
పాత్రచిత్రణ, సంభాషణలు సహజంగా ఉండాలి.
సంఘటనల మధ్య సంబంధాలను కళాత్మకంగా చిత్రించాలి.
కథలు పాఠకుల్ని కదిలించాలి, ఆలోచింపచేయాలి.
చక్కని సందేశాన్నివ్వాలి.
IV) పాఠ్య పుస్తకంలోని ప్రశ్న - జవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.
అ) “ ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. రాయండి.
జ: సామాన్యంగా ఉత్తమ కవులు, రచయితలు తమ రచనలలో నాటి సామాజిక పరిస్థితులకు చోటు కల్పిస్తారు. ఉద్దేశించకపోయినా, నాటి సామాజిక పరిస్థితులకు కవుల రచనలు అద్దం పడతాయి. అయితే సామాన్య కవుల రచనలు అలాగే ఉంటాయని చెప్పలేము.
కాని నెల్లూరి కేశవస్వామి రాసిన కథలలో, ఆనాటి హైదరాబాద్ రాజ్యం, ఇండియన్ యూనియన్ లో కలిసిన నాటి పరిస్థితులు స్పష్టంగా చిత్రింపబడ్డాయి. అలాగే కేశవస్వామి గారి చార్మినార్ కథలూ, యుగాంతం కథ కూడా, ఆనాటి హైదరాబాద్ లోని హిందూముస్లీంల కలహాలనూ, ఆనాటి మరణకాండనూ వెల్లడిస్తాయి.
కాబట్టి ఒక భాషలోని సాహిత్యం, ప్రధానంగా నవలలు, కథలు చదివితే, నాటి పరిస్థితులు అర్థం చేసికోవచ్చు అన్నమాట నిజం.

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి.
 జ:  తెలంగాణ పలుకుబడులంటే తెలంగాణాలోని పల్లెజనం మాట్లాడుకొనే అసలైన స్వచ్ఛమైన తెలుగు నుడికారం గల భాష.
కాదక్కా! మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాదు.
“ అదో ! అక్కడి దిక్కు జెర నాచెవు వారిచ్చి ఇను”.
బండి సాగిపోతనే ఉండది.
ఎన్నాళ్లకెన్నాళ్లకు ? ఏరుతార్లు ఎచ్చుతచ్చులు మాని, తోటి మనిషికి సమానంగ తావును పంచి ఇచ్చే బుద్ధి మీకు దక్కింది.
ఇంతకంటే మంచిబాట ఇంగెట్లుంటది ?
ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమి అర్థమయిందో వివరించండి.
జ: తెలంగాణ కథ 1902లో ప్రారంభమైంది. ఆనాటి నుండి తెలంగాణా కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తోంది. బండారు అచ్చమాంబగారు, తెలంగాణా తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది.
 నాటి తెలంగాణా కథ పుట్టిన నాటి నుండి సామాజిక చైతన్యంతోనే అది కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ కథలలో సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛా వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణజీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు మొదలైన విశేషాలు పలుకోణాల్లో చిత్రించబడ్డాయి. అందువల్ల తెలంగాణ కథలన్నీ పుట్టిన నాటి నుండి నేటి వరకూ సాంఘిక చైతన్యంతోనే వస్తున్నాయని నాకు అర్థమయ్యింది.
ఈ) నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామికవాది. చైతన్యశీలి. ‘దీన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలు తెలుపండి. 
జ: నెల్లూరి కేశవస్వామి లోహియా సోషలిస్టు. ఈయన హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో హిందూముస్లీం సంఘర్షణలు చూసి చలించిపోయాడు. అశాంతిగా నిద్రలేకుండా ఎన్నో రాత్రులు గడిపాడు. హిందూముస్లీం సఖ్యత కోసం, తాను ఏమీ చేయలేనా ? అని ఆలోచించాడు.
      మతాతీత స్నేహాలు, ఆత్మీయతలు బలి కాకుడదనుకున్నాడు. తాను జీవించిన, తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు గల  ఓల్డ్ సిటీ జీవితాన్ని ‘చార్మినార్ కథలు’గా రాశాడు. ఈ విధంగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా కేశవస్వామి తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ చార్మినార్ కథలు రాశాడు. ఇవి వాస్తవ జీవితాల, సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసిన కథలు. దీనిని బట్టి కేశవస్వామి “చైతన్యశీలి” అని చెప్పవచ్చును.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)  అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చును. అట్లే, పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి.
 జ: ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్నీ, తత్వమునూ, రచయిత దృక్పథాన్నీ, ప్రచురణ కర్త వ్యయ ప్రయాసలనూ పుస్తక పరిచయ వ్యాసం పాఠకులకు తెలియపరుస్తుంది. ఆ గ్రంథము యొక్క నేపథ్యాన్నీ, లక్ష్యాలనూ పుస్తక పరిచయ కర్త మనకు పరిచయం చేస్తాడు. ఆ పుస్తకంలో రచయిత వివరించిన విషయం, వివరించిన తీరు, దానిలోని మంచి చెడ్డలు, పుస్తక పరిచయకర్త సమీక్షిస్తాడు.
    పుస్తక రచయిత రచనా విధానంలో తీసుకొన్న మెళకువలనూ, చూపించిన అందాలనూ పుస్తక పరిచయకర్త మనకు తెలుపుతాడు. ఆ పుస్తకంలో ఉన్న ముఖ్య విషయాలను, రేఖా మాత్రంగా సమీక్షకుడు తెలియపరుస్తాడు.  ఆ పుస్తకం ద్వారా మనం ఏవిషయాలు తెలుసుకోగలమో, ఇంకా ఏయే విషయాలు ఆ గ్రంథంలో తెలియజేస్తే బాగుండేదో పుస్తక పరిచయంలో రాయబడుతుంది. కాబట్టి పుస్తక పరిచయ వ్యాసం, ఆ గ్రంథాన్ని మనకు చక్కగా పరిచయం చేస్తుంది. 
ఆ) కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా, కేశవస్వామి రచనలను గురించి రాయండి.
జ: నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకట్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం “చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్మినార్ కథలు హైదరాబాద్ సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లీంల జీవితాలనూ అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు.  
ఈయన “యుగాంతం” కథ సార్థకమైనది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు
అయ్యేవాడు.
చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలను చిత్రించిన కథలు. కేశవస్వామి రాసిన రుహీ అపా” కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లీం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు.
ఈయన “వంశాంకురం” కథలో ముస్లిం పెళ్లిసంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ్ చంద్ కిషన్ చందర్ లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.
V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :
1) ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
2) కింది పదాల గురించి వివరించి రాయండి.
      అ) హృదయ సంస్కారం            ఆ) సామాజిక పరిణామం 
      ఇ) భారతీయ సంస్కృతి            ఈ) ఉన్నత శిఖరాలు 
VI) గైహికం (ఇంటిపని)
1. పాఠం ఆధారంగా పుట సంఖ్య 127లోని పట్టికను పూరించండి.
2. ప్రశ్నజవాబులు చదువండి. రాయండి.

VII) పదజాలం 
1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
       ధ్యాస    =  దృష్టి
ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ, ఇద్దరూ సఖ్యతతో మెలుగుతారు. 
       సఖ్యత    =   స్నేహం 
ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
       హస్తవాసి   =    చేతి చలువ 
ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
        ప్రఖ్యాతి  =  ప్రసిద్ధి
ఉ) పూర్వ జమీందారుల దేవిడీలలో చర్చా గోష్ఠులు జరిగేవి.
        దేవిడీ  =  పెద్ద భవంతి
VIII) వ్యాకరణాంశాలు :
1. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.
 సమాసపదం                            విగ్రహవాక్యo                                     సమాసం పేరు
అ) దశకoఠుడు       -              దశ సంఖ్య గల కంఠములు కలవాడు            బహువ్రీహి సమాసం 
ఆ) పీతాంబరుడు     -              పసుపు పచ్చని అంబరము కలవాడు            బహువ్రీహి సమాసం
ఇ) అరవిందానన     -              అరవిందము వంటి ఆననము కలది              బహువ్రీహి సమాసం
ఈ) మృగనేత్ర         -               మృగము వంటి నేత్రములు కలది                 బహువ్రీహి సమాసం
ఉ) చంచలాక్షి         -               చంచలములైన అక్షులు కలది                      బహువ్రీహి సమాసం
ఊ) మానధనులు    -               అభిమానమే ధనముగా కలవారు                  బహువ్రీహి సమాసం
ఋ) రాజవదన       -               రాజు (చంద్రుని) వంటి వదనము కలది           బహువ్రీహి సమాసం
ౠ) నీరజభవుడు   -              నీరజము (పద్మము) పుట్టుక గలవాడు           బహువ్రీహి సమాసం
2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.
  అ) “ హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైంది” అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు.                                                                                       (ప్రత్యక్ష వాక్యం)
    జ:   హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్    ప్రకటించాడు.                                                                                       (పరోక్ష వాక్యం)
  ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కవి నెల్లూరి కేశవస్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు.                                                                     (ప్రత్యక్ష వాక్యం)
  జ: తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కవి నెల్లూరి కేశవస్వామియని   గూడూరి సీతారాం అన్నాడు.                                                                     (పరోక్ష వాక్యం)
 ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు.  
                                                                                                      (ప్రత్యక్ష వాక్యం)
   జ: చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు.     
                                                                                                       (పరోక్ష వాక్యం)
3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.
  అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని ‘తమస్’ నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)
  జ:  పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మసహానిచే ‘తమస్’ నవలలో చిత్రించబడ్డాయి. (కర్మణి వాక్యం)
  ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.  (కర్తరి వాక్యం)
  జ:  హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)
  ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)
  జ: నెల్లూరి కేశవస్వామి,భారతదేశం గర్వించదగిన గొప్ప కథకులలో ఒకడిగాకీర్తింపబడ్డాడు (కర్మణి వాక్యం)
 IX) ప్రశ్నలనిధి :
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.
అ) “ ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు” దీనిపై మీ అభిప్రాయం రాయండి.
ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి.
ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమి అర్థమయిందో వివరించండి.
ఈ) నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామికవాది. చైతన్యశీలి. ‘దీన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలు తెలుపండి. 
ఉ)  హృదయ సంస్కారం అంటే ఏమిటి ?
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చును. అట్లే, పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి.
ఆ) కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా, కేశవస్వామి రచనలను గురించి రాయండి.
X) నికష :
1. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.                                            4మా
ఆ) కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా, కేశవస్వామి రచనలను గురించి రాయండి.
2. కింది పదాలకు అర్థాలు రాయండి.                                                                 2మా
     అ) హస్తవాసి                                  ఆ) దేవిడీ  
 3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.                           2మా 
     అ) దశకoఠుడు                               ఆ) పీతాంబరుడు     
4. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.                                       2మా 
  అ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.  
  ఆ)  నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు.

                                                               
 2019-20
TELUGU STUDY MATERIAL 
CLASS: 10

ఉపవాచకం : రామాయణం


                       
Name: Section: 

                                              


…………………………………………………………………………………………………………………………………………………………………………………………………..
 (10వ తరగతి ఉపవాచకం)
రామాయణం
పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు :
విస్తార పఠనం అలవరచుకోవడం
మన ఇతిహాసాల గురించి తెలుసుకోవడం 
నైతిక విలువలు పెంపొందించుకోవడం
కథను సొంతమాటల్లో చెప్పగలగడం 
1. రామాయణాన్ని ఎందుకు చదవాలి ?
జ: రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుoడి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది. రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యాను రక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలు ఎన్నో దీనిలో కనబడతాయి.
      రామాయణాన్ని చదవదంటే, జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్నచిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రామాయణంలో వాల్మీకీ మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటినుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్ప మాటను పలికించాడు. రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి’ అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు” మనిషి ఉన్నంతవరకు రామాయణం ఉంటుంది. 
    రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకీ సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాలవారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం రామాయణాన్ని తప్పక చదవాలి. 
2. ‘రామాయణం’ ఏవిధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.   
జ: ‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం.అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశవిదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.
  సంస్కృత సాహిత్యం  -  రామకథ : రామకథ వివిధ రూపాల్లో కనబడుతుంది. 1) ఆధ్యాత్మ రామాయణం  2)కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతో పాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది. 3) చంపూ రామాయణం  -  భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు. 4) “రావణవధ” దీనిని భట్టికవి రాశాడు. 5) ’ప్రతిమానాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు. 6) ఉత్తర రామచరితం : భవభూతి నాటకంగా దీనిని రాశాడు. 7) రాఘవ పాండవీయం : రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనుంజయుడు దీనిని రాశాడు.
     కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధ చరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్”, ‘మంత్రరామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి మంచి పేరుంది.తమిళభాషలో ‘కంబరామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “ఆధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం” చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్రరామాయణం” రాశాడు.    
3. తెలుగులో వచ్చిన రామాయణాలను గురించి రాయండి.
 జ: తెలుగు భాషలో రామాయణాలు : గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలోనే సాగాయి. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్రవేసింది. హుళక్కిభాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కరరామాయణం” రాశాడు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథరామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు. 
    కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం” రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంధ్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావు గారు “ఆంధ్రవాల్మీకి రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవ కవి యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. ఇవికాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చాయి.
1. బాలకాండం
1. వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
జ: నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “మంచిగుణాలు కలవాడూ, మాటతప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలైన శుభలక్షణాలు గలవాడు” ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడిలో నీవు అడిగిన గుణాలన్నీ ఉన్నాయనీ, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
      వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో ఒక మగ క్రౌంచపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం ఆయన నోట వెలువడింది. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
      సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో  ‘మానీషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు  రామాయణం రాయి. ఈ భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.
2. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి రాయండి.
జ: సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం అయోధ్య. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం, భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు
అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు. ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడురోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రులకోసం యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని, దేవతలు బ్రహ్మను కోరారు. 
    బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే  మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు విష్ణుమూర్తిని మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయమిచ్చాడు.
    దశరథుడి పుత్రకామేష్ఠి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొని వచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథునికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు.కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.  
3. రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
  జ: రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదని యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు. తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసుల మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.  
   విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటకి అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దభేరి బాణంతో రాముడు తాటకను చంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయింది.
4. సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
జ: విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాo” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గురించి, గంగ వృత్తాంతాన్ని గురించి చెప్పాడు. భగీరథుని వృత్తాంతo చెప్పాడు. మిథిలానగరం సమీపంలో వారు గౌతమమహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పుచేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడిఉండమని శపించాడు. రాముని రాకతో ఆమెకు శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై 
గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.
     మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రాముడికి కృతఙ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. కాబట్టి ఆ ధనుస్సు చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సు ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తాననీ చెప్పాడు. చాలామంది రాజులు శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు. విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేల మంది కలిసి శివధనుస్సు ఉన్న పెట్టెను సభలోకి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వనిచేస్తూ విరిగింది.
    జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురు పెట్టారు. అయోధ్యనుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.     


 5. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెల్పండి.
 జ: జనకమహారాజు, విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకమహారాజునకు రామలక్ష్మణులను చూపించి, ”వీరు దశరథ మహారాజు కుమారులు, వీరులు. మీ దగ్గర ఉన్న శివధనుస్సును చూడా లనుకుoటున్నారు” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను చెప్పాడు. యాగం కోసం తాను భూమిని దున్నుతుండగా ‘సీత’ దొరికిందనీ, శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే సీతకు తగిన భర్త అనీ అన్నాడు. పూర్వంలో రాజులెవ్వరూ శివధనస్సు ఎక్కుపెట్టలేకపోయారని జనకుడు చెప్పాడు. విశ్వామిత్రుడు జనకమహారాజు మాటలు విని శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేల మంది బలవంతులు శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి తగలగానే శివధనుస్సు వంగింది. రాముడు వింటికి నారి సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాoతంగా లాగాడు. పిడుగుపడ్డట్టుగా భయంకర శబ్దాన్ని చేస్తూ శివధనుస్సు ఫెళ్ళున విరిగింది.  జనక విశ్వామిత్రులు, రామలక్ష్మణులు తప్ప, మిగిలినవారంతా మూర్చపోయారు.
6. “జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తమై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం” సమర్థిస్తూ రాయండి.
 జ: విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణకై రాముని తన వెంట పంపించమని దశరథుని కోరాడు. వశిష్ఠుని హితవచనాలు విని, దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగించాడు. విశ్వామిత్రున్ని రామలక్ష్మణులు అనుసరించారు. వారు చాలా దూరం, సరయూనదీ తీరం వెంట ప్రయాణించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలను బోధించాడు. ఆ విద్యల ప్రభావం వల్ల వారికి ఆకలిదప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గిపోవు. నిద్రలో ఉన్న అజాగ్రత్తలో ఉన్న రాక్షసులు వారినీ ఏమీ చేయలేరు. మూడులోకాల్లో రామలక్ష్మణులను ఎదిరించి పోరాడేవారు ఉండరు.  రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు. గురుసేవ విశేషఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొందడంలో శిష్యులు నిరంతరం అప్రమత్తమై ఉండాలి. అదే ఉత్తమ విద్యార్థుల లక్షణం. 
   ఉత్తమ విద్యార్థులైన రామలక్ష్మణులు, గురువుగారు చెప్పినట్లు ‘తాటకి’ అనే రాక్షసిని సంహరించారు. అందుకు సంతోషించి విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులకు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. గురువు అనుగ్రహిస్తే శిష్యునకు ఇవ్వలేనిది ఏమీ ఉండదు. జ్ఞానాన్ని పొందడంలో ఎప్పుడూ అప్రమత్తమై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం అని దీనిని బట్టి గ్రహించాలి. రాముడు అప్రమత్తమై ఉన్నందువల్లే, విశ్వామిత్రుడి నుండి అనేక విద్యలూ, శస్త్రాస్త్రములూ సంపాదించాడు.
7. దశరథుడు సంతానం కోసం చేసిన యాగాలు ఏమిటి ? యాగనిర్వహణ భారం ఎవరు వహించారు ?
 జ: దశరథుడు సంతాన ప్రాప్తికోసం “అశ్వమేధయాగం”, పుత్రసంతానం కోసం “పుత్రకామేష్టి” యాగం చేశాడు. అశ్వమేధయాగం చేయాలి అనుకొన్నప్పుడు మంత్రీ, సారథీ అయిన సుమంత్రుని సలహా మేరకు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. మూడురోజులపాటు అశ్వమేధయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాడు. తర్వాత దశరథుని కోరిక మేరకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగభారాన్ని కూడా వహించాడు. ఈ యాగానికి బ్రహ్మాదిదేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హాజరై దశరథుని కోరిక తీరాలని దీవించారు.
8. ‘భగీరధ ప్రయత్నం’ అనే జాతీయానికి సంబంధించిన కథను తెలపండి.
జ: భగీరధుడు పాతాళంలో బూడిదకుప్పలై పడిఉన్న సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించాలనుకున్నాడు. అందుకు ఆకాశంలో ఉన్న సురగంగను పాతాళానికి రప్పించాలి. దృఢసంకల్పానికి అసాధ్యమేమున్నది. బ్రహ్మకోసం తపస్సు చేసి అతని సలహా మేరకు గంగను ఒప్పించి, ఆకాశం నుండి దూకే గoగను భరించడానికి శివుణ్ణి మెప్పించి, గంగను నేలకు తెచ్చి జహ్నుడు అడ్డురాగా అతనిని ప్రార్థించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళి పని పూర్తి చేయగలిగాడు. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టువదలని సందర్భంలో  భగీరధ ప్రయత్నం అనే జాతీయo ఏర్పడింది.  
2. అయోధ్య కాండం
1. సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
 జ: శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు. రాజాజ్ఞాతో మంత్రులూ, అధికారులూ రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రామున్ని పిలిచి, పట్టాభిషేకం గురించి చెప్పి, రాజధర్మాలను బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాసదీక్ష చేపట్టారు. రాముడి పట్టాభిషేకం వార్త, కైక దాసి మoథరకు తెలిసింది. వెంటనే వెళ్లి కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్భోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకొమ్మని, మంథర కైకకు సలహా  ఇచ్చింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు  రాగానే కైక అతడిని రెండువరాలు కోరింది.  అవి: 1) భరతుని పట్టాభిషేకం 2) రాముని వనవాసం. దశరథుడు రామున్ని అడవులకు పంపవద్దని కైకను బతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.
   కైక రామునికి కబురంపింది. రాముడు వచ్చి తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలను గురించి చెప్పింది. తండ్రిమాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గురించి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు కూడా చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.
    కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి  సేవ చేయాలని రాముడు తల్లికి నచ్చచెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వనవాసానికి వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలు ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లకష్మణుడితో సీతారాములను తల్లిదండ్రులవలె సేవింపుమని  ఉపదేశించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.      

2. సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
 జ: సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో నచ్చచెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను అడవికి వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.
   రాముని రథం కోసలదేశo పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు. గుహుడు గంగను దాటడానికి రామునికోసం నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. మహర్షి సీతారామలక్ష్మణులకు అతిథి సత్కార్యాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు. 
   జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమవాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలో ఉన్న ‘చిత్రకూటం’ పవిత్రమైనదననీ, అది మహర్షుల నివాసస్థానం అనీ, భరద్వాజుడు వారికి చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.  
3. “భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
 జ: దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరతశత్రుఘ్నులు మేనమామ ఇంటిలో  ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు, దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్లి ఎనిమిదవ రోజున భరతశత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. భరతుడు కైకను తప్పుపట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించుమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుబట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువస్తానని, భరతుడు అయోధ్యాపురవాసులతో కలిసి అడవికి బయలుదేరాడు. భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక తికమకపడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు. భరతుడు సేనలతో వస్తూ ఉండటం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రాముడికి చెప్పాడు. భరతుడు అటువంటివాడు కాదని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.
   భరత శత్రుఘ్నులు వెళ్లి రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు.  రాముడు భరతునికి రాజనీతులు బోధించాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రిమాటే తనకు శిరోధార్యం అన్నాడు. చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం పూర్తికాగానే, రామదర్శనం కాకపొతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు రామునితో చెప్పాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.   
4. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సివచ్చింది?
 జ: ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు. రామునికి దశరథుడు పట్టాభిషేకం గురించి చెప్పాడు. సీతారాములు ఉపవాస దీక్ష చేపట్టారు. రాముని పట్టాభిషేక వార్త కైక దాసి మంథరకు తెలిసింది. మంథర కైకకు దుర్భోధచేసి, ఆమె మనస్సును మార్చింది. కైకకు దశరథుడు వెనుక రెండు వరాలు ఇచ్చాడు. వాటిని అప్పుడు ఉపయోగించుకొమ్మని కైకకు మంథర చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు  రాగానే కైక అతడిని రెండువరాలు కోరింది.  అవి: 1) భరతుని పట్టాభిషేకం 2) రాముని వనవాసం. దశరథుడు రామున్ని అడవులకు పంపవద్దని కైకను బతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు. కైక దశరథుని అనుమతితో రామునికి కబురంపింది. 
   రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని, కైకను అడిగాడు. కైక తాను కోరిన వరాలను గురించి చెప్పింది. రాముడు తండ్రిమాటను పాటిస్తానన్నాడు. రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు. అక్కడి నుండి తల్లి కౌసల్య వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు. రాముని వెంట సీతాలక్ష్మణులు కూడా వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైక వారికి నారచీరలు ఇచ్చింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు. ఈ విధంగా సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు.  
5. దశరథునికి “శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ” వివరించండి.
జ: దశరథునికి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ. నలుగురు కొడుకులను నాలుగు చేతులలాగా భావించాడు. భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల వారంటే బెంగ. శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. అందుకు కారణం శ్రీరాముడు సద్గుణరాశి. రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు. మృదువుగా మాట్లాడుతాడు. కోపం, గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించడు. శరణుకోరేవారిని కాపాడేవాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృథా చేయక సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులపట్ల భక్తి కలవాడు. సోమరితనం, ఏమరిపాటు, అసూయ, మాశ్చర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. కళలలో ఆరితేరినవాడు.


3. అరణ్యకాండo
1. సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి.  (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
 జ: సీతారామలక్ష్మణులు దండకారణ్యoలో ప్రవేశించారు. అక్కడ మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు. వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధున్ని గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపం వల్ల తాను రాక్షసుడుగా అయ్యాననీ చెప్పి, వారిని శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.
    రామలక్ష్మణులు విరాధున్ని గోతిలో పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. ఆయన తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని వారికి ఆయన చెప్పాడు. మునులు రాముణ్ణి కలిసి, రాక్షసుల బాధల నుండి తమను రక్షించమని కోరారు. రాముడు సరే అన్నాడు. సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.  సీతారామలక్ష్మణులు అగస్త్యభ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్యమహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.
    రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.
2. రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
 జ: సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండకారణ్యoలో ఉన్న సోదరుడు ఖరుడికి ఈ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు. ‘అకంపనుడు’ అనే గూఢాచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.
     రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్లి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చేయమని  అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే చంపుతానన్నాడు రావణుడు. దానితో మారీచుడు చేసేదిలేక బంగారు లేడిగా మారి, రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది. ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రామున్ని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదనలేక లక్ష్మణున్ని సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా! హా లక్ష్మణా!” అని అరిచింది. ఆధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడనీ, లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతడిని నిందించింది. చివరకు లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.
3. రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
 జ: మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెతికారు. వనమంతా గాలించారు. సీతజాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు. రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడనీ వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పి, మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.
   రామలక్ష్మణులు “క్రౌoచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ, లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులనూ, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు కబంధుడు. ‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణులను తినడానికి నోరు తెరిచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు. రామలక్ష్మణులు రావణుని గురించి కబంధున్ని అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుని గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికీ అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు. 
     రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పoడ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరుకున్నారు.  


4. ‘అరణ్యకాండo’ ఆధారంగా దండకారణ్యాన్ని వివరించండి. 
 జ: దండకారణ్యం దట్టమైన పెద్దపెద్ద వృక్షాలతో చాలా విశాలపరిధిలో వ్యాపించి ఉన్నది. ప్రశాంతమైన ప్రదేశం. అనేక మునుల ఆశ్రమాలతో ఎందరికో వనవాసానికి అనుకూలంగా ఉండేది. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రదేశం. అక్కడ లోక క్షేమం కొరకు యాగాలు జరుగబడేవి. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలిసిన రాముడు దండకారణ్యంలో ప్రవేశించగానే వింటి నుండి అల్లెత్రాడును వేరుచేశాడు. రామలక్ష్మణులు సీత మునుల కోరిక మేరకు వారి ఆశ్రమాలను దర్శిస్తూ, ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ ప్రయాణం కొనసాగిస్తే పదిసంవత్సరాల సమయం గడిచింది. అంటే దండకారణ్యం ఎంత విశాలంగా విస్తరించిందో అర్థమవుతున్నది.  

4. కిష్కింధా కాండo
1. వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి. 
జ: వాలి, సుగ్రీవులు వానరులు. వీరు అన్నదమ్ములు. అందులో వాలి పెద్దవాడు. గొప్ప బలశాలి. తండ్రి తరువాత వాలి కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి సుగ్రీవుడిని గుహద్వారం వద్ద ఉండమని చెప్పి తాను గుహలోకి వెళ్లి మాయావితో యుద్ధం చేశాడు. సంవత్సరం తరువాత గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. మాయావి అరుపులు వినిపించాయి. దానితో వాలి చనిపోయాడని భావించి, సుగ్రీవుడు బిల ద్వారం మూసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని రాజును చేశారు. తరువాత వాలి వచ్చి, సుగ్రీవునిపై కోపించి, రాజ్యం నుండి తరిమి, అతని భార్య రుమను అపహరించాడు. 
   సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉండేవాడు. మతంగమహర్షి శాపం వల్ల  వాలి అక్కడకు రాలేడు. హనుమంతుడు రామసుగ్రీవుల మైత్రి కూర్చాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేస్తానన్నాడు. రాముడి సహాయంతో సుగ్రీవుడు వాలిపై యుద్ధానికి వెళ్ళాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలిక. అందువల్ల రాముడు వాలిపై బాణం వేయలేదు. సుగ్రీవుడు యుద్ధంలో ఓడిపోయాడు. రాముడు సుగ్రీవుని మెడలో గుర్తుగా నాగకేసరపు లతను వేయించి తిరిగి వాలిపై యుద్ధానికి సుగ్రీవుని పంపాడు. వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా రాముడు వాలిని బాణంతో కొట్టి చంపాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చాడు. వాలి తారా అoగదులను సుగ్రీవునకు అప్పగించాడు.
2. రామసుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
 జ: వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకోమని తనమంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు. హనుమ సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గురించి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు.హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కిoచుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. 
     సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నాననీ చెప్పి ఆమె జారవిడిచిన నగలమూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలు చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో  ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.సుగ్రీవుడు రామలక్ష్మణులతో  కలిసి కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు. 
     రాముడు సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత” ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణకోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వoలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానరులను పంపాడు. దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్లి లంకలోని సీతజాడను తెలుసుకుంటానని మహేంద్రగిరి పైకి చేరాడు.   
3. హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది ?
 జ: సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకు పంపాడు. అంగదుని నాయకత్వoలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు. అంగదుని నాయకత్వoలో దక్షిణ దిశకు బయలుదేరివచ్చిన వానర వీరులు అణువణువునూ వెదుకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెల పూర్తైంది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదులుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరకు వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీతజాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు. 
       వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రం దాటాలి. అది ఎవరివల్ల అవుతుందో వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు. జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు. హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి ఉన్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.
   హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.
                                                   5. సుందర కాండం
1. హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
 జ: శ్రీరాముడు పద్మముల వంటి కన్నులు కలవాడు. చక్కని దేహ సౌందర్యము, గుణసంపద కలవాడు. తేజస్సులో రాముడు సూర్యుడి వంటివాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో  బృహస్పతి. కీర్తిలో దేవేంద్రుని వంటివాడు. రాముడు శరణు అన్నవారిని రక్షిస్తాడు. శత్రువులను సంహరిస్తాడు. రాజవిద్యాకుశలుడు. సర్వ విద్యా పండితుడు. వినయము గలవాడు. యజుర్వేదమందు, ధనుర్వేదమందు పండితుడు. విశాలమైన భుజములు, శంఖం వంటి కంఠము, శుభప్రదమైన ముఖము కలవాడు. దుందుభి వంటి కంఠస్వరము కలవాడు.శ్రీరాముడు సకల ఐశ్వర్య సంపన్నుడు. శ్రీరాముడు సత్యము మాట్లాడుటయందు, ధర్మాచరణము నందు ఆసక్తి కలవాడు. పాత్రులకు దానము చేస్తాడు. అందరితో ప్రియముగా మాట్లాడుతాడు. శ్రీరాముడు మేఘమువలె శ్యామల వర్ణము గలవాడు. 
     శ్రీరాముడు దశరథుని పెద్ద కుమారుడు. శ్రీరామచంద్రుడు చంద్రుడివలె చక్కని ముఖము కలవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. ధర్మ రక్షకుడు. అరివీరభయంకరుడు అని హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతకు చెప్పాడు. 
2. హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
 జ: హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకున్ని పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరి శిఖరాలపై విశ్రాంతి తీసుకుంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకున్ని చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షఃస్థలంతో నెట్టి వేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకున్ని చేతితో తాకి ముందుకు సాగాడు. హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుడిని అడ్డగించింది. హనుమ లంకను చూసివస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్కదెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్లమంది.
హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎదమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు. హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టు మీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనసును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండునెలల గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు, సీత మనస్సును మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.
    విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కలవచ్చిందనీ, ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, లంక ఛిన్నాభిన్నం అయ్యిందనీ, రాముడికి జయం కల్గుతుందనీ చెప్పింది. సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీవెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం కలుగుతుంది” అన్నాడు. తన పేరు సీతఅని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడని అనుకుంది. రామదూతవైతే రాముని గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకు గుర్తుగా ఇచ్చాడు.
 రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకువెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ ఆమెకు చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి తనను తీసుకువెళ్ళడం ధర్మమని చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురిని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.
3.హనుమ లంకను కాల్చివచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి. (లేదా) సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలపండి.
 జ: సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్య కార్యం పూర్తైంది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోకవన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేలమంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్లను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రిపుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారున్ని కూడా హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పనిచేసింది. 
   రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని రావణుడికి చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుడి తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు హనుమ తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు. తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీత ఆ మంటలలో కాలిపోయిందేమోనని సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీతవద్దకు తిరిగి వెళ్లి  ఆమెకు నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.
    హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు. హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు.  అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొనివచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి ముందు విషయం తెలుపుదాం అన్నాడు. దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు అదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన  చూడామణిని రాముడికి గుర్తుగా ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

 4. అశోకవనంలో హనుమ – సీతల (సీతాహనుమల) సంభాషణను విశ్లేషిస్తూ, వారి స్వభావాలను రాయండి.
 జ: సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. రామ ముద్రికను అతడు సీతకు సమర్పించాడు. రామ ముద్రికను చూసి పతివ్రతయైన సీత పరమానందభరితురురాలు అయ్యింది. సీత తన దీనావస్థను హనుమకు వివరించింది. రాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి, తనను రాక్షసుల చెరనుండి విడిపించుమని సీత హనుమంతునికి చెప్పింది. తన వీపుమీద కూర్చుంటే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనని హనుమంతుడు సీతకు చెప్పాడు. కానీ సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది. తాను పరపురుషుని తాకనని సీత చెప్పింది. రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని హనుమ అడిగితే, సీత తన చూడామణినిహనుమకు ఇచ్చింది. 
   సీతాహనుమల సంభాషణను బట్టి, సీతమ్మను వెంటనే తీసుకొని వెళ్లి, సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ తలంచాడనీ, అతడు స్వామికార్య ధురంధరుడనీ తెలుస్తుంది. సీతహనుమల సంభాషణను బట్టి, సీత తనకు వెంటనే చెరనుండి విముక్తి కలగడం ప్రధానం కాదని భావించింది. పాతివ్రత్యం కాపాడుకోవడం ఆమెకు ముఖ్యమని తెలుస్తుంది. దొంగతనంగా హనుమంతుడు సీతను తీసుకువెడితే అది రాముడికి అపకీర్తి అని భావించింది. రావణుని యుద్ధంలో చంపి తనను రాముడు తీసుకొని వెడితే అది రాముడికి కీర్తిని కలిగిస్తుందని సీత అభిప్రాయపడింది.  
6. యుద్ధ కాండం
1. శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
 జ: సీతాదేవిని చూసివచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసుకొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేగాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గురించి తెలిపాడు. విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని,రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.
    విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచిపెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటుకు చేరాడు. విభీషణుడు రాముని శరణుకోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే  సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునకు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు తాను ఎక్కుపెట్టిన అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.
    రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణసుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.  ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.  


2. వానరసైన్యానికి, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి. 
జ: రాముడు సైన్యాన్ని విభజించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలుసుకోవడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు నిలబెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించి పంపాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు. రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని అబద్ధం చెప్పాడు. విద్యుజ్జిహ్వుడిచే రామునివి అనిపించే మాయాశిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.
   శ్రీరామచంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు. అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపివచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.   
లంకపై దండయాత్ర : వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపటయుద్ధానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయినరాక్షస స్త్రీలు సీతను పుష్పకవిమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్ష్మణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుటపడింది. గరుత్మంతుడి  రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు.దశగ్రీవుడు కంపించిపోయి ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు. 
   రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు.రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మని పంపాడు.
3. రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
 జ: రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం లకష్మణుడి గుండెపై నాటుకుంది. లక్ష్మణుడు స్పృహ తప్పాడు. హనుమంతుడు రావణుడి వక్షస్థలంపై గుద్ధి కిందపడేట్లు చేశాడు. రాముడు హనుమ భుజాలపై కూర్చొని, రావణుడితో యుద్ధం చేసి, రావణుని ధనుస్సును విరిచాడు. రావణుని కిరీటం నేలపై పడింది. రాముడు రావణునితో “యుద్ధంలో అలసిపోయావు విశ్రాంతి తీసుకొని రా. నా బలం చూపిస్తా” అన్నాడు. రాముడు కుంభకర్ణుని చంపాడు. లక్ష్మణుడు ఐoద్రాస్త్రంతో  ఇంద్రజిత్తును చంపాడు. రావణుడు శక్తిని ప్రయోగించాడు. రాముడు దాన్ని ప్రార్థించాడు. లక్ష్మణుడు పడిపోయాడు.  రాముని విలువిద్య ముందు రావణుడు నిలువలేక పరుగు తీశాడు. హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుడిని బతికించాడు. ఇంద్రుడు రామునకు దివ్యరథాన్ని పంపాడు. రాముడు ఆ రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. క్రమంగా రాముని ముందు రావణుడు నిలువలేక పోయాడు.రావణుని రథసారథి రథాన్ని ప్రక్కకు మళ్ళించాడు. అగస్త్య మహర్షి రామునికి, ఆదిత్యహృదయo ఉపదేశించాడు. రాముడి బాణాలు తగిలి రావణుని తలలు తెగిపడ్డాయి. కాని తిరిగి మొలుస్తున్నాయి. 
    రామరావణ యుద్ధానికి సాటి రామ, రావణ యుద్ధమే. మాతలి బ్రహ్మాస్త్రాన్ని  ప్రయోగించమని రామునికి సూచించాడు. రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు.
4. రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
 జ: మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తరక్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది. విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోవడానికి రావణుడి చెరనుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచాన ఉన్నందున తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చుననీ, అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా  గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.
    సీత శీలాన్ని ముల్లోకాలకు చాటడానికే, సీత అగ్నిప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానని చెప్పి, సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుడి కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్నవిషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురు పంపాడు.  పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకున్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.  రాముడు ప్రజలను కన్నబిడ్డల వలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడుచుకున్నారు. రాముడు 11వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే ‘రామరాజ్యం’  అనే మాట ప్రసిద్ధం అయ్యింది.